భీమారామం

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో గల సౌమేశ్వరస్వామి దేవాలయం, పంచారామాల్లో ఒకటి
(సోమారామం నుండి దారిమార్పు చెందింది)

పంచారామాల్లో ఒకటైన భీమారామం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.[1] ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో ఉత్సవాలు జరుగుతాయి.

సోమేశ్వరస్వామి దేవాలయం
సోమేశ్వరస్వామి దేవాలయం, భీమవరం
సోమేశ్వరస్వామి దేవాలయం, భీమవరం
సోమేశ్వరస్వామి దేవాలయం is located in Andhra Pradesh
సోమేశ్వరస్వామి దేవాలయం
సోమేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°32′00″N 81°32′00″E / 16.5333°N 81.5333°E / 16.5333; 81.5333
పేరు
ప్రధాన పేరు :సోమేశ్వరస్వామి దేవాలయం, భీమవరం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:పశ్చిమగోదావరి
ప్రదేశం:భీమవరం, పశ్చిమగోదావరి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:శివ
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సా.శ.3 వ శతాబ్ది

స్థలపురాణం మార్చు

త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగగొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని, అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయిందని పురాణ కథనం.[2] ఈ లింగం చంద్రప్రతిష్ఠితమని విశ్వసించబడుతుంది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు.

చరిత్ర మార్చు

చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్నినిర్మించాడనటానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలుస్తున్నారు.ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలుస్తారు.

ఆలయ విశేషాలు మార్చు

దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చే సరికి బూడిద లేదా గోధుమ వర్ణానికు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే, అదే గర్భాలయ పైభాగాన ఉన్న రెండవ అంతస్తులోని గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఆలయపు ముందు కోనేరు ఉంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉన్నాయి.మరో రెండు నందులు ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉంది.ఆలయం ప్రాంగణంలో మొత్తం ఐదు నందులు ఉండడం వల్ల పంచ నందీశ్వరాలయంగా ఈ ఆలయానికి మరో పేరు ఉంది. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి.

ప్రత్యేక ఉత్సవాలు మార్చు

ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.

మూలాలు మార్చు

  1. "Toursim [sic]". Bhimavaram Municipality. Archived from the original on 16 March 2015. Retrieved 1 May 2015.
  2. "Panchamukha : పంచముఖుని పంచారామాలు | Pancharamas of Panchamukha mvs". web.archive.org. 2023-02-18. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=భీమారామం&oldid=3841146" నుండి వెలికితీశారు