1922-1924 మధ్యకాలంలో రంప లేదా మన్యం అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వంపై స్థానిక గిరిజనులు చేసిన తిరుగుబాటును మన్య విప్లవంగా పిలుస్తారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు ప్రాంతానికి చెందిన క్షత్రియ కులస్తుడు, జాతీయోద్యమ భావాలు కలిగిన యువకుడు అల్లూరి సీతారామరాజు రంప ప్రాంతానికి స్థానికులైన గిరిజన నాయకులు గం గంటందొర, గం మల్లుదొర, అగ్గిరాజు, యెండు పడాల్ వంటివారితో సహకారంతో గిరిజనుల మద్దతుతో ఈ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు.

విశాఖపట్నం బీచ్ రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహం: మన్య విప్లవానికి తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో భాగంగా, సీతారామరాజుకు స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రఖ్యాతి లభించింది.
విశాఖపట్నం బీచ్ రోడ్డులో అల్లూరి సీతారామరాజు విగ్రహం:
మన్య విప్లవానికి తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో భాగంగా, సీతారామరాజుకు స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రఖ్యాతి లభించింది.

గిరిజనుల జీవికలో ముఖ్యమైన భాగాలైన పోడు వ్యవసాయం, తేనె వంటి అటవీ ఉత్పత్తుల సేకరణ వంటివాటిని నిషేధించడం, నియంత్రించడమో చేసి అటవీ వనరులను అన్యాయంగా దోచుకుంటూండడం, గిరిజనుల నుంచి పన్నులు వసూలుచేసే మత్తాదారుల అధికారాలు తొలగించడం, మైదాన ప్రాంతం నుంచి బ్రిటీష్ వారు ప్రోత్సహించగా వచ్చిన వ్యాపారులు వీరి అమాయకత్వం ఆధారంగా గిరిజనులను నష్టాలపాలు చేయడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో 19వ శతాబ్ది చివరి దశకాల్లోనూ, 20వ శతాబ్ది తొలినాళ్ళలోనూ కొన్ని తిరుగబాట్లు (పితూరీలని పేరు) జరిగాయి. బ్రిటీష్ ప్రభుత్వం వీటిని అణచివేసినా దోపిడీ కొనసాగించడం, కరువుకు ఈ విధానాలు తోడై గిరిజనులు ఆకలితోనూ, స్వతంత్ర జీవనం కోల్పోవడంతోనూ ఆగ్రహంతో ఉండడం ఈ తిరుగుబాటుకు కొన్ని కారణాలు. అల్లూరి సీతారామరాజు స్వయంగా జాతీయోద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఈ తిరుగుబాటు స్వభావంలో జాతీయోద్యమ స్ఫూర్తి, స్వాతంత్ర్య పోరాట లక్ష్యాలు ఉన్నాయా అన్న విషయంపై చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

1922 ఆగస్టు 22న ఈ తిరుగుబాటులోని తొలి దాడి ప్రారంభమైంది. ప్రధానంగా రంప అటవీ ప్రాంతంలోని పలు పోలీసు స్టేషన్ల మీద దాడులు జరిగాయి. ఈ దాడుల అనంతరం స్టేషన్‌లోని ఆయుధాలు తిరుగుబాటుదారులు జప్తుచేసుకుని వెళ్ళేవారు. 1922 సెప్టెంబరులో ఈ తిరుగుబాటును అణచడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక పోలీసు దళాన్ని తిరుగుబాటులు సమర్థవంతంగా దెబ్బతీయడంతో వారికి గౌరవం పెరిగింది. ప్రత్యేకించి బ్రిటీష్ ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుని పలువురుని హతమార్చారు.

1923లో ఉద్యమాన్ని దెబ్బతీయడానికి పోలీసులు గిరిజనులను చిత్రహింసలు పెట్టినా వారు ఉద్యమకారుల పక్షానే నిలిచారు. అయితే మత్తాదారులను మాత్రం బ్రిటీష్ వారు లొంగదీసుకోగలిగారు. ఆ మద్దతుతో ఒక్కో నాయకుడినీ పట్టుకుని, కొందరిని మట్టుపెట్టి తుదకు సీతారామరాజును 1924 మే 7న పట్టుకుని కాల్చిచంపి తిరుగుబాటును అణచివేశారు. ఈ తిరుగుబాటు తదనంతర కాలంలో ఆంధ్ర ప్రాంతంలో సాగిన జాతీయోద్యమానికి స్ఫూర్తిని అందించింది. ఉద్యమ నాయకుడైన అల్లూరి సీతారామరాజును ప్రజలు స్వాతంత్ర్య సమర యోధుడిగా గౌరవిస్తున్నారు.

