యలమంచిలి రాధాకృష్ణమూర్తి

(వై. రాధాకృష్ణ మూర్తి నుండి దారిమార్పు చెందింది)

యలమంచిలి రాధాకృష్ణమూర్తి (వైఆర్‌కే ) (1928 అక్టోబరు 18 - 2013 అక్టోబరు 19) మాజీ రాజ్య సభ సభ్యుడు. సీపీఎం అగ్ర నేత. పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత. రాజకీయ నేతగానే కాదు.. మంచి రచయితగా, వక్తగా, పత్రికా పఠనంలో అమితాసక్తిని చూపించే వ్యక్తిగా, పేదల వైద్యుడిగా ఎంతో పేరుగాంచారు. ఖమ్మం జిల్లాలో సీపీఎం విస్తరణలో కీలక నేతగా పనిచేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వానపాముల గ్రామ శివారు జమ్మిదింటలో కొల్లి రామయ్యకు మూడవ కుమారునిగా జన్మించిన యలమంచిలి రాధాకృష్ణమూర్తి ఎస్.ఎస్.ఎల్.సి. వరకు వానపాముల గ్రామంలోనే చదివారు. రామయ్య తోడల్లుడు యలమంచిలి సీతారామయ్య తనకు సంతానం లేనందువల్ల ఈయనను దత్తత తీసుకున్నారు. 1950లో ఖమ్మం పట్టణానికి వచ్చారు. 1953లో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. పేదలకు అండగా నిలిచారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావజాలంతో ప్రజల్లోకి చొచ్చుకవెళ్లేవారు.1985 దాకా కమ్యూనిస్టు పార్టీకి అండదండగా ఉన్నారు. పౌరహక్కుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాలంలో జైలుకెళ్ళారు. బోడేపూడి వెంకటేశ్వరరావు మరణం అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పార్టీ వ్యవహారాల్లో సలహాలు, సూచనలను ఇవ్వడానికి పెద్దదిక్కుగా ఉండేవారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కాలంలో చిన్నతరహా నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. 19.10.2013 న కన్నుమూశారు.

యలమంచిలి రాధాకృష్ణమూర్తి

మూలాలు మార్చు