పిండారీ అనేది ఒక వ్యవస్థీకృత దోపిడీ ముఠా. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ లలోని ఒక తెగ ఇది. వీరు ముఠాలుగా ఏర్పడి, గుర్రాలపై వచ్చి, గ్రామాలపై మెరుపుదాడి చేసి నగలూ, ధాన్యం దోచుకుపోయే వారు. 1814లో దాదాపు 25,000 మంది పిండారీలు ఉండేవారు, 20,000 గుర్రాలుండేవి. 1816లో కేవలం పదకొండున్నర రోజుల్లో 339 గ్రామాలను వారు దోచుకున్నారు. 1816 మార్చిలో 2000 గుర్రాలపై వచ్చి గుంటూరు జిల్లాలో 40 గ్రామాలను దోచుకున్నారు. ఎంతో మందిని చంపి, ఊళ్ళను తగలబెట్టెసారు. స్త్రీలను చెరబట్టి, బానిసలుగా అమ్మేసారు. వారిలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కడ చూసినా శవాలే. మంగళగిరిలోను అదే పరిస్థితి.

వారు తప్పకుండా ఏటేట గ్రామాలకు దర్శనమిచ్చి పొయ్యేవారు. పంటలు కోతల కెప్పుడు సిద్దమయ్యేది రైతులకంటే ముందుగా పిండారీలకే తెలిసేది. కాన వారు తీరా కోతసమయానికి ప్రత్యక్షమై ధాన్యము పూర్తిగా ఊడ్చుకొని పోయెడివారు.

ఇంగ్లీషువారు బెంగాలు బీహారులను దోచుకొనుటలో నిమగ్నులై యుండిరి. తమ భాగాలలోనికి పిండారీలు రానంతవరకు వారికి చీమకుట్టినట్లు కాలేదు. అందుచేత పిండారీలు ఇంచుమించు 50 ఏండ్లవరకు నిరాఘాటముగా తమ ఉద్యమమును సాగించిరి. అప్పుడు ప్రజలే తమకు తోచినట్లు ఆత్మరక్షణము చేసికొనిరి. తెనుగు దేశములోని చాలా గ్రామాలలో గ్రామస్వరూపము మారి పోయెను. గ్రామాలకు నాలుగు దిక్కులా బురుజులను కట్టి వాటికి మధ్య పెద్ద గోడలను నిర్మించి ఊరవాకిలి పెద్దగవని తలుపులతో గడెమ్రానితో నిర్మించిరి. చీకటి పడీ పడకమునుపే తముకువేసి ఊరవాకిండ్లు బంధించేవారు. అచ్చట తలార్లు బేగారీలు సేత్సందీలు కావలి కాసేవారు. కాని పిండారీలు పగలే వచ్చేవారు. అందుచేత బురుజులపై మచ్చెలువేసి కావలికాసి దూరాన దుమ్మురేగుట కానరాగానే నగారా వాయించి పొలాలలోనుండు జనులను గ్రామాలలోనికి రప్పించి ఊరవాకిలి బంధించి జనులు బురుజులపై గోడలపై నెక్కి యుద్ధానికి సిద్ధపడేవారు.

యువతులను ముగ్గురి నల్గురి కలగట్టి మూటలవలె తమ గుర్రాలపై వేసి బానిసలుగా అమ్ముకొనుటకు తీసికొనిపొయిరి." (R. Williams P. 141-43.)