నేపథ్యం మార్చు

బ్రిటీష్ వలస ప్రభుత్వం రంప ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానంపై వివిధ ఆంక్షలు పెట్టి, అటవీ ప్రాంతాన్ని దోపిడీ చేయడం ఈ విప్లవానికి నేపథ్యంగా ఉంది. మన్య విప్లవానికి భూమికను ఏర్పరిచిన కారణాలుగా ఈ కిందివి చెప్పుకోవచ్చు:

పోడు వ్యవసాయంపై ఆంక్షలు మార్చు

స్థానిక గిరిజనులు తరతరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు. దీనిలో భాగంగా రైతులు అడవిని కొంతమేర కొట్టి, అక్కడే ఆ కలప తగలబెడతారు. కలప తగలబెట్టడం వల్ల భూమికి ఎరువుగా ఉపకరిస్తుంది, క్రమంగా నెలల వ్యవధిలో వానలు పడ్డాకా వ్యవసాయం ప్రారంభించి జొన్నలు, రాగులు వంటివి పండించుకుంటారు. ఏటా ఒక్క పంటే పండించినా, పోడు వ్యవసాయ పద్ధతుల వల్ల బాగా పండి వారి అవసరాలకు సరిపోతుంది. వారి వ్యవసాయం వారి అవసరాలకు మాత్రమే పరిమితమైనది. తర్వాతి సంవత్సరం అడవిలో మరో చోట వ్యవసాయం చేసుకుని, ముందు వ్యవసాయం చేసిన ప్రాంతాన్ని అడవి పెరిగేందుకు వదిలేస్తారు.
ఇలా అప్పటివరకూ అడవిలో ఏ ప్రాంతాన్నైనా ఇష్టానికి సాగుచేసుకునే గిరిజనుల పద్ధతిపై బ్రిటీష్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అడవిలో చాలా ప్రాంతాల్లో చెట్లు కొట్టడం, పోడు వ్యవసాయం చేయడం నిషేధించారు. బ్రిటీష్ వారు అనుమతించిన ప్రాంతాలు రిజర్వు చేసిన ప్రాంతాలతో పోల్చుకుంటే అతి స్వల్పం. ఈ చర్య నిజానికి గిరిజనులను ఆకలితో మాడిపోయేలా చేసింది. అసహజమైన కరువును మన్యంలో సృష్టించింది.[1]
ఈ ప్రాంతాల్లో కల్లు కరువు సమయంలోనూ, ఆహారం లభ్యం తక్కువగా ఉండే కాలాలలోనూ ప్రధానమైన ఆహారంగా ఉపకరిస్తూంటుంది. బ్రిటీష్ ప్రభుత్వం కల్లు తయారీ కోసం కాంట్రాక్టులు మంజూరుచేసే విధానాన్ని ఏర్పాటుచేసి, గిరిజనులు స్వంతానికి కల్లు కాయడాన్ని నిషేధించింది.[2]

