బొడిచర్ల

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


బొడిచెర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం. ఇది మండల కేంద్రం మార్కాపురం పట్టణానికి 12 కి.మీ దూరంలో, జిల్లా కేంద్రం ఒంగోలుకు 90 కి.మీ దూరంలో ఉంది.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమార్కాపురం మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

బొడిచెర్ల గ్రామానికి బొడ్డుచెర్ల, బొడిచెర్ల అని రెండు రకాల పేర్లతో పిలుస్తారు. భూపతిపల్లి, బొందలపాడు, కారుమానుపల్లి, సూరేపల్లిమాల్యవంతునిపాడు మొదలగు గ్రామాలకు మధ్యలో ఉండటం వలన ఈ గ్రామానికి బొడ్డుచెర్ల అనే పేరు వచ్చింది.

దేవాలయాలు మార్చు

శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం: బొడ్డుచెర్ల గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వెలయడం వెనక ఒక విశిష్ట సంఘటన జరిగినట్లు చెప్పబడుతుంది. సుమారు 400 సంవత్సరాల క్రితం పలనాటి బ్రహ్మనాయుడు మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించిన కాలంలోనే ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగిందని పెద్దల అభిప్రాయం. అప్పట్లో ప్రస్తుత స్వామి వారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో అన్నపురెడ్డివారిపాలెం అనే చిన్న గ్రామంలో అన్నపురెడ్డి ఇంటి పేరు గల కొన్ని కుటుంబాలు నివసిస్తుండేవి. వారికి తిమ్మాపురం, మల్యవంతునిపాడు, బొడ్డుచెర్ల, బొండలపాడు, భుపతిపల్లె, తిప్పాయపాలెం, సూరేపల్లి గ్రామ ప్రాంతాలలో పంట పొలాలు ఉండేవి. ఈ పొలాలు గుండ్లకమ్మ నది పరీవాహక ప్రాంతంలో ఉండటం వలనను వర్షాలు సకాలంలో కురుస్తుండడం వలనను ఆ రోజుల్లో జొన్న పంట విస్తారం పండించేవారు. అందులో ఒక కుటుంబం వారు బొడ్డుచెర్ల గ్రామానికి ఉత్తరదిశగా ఉన్న తిమ్మాపురం గ్రామంలో జొన్నపైరు వేశారు. ఆ భూమి యజమాని ఆ పొలంలో ఒక మంచెను ఏర్పాటు చేసుకొని తన 10 సంవత్సరాల వయసు గల కూతురు తోడుగా పిట్టల కాపలా కాసేవాడు. ఒకరోజు తన కూతురు చేను మధ్యలోనికి వెళ్లడం గమనించక కూతురు కోసం పెద్దగా పిలుస్తూ చేను చుట్టూ తిరుగుతుండగా చేను మధ్య నుండి ఏవో మాటలు వినిపించాయి. ఆ మాటలను బట్టి అక్కడకు వెళ్లి తన కూతురు సుమారు ఒక అడుగు ఎత్తు గల ఆంజనేయస్వామి విగ్రహాన్ని చేతితో పట్టుకొని మాట్లాడుతుండడం గమనించాడు. ఆ విగ్రహానికి నమస్కరించి తన చేతిలోని తీసుకుంటుండగా విగ్రహము చాలా బరువుగా ఉండి ఎత్తు పెరుగుతుండటం ఆశ్చర్యంతో గమనించి కిందకు దించి గ్రామంలోనికి పరుగు పరుగున వెళ్లి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేశాడు. గ్రామస్థులు గుంపులు గుంపులుగా వెళ్లి పెరుగుతున్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతలో ఆ బాలికను స్వామి ఆవేశించి " నా విగ్రహాన్ని మీ గ్రామంలో ప్రతిష్ఠించుకొనండి, మీకు మేలు జరుగుతుంది" అని ఆదేశించాడు. పరిసర గ్రామాల నుండి జనం తండోపతండాలుగా వచ్చి స్వామి వారిని రాతిగాండ్ల బండిపై ఎక్కించుకొని జయజయధ్వానాలతో తీసుకుని వస్తుండగా విగ్రహం 12 అడుగుల ఎత్తుకు పెరిగింది. ప్రస్తుతం స్వామి వారి ఆలయం ఉన్న చోటుకు వచ్చేసరికి రాతిగాండ్లు తిరగక ఎద్దులు బండిని లాగలేక పోయాయి. ఎంత ప్రయత్నించినను బండి ముందుకు సాగలేదు. అప్పుడు మరల స్వామివారు బాలికను ఆవేశించి " ఈ గుండ్లకమ్మ సమీప స్థలమే నేను వెలయుటకు అనువైనది. ఇక్కడనే నన్ను ప్రతిష్టించండి" అని ఆదేశించగా ఒక మంచి ముహూర్తం వేదమంత్రాలతో శాస్త్రయుక్తంగా విగ్రహ ప్రతిష్ఠగావించారు. అన్నపురెడ్డి వంశీయుడైన ఆసామి స్వామివారికి గుడి నిర్మింపజేసాడు. నాటి నుండి బొడ్డుచెర్ల వీరాంజనేయ స్వామి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్నది.

కొంతకాలానికి కంభం చెరువు నిర్మాణ సమయంలో కర్ణాటక ప్రభువులు శ్రీ వీరాంజనేయ స్వామి వారి మహత్యమును తెలుసుకొని వచ్చి స్వామి వారిని దర్శించి శిథిలావస్థలో ఉన్న గుడికి 15×15×15 అడుగుల విస్తీర్ణంలో గర్భాలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు.ఆ తర్వాత ఒంగోలు, కనిగిరి, పొదిలి, తర్లుపాడు, ప్రాంతాలు నెల్లూరు వెంకటగిరి ఆస్థానం వారి ఏలుబడిలో నున్నప్పుడు స్వామివారిని దర్శించి గర్భాలయం ముందు భాగాన కర్రతో సుందరమైన మందిరాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ ప్రహరీగోడను కూడా ఏర్పాటు చేశారు.

పల్నాటిరెడ్డి రాజులు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శనార్థం వచ్చినప్పుడు శ్రీ వీరాంజనేయ స్వామి వారి మహిమను గూర్చి తెలుసుకొని స్వామివారిని దర్శించి విలువైన కానుకలు సమర్పించారు.

బొడ్డుచెర్ల ప్రాంతంలో వరుసగా కొన్ని సంవత్సరాలు వర్షాలు పడక పంటలు పండలేదు. పశువులకు నీరు, మేత కరువైనాయి. ప్రజలు పనులు లేక పొట్ట చేత పట్టుకొని పలు ప్రాంతాలకు వలసదారిపట్టారు. అన్నపురెడ్డి వంశీయులు వారికి ఉన్న స్థిరాస్తులు 70 ఎకరాల పంట పొలాలను శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ పోషణార్థం సమర్పించి ఊరు వదిలి వెళ్ళిపోయారు.

ప్రతి సంవత్సరం శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉగాది, శ్రీరామనవమి హనుమాన్జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.ఈ సందర్భంగా జరిగే బండలాగుడు పందాలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు.

మూలాలు మార్చు

వెలుపలిలింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బొడిచర్ల&oldid=3966820" నుండి వెలికితీశారు