ఆర్థర్ కాటన్
కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (ఆగ్లం: Sir Arthur Cotton) ( 1803 మే 15 - 1899 జూలై 24) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల, నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందేలా చేసి చిరస్మరణీయడైయ్యాడు. [1] 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్ బిరుదాంకితుడైనాడు.
సర్ ఆర్థర్ కాటన్ | |
---|---|
![]() సర్ ఆర్థర్ కాటన్ | |
జననం | 1803 మే 15, |
మరణం | 1899 జూలై 24 డార్కింగ్, సర్రీ, యునైటెడ్ కింగ్ డమ్ | (వయసు 96)
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కాటన్ దొర |
పిల్లలు | ఎలిజెబెత్ హోప్ |
తల్లిదండ్రులు |
|
ఆర్థర్ కాటన్ వ్యాసం చూడండి |
ఆర్థర్ కాటన్ సమాధి |
జీవితంసవరించు
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ, ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్ ఆర్థర్ కాటన్ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్లో ఉద్యోగార్థం చేరాడు. అప్పటి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంతానికి చెరువుల శాఖకు ఇంజనీర్గా నియమించింది. భారతదేశంలో జలవనరులను సమర్ధవంతంగా వినియోగించడానికి పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, నిర్మించాడు. 1899 జులై 24న ఆర్థర్ కాటన్ చనిపోయాడు. [2]
కృషిసవరించు
కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి పై ధవళేశ్వరం ఆనకట్ట, కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరీవాహక జిల్లా లను అత్యంత అభివృద్ధి, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారతదేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణా నదిపై విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజి నిర్మాణానికి కృషి చేశాడు. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒడిసా, బీహారు, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.
కాటన్ ఆలోచనలపై విచారణసవరించు
1860లో కాటన్ రిటైర్ అయ్యి ఇంగ్లండు వెళ్ళిపోయాడు. ఆయన మొదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చాడు. భారతడేశానికి రైళ్లకంటె కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని అతని ఉద్దేశం, అని పంటలకూ, ప్రయాణాలకూ పనికొస్తాయని వాదించేవాడు. ఈ వాదనను వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. వారంతా ఇంగ్లండులో కాటన్ పై చర్చ లేవనెత్తారు. ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాలనివ్వలేదని, దండగ అనీ, కనుక విచారణ జరగాలన్నాడు. అక్కడ కామన్స్ సభలో చర్చ జరిగింది.
ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలక్టు కమిటీ నియమించారు. 1878లో లార్డ్ జార్జి హేమిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన యీ సంఘం 900 పై చిలుకు ప్రశ్నలు వేసి, కాటన్ ను పరీక్షించారు. ఐనా నాడు కామన్స్ సభలో జరిగిన చర్చలకు పత్రికలలో జరిగిన వాదోపవాదాలకు, సెలక్టు కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పి రాణించగలిగాడు కాటన్. కాటన్ తాను చేసిన పనిలో నమ్మకం ఉంచటమేగాక, ఫలితాలను ప్రత్యక్షంగా చూపగలగటమే కాటన్ ధైర్యానికి ఆస్కారమయింది. రైలుమార్గాలు వేసిన తరువాత వచ్చిన ఫలితాలనూ కాలువల వలన వచ్చిన వాటిని పోల్చి బాగోగులు చూపాడు.
1879-80లో కరువు విషయమై నియమించబడిన ఫామిన్ కమిషన్ కూడా సాగునీటి పథకాల అవశ్యకత, ప్రాధాన్యతను నొక్కిచెప్పి, కాటన్ వాదనను సమర్ధించాయి.
స్మరణలుసవరించు
- కాటన్ చాలా ముందుచూపుతో చేసిన కృషి వలన గోదావరివాసులకు బంగారుపంటల్ని యిచ్చిన వ్యక్తిగా చరిత్రకెక్కాడు. గోదావరి జిల్లా అసోసియేషన్ వారు కాటన్ కు "గోదావరి డెల్టా పితామహు"డని నామకరణం చేశారు. ఆయన పేరిట ఒక టౌన్ హాలు నిర్మించి తమ కృతజ్ఞత చూపారు.
- హైదరాబాదులో టాంక్ బండపై తెలుగు వెలుగులు సరళి విగ్రహాలలో కాటన్ విగ్రహం వున్నది.
- ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేక అర్ధాకృతి కాటన్ విగ్రహం కనబడుతుంది.
గోదావరినది ప్రార్ధనలలోసవరించు
తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పం చెప్పునప్పుడు
నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం
(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)
అని పఠించేవారు.[3] అంతటి గౌరవాన్నిపొందాడు
కాటన్మ్యూజియంసవరించు
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియాన్ని ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్దొర ఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించబడింది. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి. మ్యూజియం ఆవరణమీదుగా, మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారి వంతెన (ఫ్లైఒవర్) ఉంది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరి నది రాజమహేంద్రవరం నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు[3] వ్రాసిన స్పందన చిత్రము ఉంది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ అర్ధాకృతి విగ్రహం ఉన్నాయి. మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు.
మూలాలుసవరించు
- ↑ Hope, Elizabeth; Digby, William (1900). General Sir Arthur Cotton his life and work. Hodder & Stoughton. Retrieved 2021-06-24.
- ↑ నరిసెట్టి ఇన్నయ్య. " ఆర్థర్ కాటన్". అబద్ధాల వేట - నిజాల బాట. వికీసోర్స్.
- ↑ 3.0 3.1 మండలి బుద్ధ ప్రసాద్ (2010). " తెలుగు భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్". లండన్లో తెలుగు వైభవ స్మృతులు. వికీసోర్స్.
ఇతర పఠనాలుసవరించు
- Ch, Prashant Reddy (16 July 2003). "National water grid - A hundred-year-old plan" (Business Line). Archived from the original on 13 అక్టోబరు 2010. Retrieved 14 జనవరి 2014.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - S, Gurumurthi (14 October 2002). "Godavari - Still a sleeping beauty". Business Line (Business Line).
- Avilash Roul (14 March 2006). "INDIA'S WATER FUTURE - Are Interbasin Water Transfers a Solution? in Eco-World". Archived from the original on 19 అక్టోబరు 2006. Retrieved 14 జనవరి 2014.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - Gautam R. Desiraju (10 August 2003). "Sir Arthur Cotton - Correspondence with Current Science" (PDF). 85 (3).
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - Hots, Susan (2008). Biographical Dictionary of Civil Engineers in Great Britain and Ireland. Vol. 2. pp. 195–199. ISBN 9780727735041.
- Vibart, H.M. (1894). Addiscombe: its heroes and men of note. Westminster: Archibald Constable. pp. 343–51.