శలాక రఘునాథశర్మ
శలాక రఘునాథశర్మ పండితుడు, కవి, రచయిత, శతాధిక గ్రంథకర్త, ప్రవచనకర్త.
శలాక రఘునాథశర్మ | |
---|---|
![]() శలాక రఘునాథశర్మ | |
జననం | శలాక రఘునాథశర్మ జూలై 23, 1941 కృష్ణా జిల్లా, నూజివీడు మండలం, గొల్లపల్లి గ్రామం |
వృత్తి | ఆచార్యుడు |
ప్రసిద్ధి | బహుగ్రంథకర్త, సంస్కృతాంధ్ర పండితుడు, పురాణ ప్రవచనకర్త |
తండ్రి | నరసయ్య |
తల్లి | దుర్గమ్మ |
జీవిత విశేషాలుసవరించు
బాల్యము, విద్యాభ్యాసముసవరించు
ఇతడు కృష్ణా జిల్లా, నూజివీడు సమీపంలోని గొల్లపల్లి గ్రామంలో 1941, జూలై 23వ తేదీన నరసయ్య, దుర్గమ్మ దంపతులకు జన్మించాడు. పదవ యేటనే తండ్రి మరణించడంతో ఇతని తల్లి పశ్చిమ గోదావరి జిల్లా, ఆకిరిపల్లిలో తెలిసిన వారియింట ఇతనికి వసతి, చదువు ఏర్పాటు చెసింది. ఇతడు 1960లో తెలుగు, సంస్కృత భాషలలో భాషాప్రవీణ మొదటి ర్యాంకులో ఉత్తీర్ణుడైనాడు. 1967లో తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ. డిస్టింక్షన్ సాధించాడు. 1975లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుండి 'భారతంలో ధ్వని దర్శనము ' అనే అంశంపై పి.హెచ్.డి. సంపాదించాడు. పేరి వెంకటేశ్వరశాస్త్రి, రామచంద్రుల కోటేశ్వరశర్మ, దివాకర్ల వేంకటావధాని, లంక శ్రీనివాసరావు ఇతని గురువులు[1].
ఉద్యోగ సోపానముసవరించు
ఇతడు 1960-65 మధ్యకాలంలో గౌతమీ విద్యాపీఠంలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాదులో ప్రాచ్యకళాశాలలో ఒక సంవత్సరం ఉపన్యాసకుడిగా సేవలను అందించాడు. అటు పిమ్మట ఇతడు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్గా అడుగుపెట్టి, రీడర్గా, ప్రొఫెసర్గా పదోన్నతి పొంది డీన్గా పదవీవిరమణ చేశాడు. ఆ విశ్వవిద్యాలయంలో 16 సంవత్సరాలు ఆచార్యునిగా పనిచేసి, 24 మందికి డాక్టరేట్లు, 23 మందికి ఎం.ఫిల్.పట్టాలు లభించడానికి మార్గదర్శనం చేశాడు[1]. ఉద్యోగ విరమణ తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డాడు.
రచనలుసవరించు
మహాభారతానువాదంసవరించు
ఇతడు వ్యాసభారతంలోని విరాటపర్వానికి తాత్పర్య వ్యాఖ్యానాలు రచించాడు. ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, శాంతి, అనుశాసన, అశ్వమేధిక, ఆశ్రమవాసిక, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలలోని ప్రతి శ్లోకానికి తాత్పర్య, వ్యాఖ్యానాలు రచించాడు. యుద్ధషట్కం అని పిలువబడే ఆరు పర్వాలలో కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలను వచనరూపంలో తెలుగులోనికి అనువదించాడు. మొత్తం 80వేల శ్లోకాలకు తాత్పర్యసహిత్య వ్యాఖ్యానాలను అందించాడు. మిగితా పర్వాలలోని శ్లోకాలకు కూడా వ్యాఖ్యాన తాత్పర్యాలు వ్రాస్తున్నాడు[1].
ఇతర రచనలుసవరించు
ఇది కాక ఇతడు ప్రకటించిన గ్రంథాలలో కొన్ని:
- కవిత్రయ భారత జ్యోత్స్న
- భారత ధ్వని దర్శనము
- ఆర్షభావనా వీచికలు
- శ్రీ షట్పదీ కనకధారలు
- సనత్సు జాతీయ సౌరభం
- శ్రీ నాగేశ్వర మహా విభూతి
- శివానందలహరి హంస
- వసిష్ఠుడు
- భాగవత నవనీతము
- యామునప్రభు రాజనీతి (వ్యాఖ్యానము)
- విదురనీతి
- యక్షప్రశ్నలు మొదలైనవి.
సత్కారాలు, బిరుదులుసవరించు
ఇతనికి అనేక సత్కారాలు, పురస్కారాలు, బిరుదులు లభించాయి. వాటిలో కొన్ని:
- అజోవిభొ కందాళం విశిష్ట సాహితీమూర్తి పురస్కారం.
- జానమద్ది హనుమచ్ఛాస్త్రి పురస్కారం
- కంచి కామకోటి పీఠం లేఖారత్న బిరుదు.
- రాయల కళా గోష్ఠి అనంతపురం వారిచే భోగిశెట్టి స్మారక పురస్కారం
- శ్రీభాష్యం అప్పలాచార్య స్మారక పురస్కారం
- రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి వారిచే మహామహోపాధ్యాయ బిరుదు.
- సామవేదం షణ్ముఖశర్మచే ఋషిపీఠం పురస్కారం మొదలైనవి.
- ప్రతిభా పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం, 2013[2][3]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 విలేకరి, రాజమహేంద్రవరం కల్చరల్ (11 December 2017). "జ్ఞానాంజనశలాక". సాక్షి, తూర్పుగోదావరి జిల్లా టాబ్లాయిడ్. Archived from the original on 14 జనవరి 2018. Retrieved 26 January 2018.
- ↑ తెలుగు విశ్వవిద్యాలయం, పురస్కారాలు. "ప్రతిభా పురస్కారాలు" (PDF). www.teluguuniversity.ac.in. Archived from the original (PDF) on 9 సెప్టెంబరు 2017. Retrieved 7 జూన్ 2020.
- ↑ సాక్షి, హైదరాబాదు (18 December 2013). "తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు". Sakshi. Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.