పరవస్తు వెంకట రంగాచార్యులు

రచయిత, కవి

పరవస్తు వేంకట రంగాచార్యులు ( మే 22, 1822 - జనవరి 20, 1900) సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త, చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము, వ్యాకరణాలలో నిష్ణాతుడు.

పరవస్తు వేంకట రంగాచార్యులు
దస్త్రం:పరవస్తు వేంకట రంగాచార్యులు.jpg
జననంమే 22, 1822
మరణంజనవరి 20, 1900
వృత్తికవి
బిరుదుమహామహోపాధ్యాయ
తల్లిదండ్రులు
  • శ్రీనివాసాచార్యులు (తండ్రి)
  • మంగమ్మ (తల్లి)

జననం సవరించు

శ్రీ పరవస్తు వేంకట రంగాచార్యులు 1822, మే 22విశాఖపట్నంలో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన సకల శాస్త్ర పారము చూసిన మహా పండితులు సంస్కృతం, ప్రాకృతం భాషలలో నిష్ణాతులు. విశాఖపట్నం లోని "గ్రంథ​ ప్రదర్శిని" నిర్వాహకులు.

వేంకట రంగనాధస్వామి అయ్యవార్లు (1875 -1918) రంగాచార్యుల వారి జేష్ఠ పుత్రులు. మహా మహోపాధ్యాయ బిరుద విరాజితులగు రంగాచార్యుల వారు తమ జీవిత చరమదశలో పెద్దాపుర సంస్థానం పరిశిష్టమైనటువంటి కోఠాం ఎస్టేటు వారి ఆస్థానమున పండితులుగా వుండిరి.[1]

ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే కావ్యమును రచించాడు. ఉర్లాం, విజయనగరం, మైసూరు మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై మహా మహోపాధ్యాయ అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ఠ గ్రంధాలుగా ఎన్నదగిన కమలిని కలహంసము, వేద రహస్యము, మంజుల నైషదము లను రచించాడు.

తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు భారతదేశములో క్రైస్తవ మత బోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము, సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. ఈయన చివరి రోజులు తునిలో గడిపాడు.

పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాది క్రమములో నిఘంటువులు వ్రాసే ప్రయత్నము జరిగినది. రాబర్ట్ కాల్డ్వెల్ , చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.

పరవస్తు వెంకట రంగాచార్యులు తెలుగులో ప్రప్రధమముగా ఒక విజ్ఞాన సర్వస్వమును ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి "అ", "ఆ" వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము కొమర్రాజు లక్ష్మణరావు చేపట్టారు.

మరణం సవరించు

ఈయన 1900, జనవరి 20తుని లో మరణించాడు.

రచనలు సవరించు

  • మంజుల నైషధము
  • లఘు వ్యాకరణము
  • ప్రపత్తి వాదము
  • కుంభకర్ణ విజయము
  • శకుంతలము
  • కమలినీ కలహంసము
  • శబ్దార్ధ సర్వస్వము
  • కేనోపనిషత్తుకి పద్య అనువాదము
  • మాండూక్యోపనిషత్తుకి పద్య అనువాదము

మూలాలు సవరించు

  1. ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము - డా తూమాటి దోప్పన్న పేజి నం 275 యీయున్ని వేంకట వీర రాఘవా చార్యులు, పరవస్తు పండిత త్రయము, ఆంధ్రప్రత్రిక సంవత్సరాది సంచిక, అంగీరస, 1932, పుటలు, 181-184.
  • తెలుగు వైతాళికులు - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
  • ఆంధ్ర రచయితలు - మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940, పేజీలు: 53-7.