పిండారీలు స్త్రీలను వారి భర్తలయెదుటనే చెరిచెడివారు. తాము తీసుకొని పోజాలని వస్తువులనైన వదలక వాటిని ధ్వంసముచేసి పోయెడివారు. ధనము దాచిన తావులు చూపనివారిముఖానికి ఉడుకుడుకు బూడిదను సంచులలో నింపి కట్టి వీపున గ్రుద్ది ఆ బూడిద వారినోళ్ళలో ముక్కులలో పోసి ఊపిరి తిరుగకుండునట్లు చేసేవారు. తర్వాత వారు చాలాకాలము బ్రదుక కుండిరి. జనులను వెలకిల పండబెట్టి ఎదలపై పెద్దపలకలబెట్టి వాటిపై జనులచే త్రొక్కించెడివారు. ఇట్టి అమానుషకృత్యా లెన్నో చేసిరి. పిండారీలలో మరాటీ లెక్కువైనను వారితో బాటు మొగల్ రాజ్య సేనాభ్రష్టులును, దోపీడీల రుచి గొన్నవారును నగు ముసల్మానులు పెక్కుండిరి. వారి స్త్రీలు వారివెంట నుండిరి. హిందూ స్త్రీలవలె వేషాలు వేసుకొని హిందూ దేవతలనే కొలిచెడివారు. (బహుశా వారు పూర్వము హిందువులై బలవంతముగా ఇస్లాం మతము పుచ్చుకొన్న వారి సంతతియై యుందురు). వారు సవారిచేసి బయళ్ళలో సంచరించి కర్కశకాయలై మగంగులై మగవారి నెత్తి దన్నినవారైన లంకిణీలు మగవారికంటే వారే రాకాసి పనులుచేసి కరుణ అన్న దే కోశమందును కాసంతయు లేనివారై ప్రజల హింసించు చుండినందున జనులు వారిని చూస్తే నిలువున నీరయ్యేవారు.

తర్వాతి కాలములో ఈ ఘోరాలు ఎక్కవగా కంపెనీ ఇలాఖాలలో కావడము చేత తుదకు హేస్టింగ్సు గవర్నరు జనరల్ 1,200,000 సైన్యమును సమీకరించి వారిని ధ్వంసము చేసెను.

బ్రిటిషు వారి పాలనలో అడవులను ఆక్రమించి అక్కడి వారికి జీవన భృతి లేకుండా చేసారు. వారు చివరికి దొంగలుగా మారారు. బ్రిటిషు ప్రభుత్వం వివిధ ప్రదేశాల్లో వీరికి ప్రత్యేకంగా ఆవాసం కల్పించింది. 1913లో అటువంటిదే ఒక స్థావరం మంగళగిరి వద్ద కృష్ణానదికి బకింగ్‌హాం కాలువకు మధ్య సీతానగరంలో ఏర్పాటు చేసారు. వీరంతా ఎరుకల కులస్తులుగా నేడు స్థిరపడి మంచి చదువులతో పదవులలో ఉన్నారు. అప్పటినుండి 1932 వరకు సాల్వేషను ఆర్మీ అనే సంస్థ దీనిని నిర్వహించేది. 1932 నుండి 1956 వరకు పోలీసు శాఖ నిర్వహణలో ఉండేది. 1956 లో సాంఘిక సంక్షేమ శాఖ అధీనంలోకి వచ్చింది. 1962లో ప్రభుత్వం వారికి నేరస్తులనే ముద్రను తొలగించి, వారికి జీవనార్ధమై 156 ఎకరాల భూమిని పంచింది.

పిండార్ అనే మరాఠా మాట pinda అనే మాటనుంచి వచ్చి వుండొచ్చంటారు. అంటే ప్రమాదకరమైన సుర (intoxicating drink) లేదా నిమర్ లోని పాంథర్ అనే గ్రామం పేరుమీదుగా కూడా అయి వుండవచ్చు. గడ్డిమోపు మోసుకు రావడం కూడా పిండా అంటారు. వీరు దోచుకున్న ధనాన్ని ఇలాగే మోసుకు పోతుండేవారు బలవంతంగా దౌర్జన్యంగా హింసించి ధనాన్ని అపహరించే సాయుధ అవ్యవస్దిత గుర్రపు రౌతు మూకలే పిండారీలు .ఆహారం, డబ్బుకోసం దోపిడీ చేసే ముఠా.17వ శతాబ్ది ముస్లిం పాలన నుంచి 19శతాబ్ది వరకు ఉన్నారు .ముస్లిం సైన్యానికి దారి చూపించేవారు .తర్వాత మరాఠా సైన్యానికి సహాయ పడ్డారు .1817-18లో వారెన్ హేస్టింగ్స్ నాయకత్వంలో వీరిని అణగ తొక్కి అంత౦ చేశారు .హత్యలు దోపిడీలు కొల్లగొట్టటాలు వీరి నిత్య కృత్యం .పిండారీ అనే మాట పింద్ర అంటే మత్తుకలిగించే ద్రవం అనే మరాఠీ మాట లోంచి పుట్టింది .ఇది గడ్డిమోపు, తీసుకొనే వాడు అనే రెండుమాటలలోంచి కూడా ఏర్పడిందిఅంటారు .వీరికి ఆశ్వికదళమే కాక కాల్బలమూ ఉండేది .వీరి ఆహార్యం –నెత్తిపై టర్బన్ తో అర్ధ దిగంబరంగా నడుం చుట్టూ వస్త్రంతో మాత్రమే ఉండేవారు .చేతిలో నిశితమైన ఖడ్గం అంటే తల్వారు ఉండేది. కాళ్ళకు పాదరక్షలు ధరించేవారు .శత్రు సైన్యం రహస్యాలను, కదలికలను పసిగట్టి తాము నమ్మిన వారికి అందించటంలో ఆరి తేరిన దిట్టలు .ఔరంగజేబు పాలనలో వీరి గురించి ప్రస్తావన మొదట వచ్చింది .తర్వాత, మరాఠా సైన్యానికి మద్దతు నిస్తూ మొఘల్ సామ్రాజ్య పాలనపై ఎదురు తిరగటంతో పిండారీలపాత్ర బాగా ప్రచారమైంది .శత్రు భూభాగం లోకి తేలికగా చొచ్చుకుపోయి వారిని కల్లోలపరచి కకావికలు చేయటంలో సిద్ధహస్తులనిపించారు .ఐతే 1791లో శృంగేరిశారదా పీఠంపై పిండారీల దాడి వారిని దూషణకు గురి చేసింది .శివాజీ పాలనలో వారి అధికారాలకు కళ్ళాలు బిగించాడు .

