పెరిన్ కాప్టెన్

భారత స్వాతంత్ర సమరయోధుడు

పెరిన్ బెన్ కాప్టెన్ (జ.1888 - మ.1958) భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు, సాంఘిక సేవిక, ప్రముఖ భారతీయ నాయకుడు, మేధావి అయిన దాదాభాయ్ నౌరోజీ మనమరాలు.[1] ఈమె దేశానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1954లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.[2] ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి వ్యక్తులలో ఈమె ఉంది.

పెరిన్ కాప్టెన్
జననం12 అక్టోబరు 1888
మరణం1958
తల్లిదండ్రులుఅర్దేషిర్ నౌరోజీ
వీర్‌బాయి దడీనా
పురస్కారాలుపద్మశ్రీ

జీవిత చరిత్ర మార్చు

పెరిన్ బెన్, 1888, అక్టోబరు 12న[3] గుజరాత్ రాష్ట్రంలోని కఛ్ జిల్లాలోని, మాండ్వీకి చెందిన ఒక పార్శీ కుటుంబంలో జన్మించింది.[1] ఈమె తండ్రి ఆర్దేషిర్ వృత్తి రీత్యా వైద్యుడు, దాదాభాయి నౌరోజీ పెద్ద కొడుకు.[3] ఈమె తల్లి వీర్‌బాయి దడీనా ఒక గృహిణి.[4] ఎనిమిది మంది సంతానంలో పెద్దదైన పెరిన్, ఐదేళ్ల వయసులోనే 1893లో తండ్రిని కోల్పోయింది. ప్రాథమిక విద్యాభ్యాసం బొంబాయిలో పూర్తిచేసుకొని, మూడవ పారిస్ విశ్వవిద్యాలయం (సోర్బోన్ నూవే) లో చేరి ఫ్రెంచి భాషలో పట్టభద్రురాలయ్యింది.

పారిస్లో ఉండగా, భీకాజీ కామాతో పరిచయం ఏర్పడింది. ఆమెతో తిరుగుతూ వారి కార్యక్రమాల్లో పాల్గొనటం ప్రారంభించింది. లండన్లో వినాయక్ దామోదర్ సావర్కర్ అరెస్టయినప్పుడు, ఆయన్ను విడిపించడానికి పన్నిన పథకంలో పెరిన్ పాత్ర కూడా ఉన్నదని వెలువడింది.[1][5] ఈ సమయంలో ఆమె సావర్కర్‌, భీకాజీ కామాలతో పాటు, 1910లో, బ్రసెల్స్‌లో జరిగిన ఈజిప్టు జాతీయ కాంగ్రేసు సమావేశంలో పాల్గొన్నది.[1][6][7] పారిస్లో, రష్యాలోని త్సార్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పోలిష్ వలస సంస్థలతో కూడా ఈమె పనిచేసింది.[1] 1911లో భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత, పెరిన్‌కు మహాత్మా గాంధీని కలిసే అవకాశం లభించింది. ఈమె గాంధీ భావాలతో ప్రభావితురాలైంది.[1] 1919 కల్లా, ఈమె గాంధీతో కలిసి పనిచెయ్యటం ప్రారంభించింది. 1920లో స్వదేశీ ఉద్యమంలో పాల్గొని, ఖాదీని ధరించడం ప్రారంభించింది .[3] 1921లో గాంధేయ భావాలపై ఆధారపడిన మహిళా ఉద్యమ సంస్థ, రాష్ట్రీయ స్త్రీ సభను స్థాపించడానికి సహాయం చేసింది.[8]

1925లో పెరిన్, ధున్‌జిషా ఎస్. కెప్టెన్ అనే న్యాయవాదిని ఈమె వివాహం చేసుకున్నది. ఈ దంపతులకు సంతానం లేదు. వివాహం తర్వాత ఈమె తన సామాజిక క్రియాశీలతను కొనసాగించి, భారత జాతీయ కాంగ్రేసు యొక్క అనేక కౌన్సిల్లలో పాల్గొన్నది. 1930లో పెరిన్, బొంబాయి ప్రదేశ్ కాంగ్రేసు యొక్క తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యింది. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళింది. ఆ తర్వాత స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో పలుమార్లు జైలుశిక్షను అనుభవించింది.[మూలాలు తెలుపవలెను] 1930లలో గాంధీ సేవా సేన పునర్వ్యవస్థీకరించనప్పుడు, ఈమె ఆ సంస్థకు గౌరవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై, 1958లో చనిపోయేవరకు ఆ పదవిలో కొనసాగింది.

భారత ప్రభుత్వం, 1954లో పద్మ పౌర పురస్కారాలను ప్రారంభించినప్పుడు, [9] పెరిన్ కాప్టెన్‌ తొలి జాబితాలోనే పద్మశ్రీ పురస్కారం అందుకొన్నది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Stree Shakthi". Stree Shakthi. 2015. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 31 March 2015.
  2. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 11 November 2014.
  3. 3.0 3.1 3.2 Anup Taneja (2005). Gandhi, Women, and the National Movement, 1920-47. Har-Anand Publications. p. 244. ISBN 9788124110768. Archived from the original on 2016-09-24. Retrieved 2017-11-27.
  4. "Zoarastrians". Zoarastrians. 2015. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 1 April 2015.
  5. "Making Britain". The Open University. 2015. Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 1 April 2015.
  6. Sikata Banerjee (2012). Make Me a Man!: Masculinity, Hinduism, and Nationalism in India. SUNY Press. p. 191. ISBN 9780791483695.
  7. Smith, Bonnie G., ed. (2008). The Oxford Encyclopedia of Women in World History: 4 Volume Set. Oxford University Press. p. 2752. ISBN 9780195148909. Archived from the original on 2016-09-24. Retrieved 2017-11-27.
  8. "Shodganga" (PDF). Shodganga. 2015. Retrieved 1 April 2015.
  9. "Padma Awards System" (PDF). Press Information Bureau, Government of India. 2015. Retrieved 1 April 2015.