వనరుల దోపిడీ మార్చు

బ్రిటీష్ ప్రభుత్వం అడుగుపెట్టక ముందు ఈ ప్రాంతంలో అటవీ సంపదపై పూర్తిగా స్థానిక గిరిజనులకే హక్కు ఉండేది. అడవిలో తేనె, గింజలు, ఇతరేతర అటవీ ఉత్పత్తులన్నిటినీ గిరిజనులు స్వేచ్ఛగా సేకరించుకునేవారు. ఈ అటవీ ఆర్థిక వ్యవస్థలో బ్రిటీష్ వారు మార్పులు తీసుకువచ్చారు. 19వ శతాబ్దిలో కొద్దికొద్దిగా ప్రారంభించి, 20వ శతాబ్ది వచ్చేనాటికల్లా అటవీ ఉత్పత్తుల సేకరణ విషయంలో పూర్తిగా ప్రభుత్వం పట్టుబిగించేసింది. అంతవరకూ గిరిజనులు సేకరించుకునే ఈ ఉత్పత్తులను అప్పటి నుంచీ ప్రభుత్వం నేరుగానో, కాంట్రాక్టులకు ఇచ్చి కాంట్రాక్టర్ల ద్వారానో సేకరించి లాభసాటి ఆదాయమార్గంగా మార్చుకుంది. ఈ వనరుల దోపిడీ ఇతర ఆంక్షలకు కూడా తోడై గిరిజనుల ఆర్థిక స్థితిపై ముప్పేట దాడి చేసింది.[1]
కొండ ప్రాంతాల్లోకి బ్రిటీష్ వారు రోడ్డు సౌకర్యాలు ఏర్పరిచి మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తుల్ని ప్రోత్సహించారు. అటవీ ఉత్పత్తులను వ్యాపారులు అమ్మకాలు, కొనుగోళ్ళు చేయడం సాగించారు. వీటంతటిలో గిరిజనులకు లాభించేది లేకపోగా నష్టం చేకూరింది. మరోవైపు అప్పటికే పోడు వ్యవసాయాన్ని పరిమితం చేయడం, కల్లు కాచుకోవడాన్ని నిషేధించడం వంటి అనేక కార్యకలాపాల వల్ల స్వతంత్ర జీవన మార్గాలను గిరిజనులు కోల్పోయారు. మెల్లిగా తమ భూములపై ఆధిపత్యాన్ని కోల్పోవడంతో, భూమి ఆధారిత వ్యవస్థలోని వారు మార్కెట్ వ్యవసాయంలోకి మళ్ళి బలవంతులైన మైదాన ప్రాంతాల వారి వద్ద కౌలుదారులుగానో, లేక కలప వ్యాపారంలో అడవిలో కలప కొట్టేవారిగానో మారిపోయారు.[2]
అటవీ ప్రాంతాల్లో కూలీలుగా మారిన గిరిజనులతో ప్రభుత్వం ప్రధానంగా రోడ్డు పనులు, కలప కొట్టే పనులు చేయించుకునేది. ఐతే వారికి సరియైన కూలీ డబ్బు ఇచ్చేది కాదు, కొన్ని సందర్భాల్లో కూలీ సొమ్ము ఇవ్వకుండానే పనులు చేయించుకునేది. చాలాసార్లు వారు నిర్ణయించే కూలీ డబ్బు మార్కెట్లో ఉన్నదాని కన్నా తక్కువగా ఉండేది. ప్రభుత్వం తర్వాత అటవీ కాంట్రాక్టురులు ఎక్కువమంది కూలీలకు పని కల్పించేవారు. ఐతే వారు స్థానిక అధికారులతో కుమ్మక్కై అమాయకులైన స్థానిక గిరిజనులకు తక్కువ కూలీ ఇచ్చి పనిచేయించుకునేవారు. దాంతో మొత్తంగా గిరిజనులు బానిసత్వంలో మగ్గిపోయే స్థితికి వచ్చారు.1922-24 నాటి తిరుగుబాటుకు కూలీల సమస్యతో నేరుగా సంబంధం ఉందని చాలామంది పరిశీలకులు భావించారు.[1]
గిరిజనేతరులైన షావుకార్లు, కాంట్రాక్టర్లు విప్లవాన్ని ఏమేరకు ప్రభావితం చేశారన్న విషయంలో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అటవీ ఆర్థిక వ్యవస్థలో గిరిజనేతరుల ప్రమేయం విప్లవానికి ప్రధాన కారణమని కొందరు చరిత్రకారులు ప్రతిపాదిస్తూండగా,[3]

