ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ (1917 - 1996) కవయిత్రీ, పరిశోధకురాలు.[1] ఈమె తనపేరు లక్ష్మీకాన్తమ్మ అని రాసుకుంది. స్త్రీ వాదంతో కూడిన స్త్రీలే రాసిన కథలతో కూడిన తొలి కథా సంకలనం 'కథా మందారం' (1968) సంకలనం చేసింది.
ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ | |
---|---|
![]() | |
జననం | |
మరణం | 1996 |
జీవిత భాగస్వామి | హయగ్రీవగుప్త |
పిల్లలు | సుహాసిని, ప్రతాపచంద్ర్రుడు, రాజరాజనరేంద్రుడు, విజ్ఞానేశ్వర కూమారుడు |
తల్లిదండ్రులు |
|
జీవిత విశేషాలు సవరించు
ఈమె తండ్రి పాత్రికేయులు నాళము కృష్ణారావు. తల్లి సంఘసేవకురాలు, ఆంధ్రమహిళాగానసభ స్థాపకురాలు నాళము సుశీలమ్మ. ఈమె పింగళ నామ సంవత్సరం డిసెంబరు 25, 1917 న ఏలూరులో జన్మించింది. ఈమె విద్యాభ్యాసము రాజమండ్రిలోని వీధిబడిలో ప్రారంభమైంది. తరువాత వైశ్య సేవాసదనము యువతీ సంస్కృత కళాశాలలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఉభయభాషాప్రవీణ 1935లో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణురాలయింది. యల్లాప్రగడ జగన్నాథము పంతులు ఈమెకు ఆధ్యాత్మక గురువు. ఈమెకు తన పదమూడవ యేట మార్చి 24, 1930లో హయగ్రీవ గుప్తతో వివాహం జరిగింది. ఈమె తన ఎనిమిద యేటనుండి 18 సంవత్సరాలు వీణావాదన నేర్చుకుంది. త్యాగరాయ కృతులు నేర్చుకుంది. మొదట ఈమె విష్వక్సేన గోత్రురాలు. వివాహమైన పిమ్మట ఈమె గోత్రము సుకాంచన అయ్యింది. దేవీ ఉపాసకురాలు.
ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.
ఈమె రచనలు గృహలక్ష్మి, భారతి, ప్రబుద్ధాంధ్ర, ఆంధ్రమహిళ, కృష్ణాపత్రిక, నవోదయ మొదలైన పత్రికలో ప్రచురింపబడ్డాయి. విజయవాడ, మద్రాసు రేడియోలలో ఈమె రచనలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి.[2]
ఏడవ ఏటనే అన్నగారితో పాటు గాత్రం, వీణా ప్రారంభించిన లక్ష్మీకాన్తమ్మగారు పదిహానేళ్లు నిండేవేళకి, కవితలల్లుతూనే, కుట్టుపనీ, ఎంబ్రాయిడరీ, నాట్యంవంటి కళలు నేర్చింది. బాపట్లలో కాపురం పెట్టినతరువాత భర్త హయగ్రీవగుప్తగారు నేర్పేరని రాసుకున్నారు స్వీయచరిత్రలో. మే పన్నెండవయేటనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, ఉపన్యాసాలు ఇవ్వడం, ఉత్తేజపూరితమయిన దేశభక్తిగేయాలు పాడడం చేసేవారు.
చిన్నప్పడే కామాక్షమ్మగారి ప్రోత్సాహంతో ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో సంస్కృతం చదువుకుంది. 18వ యేట ఉభయభాషా ప్రవీణ పట్టాతో పాటు “తెలుగుమొలక”, విద్వత్కవయిత్రి” బిరుదులు కూడా అందుకుంది. దాదాపు ఆరుదశాబ్దాల సాహిత్యకృషి చేసి పన్నెండు బిరుదులూ, ఇరవై ఘనసత్కారాలూ పొందిన కవయిత్రి ఆమె. ఆధునిక తెలుగు రచయిత్రులలో కనకాభిషేకం, గజారోహణం వంటి ఘనసన్మానాలు పొందింది.
వ్యక్తిగత జీవితం సవరించు
13వ యేట ఊటుకూరి హయగ్రీవ గుప్తగారితో లక్ష్మీకాన్తమ్మగారి వివాహం జరిగింది. 18వ ఏట తొలిసంతానం కలిగింది కానీ ఆరునెలలు మాత్రమే బతికిందిట ఆపాప. పదకొండుమంది పిల్లలలో ఇప్పుడువున్నవారు ఇద్దరు అమ్మాయిలూ, ముగ్గురు అబ్బాయిలూ. మంచి చదువులు చక్కగా చదివి జీవితాలలో స్థిరపడ్డారు.
రచనలు సవరించు
- దేవీస్తవతారావళి
- మనసాహితి - మధుభారతి (గేయములు)
- కన్యకమ్మనివాళి (కన్యకాపరమేశ్వరి స్తోత్రము, 1978),
- మహిళావిక్రమసూక్తము,
- ఆంధ్రుల కీర్తనవాజ్మయసేవ
- పరిశోధనా రచనలు - ఆంధ్రుల సంగీతవాజ్మయంపై ఒక పరిశోధన, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు
- ఆంధ్ర కవయిత్రులు, 2వ కూర్పు. 1980
- హంస విజయము
- అభిజ్ఞాన శాకుంతలము
- జాతి పిత
- ఒక్క చిన్న దివ్వే (చిన్న కవితలు) (1980)
- నాతెలుగు మాంచాల (1981)
- లజ్జ కిరీటధారిణి
- నావిదేశపర్యటనానుభవాలు (యాత్రాచరిత్రలు)
- సరస్వతీ సామ్రాజ్య వైభవము (ఏకాంకిక) (1988)
- సాహితీరుద్రమ (ఆత్మచరిత్ర) (1993)
- కాంతి శిఖరాలు (భక్తి గీతాలు)
- భారతదేశ చరిత్ర కొన్ని గుణపాఠములు (చరిత్ర)
- సదుక్తిమంజరి (హిందీకవులయిన కబీర్, తులసీదాస్, విందా రహీమ్ సుభాషితాలు తెలుగులో)
- అమృతవల్లి (నవల)
- కోరలమధ్యన కోటి స్వర్గాలు (నవల)
- చీకటి రాజ్యము (నవల)
- శ్రీ కన్యకా సుప్రభాతమ్
అముద్రిత రచనలు సవరించు
- చంద్రమతి కథ (బాలసాహిత్యము)
- సాహిత్య వ్యాసమంజరి
- ఋతంబరి (గద్యగీతము)
- యుగళ సిరి
బిరుదులు సవరించు
- డాక్టరేట్
- విద్వత్కవయిత్రి
- ఆంధ్ర విదుషీకుమారి
- తెలుగు మొలక
- ఆంధ్ర సరస్వతి
- కవయిత్రీ తిలక
- సాహితీ రుద్రమ
- కళాప్రపూర్ణ మొదలైనవి.
సత్కారాలు సవరించు
- అనంతపురం పౌరులచే కనకాభిషేకము, పౌరసన్మానము
- 1953లో గృహలక్ష్మి స్వర్ణకంకణము
మూలాలు సవరించు
- ↑ Full text of "Telugu Women Writers, 1950-1975, analytical study" by nidadavolu malathi
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-02-19. Retrieved 2018-08-24.
- తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
- సాహితీ రుద్రమ - ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ. బాపట్ల, 1993.