అంత్యాక్షరి
అంత్యాక్షరి లేదా అంతాక్షరి (Antakshri; దేవనాగరి: अन्ताक्षरी, ఉర్దూ: انتاکشری) ప్రస్తుతం ఎక్కువగా ప్రసిద్ధమైన పాటలతో పాటలు పాడుకుంటూ ఆడుకునే ఒక ఆట. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో ఎక్కువగా ఆడుతున్నారు.[1] పోటీలో పాల్గొన్న వ్యక్తి పాటలోని పల్లవి పాడి ఆపిన తర్వాత అదే పల్లవిలోని చివరి అక్షరంలో తరువాత వ్యక్తి వేరొక పాటలోని పల్లవి పాడాలి. ఇలా ఎంతకాలమైనా ఎంతమందయినా ఆడుకోవచ్చును.
ఇది సినిమా పాటలతోనే గాక పద్యాలు లేదా శ్లోకాలతో కూడా ఆడవచ్చును. ఉత్తర భారతదేశంలో దీనిని బేత్ బాజి (Beit bazi) అంటే మలయాళంలో అక్షరశ్లోకం (Aksharaslokam) అంటారు.
వ్యుత్పత్తి సవరించు
అంతాక్షరి రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది:
రెండింటిని కలిపినప్పుడు చివరి అక్షరంతో ఆడుకునే ఆట అని అర్ధాన్నిస్తుంది.
ఆడే విధానం సవరించు
ఈ ఆటను రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఆడతారు. యీ కార్యక్రమం ప్రయాణాలలో గానీ, బస్సులలో గానీ ఒక సమూహం ఉన్నప్పుడు వారు ఉల్లాసంగా ఉండేందుకు ఈ అంతాక్షరిని ఆడుతారు.ఆటాడే వారందరూ ఒక దగ్గర కూర్చొని ఎవరైనా ఒకరు సినిమా పాటలోని పల్లవిని పాడుతారు. ఆ వ్యక్తి ఆపిన పదంలోని చివరి హల్లు అక్షరం నుండి మరొకరు పల్లవి పాడాలి. యిలా రెండవ వ్యక్తి ఒక పాటను పాడి ఆవ్యక్తి ఆపిన పదం చివరి అక్షరాన్ని మూడవ వ్యక్తి ఉపయోగించుకుని వేరొక పాటను పాడతాడు. యిలా పాడిన పాట మరల పాడకుండా ఈ ఆట కొనసాగుతుంది. ఈ ఆటలో ఏ వ్యక్తి తనకు వచ్చిన హల్లుతో పాటను పాడలేకపోతాడో ఆయనను ఆట నుంచి నిష్కమింపజేస్తారు. మిగిలినవారు ఆడుతారు. యిలా ఈ ఆట కొనసాగుతుంది.
- ఉదాహరణ
మొదటి వ్యక్తి "కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ" అని పాడితే;
రెండవ వ్యక్తి "ర" అక్షరంలో మరొక పాట పాడాలి. రెండవ వ్యక్తి తర్వాత "రా వెన్నెల దొర వింత గనవేలా" అని పాడితే;
మూడవ వ్యక్తి "ల" అక్షరంతో ఆటను నడిపిస్తాడు.
ప్రజాదరణ సవరించు
ఇది ఒక కుటుంబం కాలక్షేపంగా ప్రారంభించారు . ఇప్పుడు భారతదేశం అంతటా దీని ఆధారంగా అనేక TV కార్యక్రమాలు, పోటీలు నిర్వహింపబడుచున్నవి. ప్రస్తుతం క్లాసిక్ స్టైల్ లో రెండు లేదా మూడు జట్లు ఈ పోటీలో పాల్గొని మొదటి జట్టు ఒక పాట పాడితే వారు ఆపిన పదంలో చివరి అక్షరం నుండి రెండవ జట్టులో సభ్యులు పాడుతారు. దీని ఆధారంగా పాయింట్లు లభిస్తాయి. ఒక ప్రముఖ భారతీయ టెలివిజన్ కార్యక్రమం జీ TV 10 సంవత్సరాలపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పురుష హోస్ట్ గా "అన్నూ కపూర్" శాశ్వతంగా నిర్వహిస్తే మహిళా హోస్ట్లుగా దుర్గా జస్రాజ్, రేనుక సహానె, షేపాలి, రాజేశ్వరి సచ్దేవ్, రీచా శర్మా ఆయనతో కలిపి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తులు పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులు, గృహిణులు, నిపుణులు, ప్రముఖులు ఉన్నారు. జీ టి.వి కార్యక్రమంలో ఈ జట్టుల పేర్లు "దీవానే", "ఫరవానే ", "మస్తానే "గా ఉన్నాయి.
మూలాలు సవరించు
- ↑ S. K. Rait, Sikh women in England: their religious and cultural beliefs and social practices, Trentham Books, 2005, ISBN 9781858563534,
... playing antakshri (a group singing game) ...