మత్తాదారుల అధికారాల తొలగింపు మార్చు

బ్రిటీష్ ప్రభుత్వానికి ముందు నుంచి రంప ప్రాంతంలో పన్నుల వసూలుకు మత్తాదారుల వ్యవస్థ నెలకొనివుంది. మత్తాదారు అనే అధికారి లేక నాయకుడు స్థానికుల నుంచి నిర్ధారించిన కట్టుబడి (పన్నులు)ని వసూలు చేసి దాన్ని పరిపాలకుడైన రాజుకు ఇస్తూండేవారు. ఇందుకు గాను వారికి ప్రతిఫలంగా సొమ్ముతో పాటుగా పలు అధికారాలు కూడా దఖలు పడేవి. వీరికి కొండపై భూములు, వ్యవసాయం ఉండేది కాదు కానీ స్వంత వ్యవసాయంపై పన్ను కట్టనవసరం లేకపోవడం మొదలుకొని అనేక అధికారాలు ఉండేవి. నిజానికి రాజ ప్రతినిధిగా మత్తాదారులు నిజమైన అధికారులుగానూ, నిజమైన అధికారాన్ని అనుభవించేవారుగానూ ఉండేవారు. బ్రిటీష్ ప్రభుత్వం వచ్చాకా వీరి అధికారాలను పరిమితం చేసింది. స్థానిక బ్రిటీష్ ఏజెంట్లు నిర్ధారించిన కట్టుబడి వసూలు చేయడం, వసూలు చేసినందుకు సొమ్మ రూపంలోనో, గింజల రూపంలోనో, పన్నులు లేని భూములను సాగుచేసుకునే రూపంలోనో వారికి ప్రతిఫలం దక్కే వ్యవస్థ ఏర్పాటైంది. బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని పాలసీకి అనుగుణంగా మారేదిగా చేసింది, అవసరమైతే బ్రిటీష్ ప్రభుత్వం వంశపారంపర్య హక్కు సహా ప్రతీ హక్కునూ తొలగించే అధికారం అట్టిపెట్టుకుంది. ఈ కారణాలన్నిటితోనూ స్థానిక రాజుల స్థాయి నుంచి మత్తాదారులను సాధారణ ఉద్యోగుల స్థాయికి తీసుకువచ్చారు బ్రిటీష్ వారు.దాంతో మత్తాదారులు కూడా సామాన్య గిరిజనులతో పాటుగా బ్రిటీష్ వారిపై వ్యతిరేకత పెంచుకున్నారు.[1]

ప్రభుత్వంపై పూర్వపు తిరుగుబాటులు మార్చు

ప్రభుత్వం విధించే నిషేధాలు, పరిమితులకు వ్యతిరేకంగా 1880 నుంచి 1914 వరకూ పదుల సంఖ్యలో తిరుగుబాట్లు జరిగాయి. వీటిని పితూరీగా పిలచేవారు.1879-80 మధ్యకాలంలో రంపచోడవరం ప్రాంతంలో తమ్మందొర అనే గిరిజన నేత నాయకత్వంలో కల్లు కాయడంపై ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ పితూరీ జరిగింది. దీనిలో భాగంగా భౌతికంగా ప్రభుత్వ చిహ్నంగా కనిపించే పోలీసు స్టేషన్లను తగుల బెట్టారు. పోలీసు కానిస్టేబుల్ ఒకరిని అమ్మవారికి బలి ఇచ్చారు. తమకు బతికే అవకాశం లేనప్పుడు, కానిస్టేబుళ్ళను చంపి మరీ చస్తామన్నది వారి నినాదంగా ఉండేది. క్రమంగా విశాఖపట్నంలోని గొల్లకొండ అడవులు, ఖమ్మం ప్రాంతపు అడవులకు తిరుగుబాటు వ్యాపించగా సైన్యాన్ని, పోలీసులను దీన్ని అణచివేసేందుకు నియోగించారు. 1880 జూన్లోనే తమ్మందొరను కాల్చి చంపగలిగినా, అప్పటికే వ్యాపించిన తిరుగుబాటును అణచివేసేందుకు నవంబరు వరకూ సాధ్యపడలేదు. గిరిజనుల జీవన విధానంలో బ్రిటీష్ ప్రభుత్వ జోక్యం, వనరుల దోపిడీ వంటివాటికి వ్యతిరేకంగా ఇటువంటి పితూరీలు మరికొన్ని 1922 ముందునాటికే జరిగాయి.[2] 1886లో ఇటువంటి మరో పితూరీ కూడా సాగింది.నిజానికి ఈ పితూరీలు మొదట మత్తాదార్ల మధ్య మత్తాలు (ఎస్టేట్ల) కోసం జరిగిన లక్షణం కలిగినవే అయినా క్రమంగా బ్రిటీష్ ప్రభుత్వపు అణచివేత ధోరణి పెరిగే కొద్దీ బ్రిటీష్ వలస పాలన, అటవీ పాలసీలకు వ్యతిరేకంగా జరుగనారంభించాయి.[3]

