శ్రీశైల శిఖరం
శ్రీశైల శిఖరం (శిఖరం), నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామం. శ్రీశైల క్షేత్రంలో ఒక పుణ్యక్షేత్రం.
రెవెన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°56′17″N 78°42′14″E / 15.938°N 78.704°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండలం | శ్రీశైలం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 0 km2 (0 sq mi) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 65 |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1031 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( | )
పిన్కోడ్ | 518102 ![]() |

చరిత్ర సవరించు
శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైంది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖరదర్శనం చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారు. కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరటానికి కారడవిలో, కాలి నడకన ప్రయాణించవలసి వచ్చేది. కొంతదూరం నడిచాక అప్పటికే అలసి సోలసిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగైనా ముందుకు వేయలేని స్థితిలో ఏదోవిధంగా ఈ కొండ శిఖరం (శిఖరేశ్వరం) కనబడేవరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణమయ్యేవారు. ఎంత దూరం నుంచి అయినా యీ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వమూ నశించి జనన మరణరూప సంసారచక్రం నుండి ముక్తి లభిస్తుందని పురాణాలు ఏకకంఠంతో చెబుతున్నాయి. కాలక్రమంలో ఈ శిఖరేశ్వరం నుండి శ్రీశైల ప్రధాన ఆలయ శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదని, అలా ఆలయ శిఖరం కనబడితే 6 నెలలలో మరణిస్తారని ఒక నానుడి ప్రజలలో నాటుకుపోయింది. ఈ విషయంలో సాహిత్యపరమైన ఆధారాలు ఏవీ లేకున్నా, ఆలయ శిఖరం స్పష్టంగా కనబడింది అని చెప్పిన వ్యక్తులు 6 నెలలలోపే దివంగతులవటం ఈ భావనకు బలాన్ని చేకూరుస్తుంది. కాగా, 6 నెలలలోపు ప్రాణాలను కోల్పోయే వారి కంటిచూపు అంత దూరంలో గలదాన్ని స్పష్టంగా కనబరుస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.శ్రీశైల ప్రధానాలయమైన శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న యీ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన 'వీరశంకరుడు' కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు. ఈ వీరశంకరుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇతమిత్థంగా చెప్పే ఆధారాలు నేటి వరకూ లభ్యం కాలేదు. కాని ఆలయం ఎదురుగా ఉన్న సా.శ. 1398 (శా.శ 1320) పార్థివ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం నాటి ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే యీ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్ళే ఆచారం ఉన్నట్లు దృఢంగా తెలుస్తోంది.
సోపాన నిర్మాణం సవరించు
ప్రోలయవేమారెడ్డి రాజ్యానికి శ్రీశైలం పడమరసరిహద్దుగా ఉన్నపుడు ఈ ప్రాంతం మీద అధిపత్యానికి రెడ్లకు, విజయనగర రాజులకు, రాచకొంద వెలమ దొరలకు తరచుగా యుద్ధాలు జరుగుతుండేవి. యుద్ధాలు జరుగునపుడు సైనికులు లేదా శ్రీశైలము చేరాలనుకొనే భక్తులకు గాని సరియన ప్రయాణ మార్గము లేదని ప్రోలయ మార్గ నిర్మాణానికి కొంతవరకూ కృషి చేసాడు. అదే పనిగా శిఖర దర్శనానికి ఇబ్బంది పడుతున్న భక్తులను చూసి దానికి సోపానాలు నిర్మించాలని మంత్రి రామయదేవునికి ఆదేశాలిచ్చాడు.
ఇతర విశేషాలు సవరించు
- సోపాన నిర్మాణ ఇదేకాలంలో జరిగినది అని చెప్పే శాసనము ఏదీ లభ్యం కాకున్నా కొంత సమాచారం మాత్రం ప్రాచీన శాసనమైన చీమకుర్తి (క్రీ, శ,1335) సాసనంలో లభిస్తుంది. ఈ శాసనంలో "అనవరత పురోహితకృత సోమపాన శ్రీ పర్వతాహోభల నిర్మితసోపానాధిక్కాంతామనోహరకీర్తికుసుమామోద" అలా చెప్పబడిన విషయాన్ని బట్టి ఇవి క్రీ, శ, 1326-1335 మధ్య నిర్మించబడినాయని చెపుతారు.
- చీమకుర్తి శాసనం తెలుగు భాగంలో " చైనశీతి దుర్గనిర్మాణ చతుర శ్రీశైలశిఖరాక్రాంతసోపానరచనాశ్రేయస్సంపాదిత" అని చెప్పబడింది.
- సా.శ. 1343 నాటి మరొక శాసనం అయిన ముట్లూరి శాసనంలో ఇలా చెప్పబడింది.
స్తంభాం కీర్తిక సృజంత్యకుశలా భూమీశ్వరానన్వరా
నిర్మానన్యకృతేర్వినిర్మలమతే శ్రీవేమపృధ్వీపతే
యేన శ్రీగిరిరప్యహోబలగిరిస్సోపానమార్గాంకితౌ
విఖ్యాతే రచితౌ సనాతనయశస్తణ్భతలం భూతలే
భౌగోళికం సవరించు
ఇది మండల కేంద్రమైన శ్రీశైలం నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కర్నూలు నుండి 64 కి. మీ. దూరంలోనూ ఉంది.
జనగణన విషయాలు సవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 31 ఇళ్లతో, 65 జనాభాతో 0 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 32, ఆడవారి సంఖ్య 33.[2]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 74.[3] ఇందులో పురుషుల సంఖ్య 37, మహిళల సంఖ్య 37, గ్రామంలో నివాస గృహాలు 17 ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు సవరించు
సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల శ్రీశైలంలో ఉన్నాయి. ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల శ్రీశైలం ప్రాజెక్టు (RFC) 7లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల శ్రీశైలం ప్రాజెక్టు (RFC) లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్ శ్రీశైలం ప్రాజెక్టు (RFC) లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శ్రీశైలం ప్రాజెక్టు (RFC) లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు కర్నూలులోనూ ఉన్నాయి.
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-04-06.