పిండారీలు ముఖ్యంగా ముస్లింలు . కాని వారి ముఠాలో అన్ని వర్ణాలవారినీ చేర్చుకొన్నారు .ఔరంగ జేబు చావుతో మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యాక, నవాబులు, హిందువులు బహిరంగంగా యుద్ధాలు చేశారు .స్థానిక భూస్వాములు స్వంతఖర్చుతో సైన్యాలను ఏర్పాటు చేసుకొన్నారు .మఠాలు, మఠాధిపతులు వారికి అండగా నిలిచారు .దేవాలయాలు నివాసాలయ్యాయి .మధ్యభారతం లోదక్కన్, గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఒరిస్సాలలో పిండారీలు దండిగా వ్యాపించారు .19వ శతాబ్ది ప్రారంభంలో పిండారీ నాయకుల, దళాల నిర్వహణ కోసం డబ్బు బాగా అవసరం వచ్చి తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గంగా దోపిడీలు బందిపోటుదొంగతనాలు, హత్యలు చేసి డబ్బు కూడబెట్టేవారు .సా.శ. 1800-15కాలంలో పిండారీల సంఖ్య 20వేలు నుంచి 30 వేలు ఉండేది .పల్లెటూళ్ల పై విరుచుకుపడి, అందిన౦తా దోచుకొని పోయేవారు.అమాయక ప్రజలను బానిసలు చేసి డబ్బుకు అమ్ముకొనేవారు .ఈ దౌర్జన్యాలతో స్థానిక నవాబుల హిందూ రాజులబ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించేవారు .
పిందారీలను అణచి వేయగానే వారు అనేక ప్రదేశాలకు వలస పోయారు .అక్కడి ప్రజలు పిండారీ స్త్రీలకు ఆవాసాలు ఏర్పరచి జీవించటానికి తోడ్పడుతున్నారు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో ఇలాంటి వసతి గృహాలున్నాయి .పిండారీ విమెన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పరచి వారి అభివృధికి జీవనోపాధికి వీలుకల్పిస్తున్నారు .ఆస్ట్రేలియాలోని స్ప్రింగ్ హిల్స్ లో పిండారీ వుమెన్ హాస్టల్ ఉంది .
హిమాలయాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పిండారీ నది ఉన్నది .దీని ప్రవాహం 105కిలోమీటర్ల వ్యాప్తిలో ఉండి తీరప్రాంతాలలో మన్మట్టి, నంద కేసరి, భాగోలి మొదలైన పట్టణాలున్నాయి .కర్ణ ప్రయాగలో పిండారీనది అలకనంద నదిలో సంగమిస్తుంది .అక్కడినుంచి అలకనంద పేరుతొ నే పిలువబడుతుంది .
"https://te.wikipedia.org/w/index.php?title=పిండారీ&oldid=3501322" నుండి వెలికితీశారు