తిరుగుబాటు మార్చు

రామరాజు నాయకత్వం మార్చు

1922-1924 మన్యం తిరుగుబాటు లేదా మన్య విప్లవానికి నాయకత్వాన్ని మైదాన ప్రాంతాలకు చెందిన, క్షత్రియ కులస్తుడైన అల్లూరి సీతారామరాజు వహించారు. సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లుకు చెందినవారు. 1897న మోగల్లు గ్రామంలో జన్మించిన రామరాజు 5వ ఫారం వరకూ ఆంధ్రదేశంలోని పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. చిన్నతనంలోనే జ్యోతిష్యం, హస్త సాముద్రికం, ఔషధ శాస్త్రం వంటివాటిపై ఆసక్తిని, అభినివేశాన్ని అభివృద్ధి చేసుకున్నారు. 18వ యేట రాజు సన్యాసాన్ని స్వీకరించి, అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలకు మూలికల వైద్యం చేసేవారు. నిరాడంబరంగా జీవించడం, మూలకల వైద్యంతో ప్రజలకు సాయం చేయడం, అడవి జంతువులను శక్తితో లొంగదీయగలగడం వంటి వాటి వల్ల రాజుకు అక్కడి గిరిజనుల్లో మర్యాద లభించింది. ఆయన ఆధ్యాత్మికత, ఆయన చుట్టూ అల్లుకున్న కథలు ఆయనకు దాదాపుగా దైవత్వాన్ని ఆపాదించాయి. గిరిజనులు ఆయనకు బాణాలు, బుల్లెట్లు తాకవని, శరవర్షాన్ని కురిపించగలడనీ పలు విధాల కథలు ఆయన పరంగా చెప్పుకునేవారు. ఇవన్నీ ఆయనపై భయాన్ని కలిగించాయి. అన్నివిధాలుగానూ గౌరవం, భయం కలసి సీతారామరాజుకు బలమైన అనుచరులు లభించేలా చేసింది. ఆయనకు జాతీయవాదంతోనూ, జాతీయ నాయకులతోనూ అభినివేశం ఉండేది. గతంలో జాతీయోద్యమంలో పనిచేసిన అనుభవమూ ఉంది. గిరిజనుల భూములుపై, జీవన విధానంపై ఆంక్షలు విధించి, కూలీలుగా మార్చి, ఆ కూలీ కూడా సరిగా ఇవ్వని బ్రిటీష్ ప్రభుత్వ తీరును గిరిజనులు అర్థం చేసుకునందుకు, తిరగబడేందుకు సీతారామరాజు సహకరించారు. సీతారామరాజుకు ప్రధాన అనుచరులుగా గంటం దొర, మల్లయ్య దొర, అగ్గిరాజు, యెండు పడాల్ వంటివారు సైన్యనాయకత్వం చేపట్టారు. గం గంటయ్య దొర, గం మల్లయ్య దొర సోదరుల స్థానికజ్ఞతను ఆధారం చేసుకుని సీతారామరాజు అనేకమంది గిరిజనులను తిరుగుబాటులో చేర్చుకున్నారు.

ముట్టడులు, దాడులు, విప్లవకారుల విజయం మార్చు

 
దేవీ పట్నం పాత పోలీస్‌స్టేషన్: మన్య విప్లవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు, ఇతర విప్లవయోధులు దాడిచేసిన పోలీసుస్టేషన్లలో ఒకటి.

1922 ఆగస్టు 22, 23, 24 తేదీల్లో వరుసగా చింతపల్లి,కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లను 50మందితో కూడిన సాయుధ దళంతో సీతారామరాజు ముట్టడించారు. ఈ ముట్టడుల అనంతరం సీతారామరాజు, అనుచరులు 26 తుపాకులు, 2,500 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడి అనంతరం రామరాజు గూడెం చేరుకుని, గిరిజనులతో పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులను చైతన్యపరచి పోరాటానికి మద్దతుగా ఇంకొందరు కోయ యువకులను తన దళంలో చేర్చుకున్నారు.

సీతారామరాజు దళంతో ఈశాన్యంగా కిలంకోట, అక్కణ్ణుంచి తూర్పుకు గంగరాజుముద్గోల్ వంటి ప్రాంతాల్లో సంచరించారు. కొత్తగా నియమితులైన పోలీసు దళంతో వీరికి సెప్టెంబర్ 3, 1922న ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పోలీసులపై రాజు దళం విజయం సాధించింది. పోరాటంలో ఒక కానిస్టేబుల్ మరణించారు. అదే నెల 25 తేదీన సీతారామరాజు దళం దమనపల్లి ఘాట్ వద్ద బ్రిటీష్ అధికారులపై మెరుపు దాడిచేసింది. బ్రిటీష్ వారి గుంపులో హెడ్ ను వెళ్ళిపోనిచ్చి దాడి ప్రారంభించారు. వెనువెంటనే స్కాట్ కోవార్డ్, ఎల్.ఎన్.హేటర్ అన్న ఇద్దరు బ్రిటీష్ అధికారులను కాల్చి చంపారు. పోలీసులను చాలా ఇబ్బందికరమైన ప్రదేశంలోకి రానిచ్చి ఈ మెరుపుదాడి చేశారు. పై నుంచి వారిపై బండలు దొర్లించారు. కొందరు పోలీసులపై తుపాకీ దాడి సరిగా నడినెత్తిన బుల్లెట్ గాయమయ్యేలా జరిగింది. బ్రిటీష్ పోలీసు ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకునే దాడులు చేస్తున్న విషయం ఈ దాడిలో స్పష్టమైంది. ఈ మెరుపుదాడి వల్ల తిరుగుబాటుదారులపై స్థానికంగా గౌరవం పెరిగింది. సెప్టెంబరు నెలాఖరుకు తిరుగుబాటు దారులకు పోలీసులు 4 వేర్వేరు ప్రదేశాల్లో ఎదురై దాడి జరుగగా, నాలుగు చోట్లా తిరుగుబాటు దారులు విజయం సాధించారు. యుద్ధ సమయంలో అల్లూరి సీతారామరాజు స్థానిక గిరిజనుల్లో విస్తృతమైన ప్రాచుర్యాన్ని, మర్యాదను పొందారు. బ్రిటీష్ ప్రభుత్వం ఈ గెరిల్లా యుద్ధాన్ని ఎదుర్కోవడంలో గిరిజనుల సహాయ నిరాకరణ వల్ల చాలా ఇబ్బందులు పడింది. మరోవైపు తిరుగుబాటు దారులు స్థానికుల నుంచి పూర్తిగా సహాయ సహకారాలు పొందారు. ఈ సహకారం వల్ల వారు వేగంగా ప్రయాణించడానికి, రహస్య సమాచారాన్ని పంపించుకోవడానికి, అవసరాన్ని బట్టి దాక్కునేందుకూ, పోలీసుల వివరాలు రాబట్టుకునేందుకు కూడా అవకాశం లభించింది.

పోలీసుల ఎదురుదాడులు మార్చు

ఈ వరుస విజయాల వల్ల తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అటవీ యుద్ధాలకు శిక్షణ పొందిన మలబారు పోలీసు కంపెనీని రప్పించింది. వారికి రహస్య రవాణా సౌకర్యాలు, సమాచార మార్పిడికి వైర్లెస్ సెట్లు అందజేసింది. దాంతో పూర్తిస్థాయి గెరిల్లా యుద్ధానికి మన్యం ప్రాంతంలో తెరలేచింది. తిరుగుబాటు దారులకు అనుకూలతలు లభిస్తున్నా సుశిక్షితులైన పోలీసులు తీవ్రంగా దెబ్బతినేలా దాడి చేయగలిగేవారు. డిసెంబర్ 6, 1922న మలబారు పోలీసు దళం తిరుగుబాటు దారులపై పెదగడ్డగూడెం గ్రామ సమీపంలో దాడిచేసి గట్టి దెబ్బతీసింది. నలుగురు తిరుగుబాటుదారులు మరణించగా, ఇద్దరు పోలీసులకు దొరికిపోయారు, మరెందరో తీవ్రగాయాల పాలయ్యారు. వెనక్కితగ్గి అడవులు, కొండల్లోకి పారిపోతున్న తిరుగుబాటుదారుల్ని పోలీసులు వెంటాడి రాత్రి వేళ మరోదాడి చేశారు. తిరుగుబాటుదారులు-పోలీసులు రాత్రి కొండల్లో బాహాబాహీ తలపడ్డారు. 8మంది విప్లవకారులు మరణించగా, మరింతమంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన తిరుగుబాటుదారులను కోలుకోలేని దెబ్బగా బ్రిటీష్ వారు భావించారు. ఇక వారి బెడద క్రమంగా సన్నగిల్లిపోతుందని ఆశించారు. సామాన్య గ్రామస్తుల సహకారంతో తిరుగుబాటుదారులు పోలీసుల వెతుకులాట నుంచి విజయవంతంగా తప్పించుకోవడమే కాకుండా తమ దళాన్ని విస్తరించగలిగారు.

గ్రామస్తుల మీద అణచివేత, మత్తాదారుల లొంగుబాటు మార్చు

గ్రామీణులు-తిరుగుబాటుదారుల అనుబంధాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బ్రిటీష్ వారు తిరుగుబాటుదారుల గురించి సమాచారం అందిస్తే సొమ్ము ఇస్తామని రివార్డులు ప్రకటించారు. సహకరిస్తున్నందుకు గ్రామీణుల్ని శిక్షించేలా అధిక పన్నులు విధించారు. గ్రామస్తులను పోలీసు బలగాలు అమానుషమైన చిత్రహింసలకు గురిచేశారు. అల్లూరి సీతారామరాజు ఆచూకీ చెప్తే రూ.1500, గమ్ గంటం దొర, గమ్ మల్లయ్యదొరలను పట్టిస్తే చెరొక వెయ్యి రూపాయలు, పితూరీలో పాల్గొన్నవారెవరినైనా అప్పగించినా, వారిని అరెస్టు చేసేందుకు వీలయ్యే సమాచారం అందించిన రూ.50, 303 రైఫిల్ తెచ్చి ఇస్తే రూ.50 ఇస్తామని ప్రకటించారు. ప్రాంతంలో మార్షల్ లా ప్రకటించారు, సహకరిస్తున్న గ్రామస్తులను శిక్షించేందుకు అనుగుణమైన చట్టాలను అమలులోకి తెచ్చారు. తిరుగుబాటుకు సహకరిస్తున్నారన్న ఆరోపణపై కొందరు మత్తాదారులను అరెస్టు చేసి, చాలామంది మత్తాలను లాగివేసుకున్నారు.

తిరుగుబాటుదారుల ఇళ్ళు, బంధువుల ఇళ్ళు ప్రధాన లక్ష్యాలుగా గూడెంలోని ఇళ్ళలో విస్తృతంగా సోదాలు చేశారు. ఐతే వీటన్నిటి వల్లా బ్రిటీష్ వారి పట్ల గ్రామస్థులు అనుసరిస్తున్న సహాయ నిరాకరణ విషయంలో అంతగా మార్పు రాలేదు. కానీ బ్రిటీష్ వారు గ్రామస్థులు తమవైపుకు తిరగడం కన్నా, మత్తాదారులు, గూడేల పెద్దలు నయానా భయానా తమకు సహకరిస్తారని అంచనా వేశారు. బ్రిటీష్ వారి అంచనా సరైనదేనని తర్వాతి పరిణామాలు రుజువు చేశాయి. కొందరు మునసబులు, మత్తాదారులు తిరుగుబాటుదారులను పట్టించారు. ఏకంగా సీతారామరాజు తర్వాత రెండవ స్థానంలో ఉన్న గమ్ మల్లయ్యదొర ఓ కొండదొర యువతి ఇంట్లో దాగి ఉండగా, 1923 సెప్టెంబరులో పోలీసులు పట్టుకున్నారు. ఐతే ముగ్గురు మునసబులు ఈ పట్టివేతకు సమాచారాన్ని ఇచ్చారు, తమ వివరాలను ఎక్కడా బయటకు చెప్పొద్దనీ, పూర్తిగా తిరుగుబాటు అంతం అయ్యాకే రివార్డు ఇవ్వాలని కోరారు. ఐతే సామాన్య ప్రజలు మాత్రం తిరుగుబాటుదారులకు పూర్తి బాసటగా నిలిచారు.

సీతారామరాజు కాల్చివేత మార్చు

తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న అల్లూరి సీతారామరాజును 1924 మే 7న పోలీసులు కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం సీతారామరాజు తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు కాల్చిచంపారు. ఆయన మరణించినప్పుడు తీసిన ఫోటో ఆధారంగా పరిశోధకులు ఇది అవాస్తవమని, తలపైన, ఛాతిలోనూ తగిలిన బుల్లెట్ దెబ్బలు ఇది పట్టుకుని చంపిన ఘటనగా తేలుస్తున్నాయని భావించారు.[1]

లక్ష్యాలు మార్చు

తిరుగుబాటును నాయకుడు, దళం ఏ లక్ష్యాలతో ప్రారంభించి నడిపించారన్నది అస్పష్టంగానే ఉంది. అల్లూరి సీతారామరాజుకు అప్పటికే కాంగ్రెస్ వారి సహాయ నిరాకరణోద్యమంతోనూ, రహస్య ఉద్యమాలతోనూ సంబంధాలున్నాయని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. తద్వారా మన్యం విప్లవాన్ని కూడా దేశాన్ని విముక్తం చేసే అంతిమ లక్ష్యంతోనూ, వలస పాలనపై పూర్తి వ్యతిరేకతతోనూ సీతారామరాజు నిర్మించినట్టు చరిత్రకారులు అట్లూరి మురళి పేర్కొన్నారు. పైగా ఈ తిరుగుబాటు పూర్తిగా బ్రిటీష్ ప్రభుత్వ వ్యతిరేకతతోనే సాగిందనీ, స్వభావపరంగా మైదాన ప్రాంత వ్యాపారులు, కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా లక్ష్యం చేసుకున్నది కాదని ఆయన వాదించారు. ఈ లక్షణాల వల్ల తిరుగుబాటు పూర్వపు గిరిజనుల తిరుగుబాట్లకు భిన్నమైనదిగా నిలిచిందని పేర్కొన్నారు.[1] సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ ఆర్నాల్డ్ దీనికి భిన్నంగా వాదిస్తూ ఈ తిరుగుబాటుకు నేపథ్యంగా పూర్వపు తిరుగుబాట్లు ఉన్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు సాగించిన మన్యం తిరుగుబాటు తర్వాతి కాలంలోని ఆంధ్ర ప్రాంతంలో జాతీయోద్యమకారులను, ప్రజలను ఉత్సాహపరిచిందనీ, ఒక విధంగా జాతీయోద్యమానికి ఉత్ప్రేరకంగా నిలవడంతో వారు దీన్ని స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా స్వీకరించారని పేర్కొంటూ ఐతే తిరుగుబాటు జరుగుతున్న కాలంలో మాత్రం దీని స్వభావంలో జాతీయోద్యమం, వలస పాలన విముక్తి లేవన్నారు. పైగా ఈ పోరాటానికి మూలకారణాల్లో బ్రిటీష్ ప్రభుత్వం ఎంత కారణమో, మైదాన ప్రాంతం వారి దోపిడీ కూడా అంతే భాగమనీ, ఈ కారణాల వల్ల దీన్ని వలసపాలనకు వ్యతిరేకమైనదిగా లెక్కకట్టలేమని పేర్కొన్నారు.[3] ఐతే మురళి తన పక్షాన సీతారామరాజు ఖమ్మం అడవుల మీదుగా, బస్తర్ పాకిపోయి పెద్ద ఎత్తున అటవీ ప్రాంతపు ఉద్యమాన్ని లేవదీస్తానని, తద్వారా దేశాన్ని విముక్తం చేస్తానని చేసిన వ్యాఖ్యలు, తొలి పోలీసు స్టేషన్ దాడులు చేసినాకా తిరుగుబాటుదారులు మహాత్మా గాంధీకి జై వంటి నినాదాలు చేయడం, మద్రాసు శాసనసభలో ప్రశ్నకు పోలీసులు దీన్ని సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా అభివర్ణించడం వంటివి తన వాదనకు ఆధారంగా ఇచ్చారు.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 అట్లూరి, మురళి (1 జనవరి 1984). "Alluri Sitarama Raju and the Manyam Rebellion of 1922-1924". Social Scientist. 12 (4): 3–33. doi:10.2307/3517081.
  2. 2.0 2.1 2.2 గుహ, రామచంద్ర; గాడ్గిల్, మాధవ్ (1 జనవరి 1989). "State Forestry and Social Conflict in British India". Past & Present (123): 141–177.
  3. 3.0 3.1 3.2 ఆర్నాల్డ్, డేవిడ్ (1 జనవరి 1985). "Sitarama Raju's Rebellion: A Response". Social Scientist. 13 (4): 44–49. doi:10.2307/3517517. Retrieved 18 May 2016.