ఏడిదము సత్యవతి ఆత్మకథ రాసుకున్న తొలి తెలుగుమహిళల్లో ఒకరు.[1] ఈమె రాసుకున్న ఆత్మచరితము అనే పుస్తకం మొదటిసారి 1934 లో బెజవాడలోని ఆంధ్రముద్రణ గ్రంథాలయం నుంచి క.కోదండరామయ్య చే ముద్రించబడింది.[2] ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వకుళాభరణం రాజగోపాల్ స్త్రీలు తెలుగులో రాసిన ఆత్మకథల్లో ఇది మొదటిది కావచ్చనే భావన వ్యక్తం చేశాడు.[3]

జీవితం మార్చు

సత్యవతి తండ్రి బెజవాడలో డి.పి.డబ్ల్యు లో ఓవర్ సీయరు. ఆమెకు ఐదేళ్ళ వయసులో వాళ్ళ ఊరిలోని బాలికా పాఠశాలకు పంపించారు. ఆమెకు చిన్నప్పటి నుండి దైవభక్తి ఎక్కువగా ఉండేది. పతివ్రతా చరిత్రలు ఎక్కువగా చదివేది. ఆమెకు పది సంవత్సరాల వయసులో కోరంగి గ్రామంలో జరిగిన ఒక ఉపనయన కార్యక్రమానికి హాజరై అతన్నే భర్తగా కావాలనుకున్నది. తర్వాత అతనితోనే ఆమె వివాహం జరిగింది. అతని పేరు సీతారామయ్య. అతను ఎఫ్. ఎ పరీక్షలో ఉత్తీర్ణుడై తర్వాత మామగారి ప్రోద్భలంతో కాకినాడ ఉన్నత కళాశాలలో బి. ఎ చదివాడు. పోలీసు సబ్ ఇన్ స్పెక్టరు ఉద్యోగంలో చేరాడు. గంజాం జిల్లాలోని శ్రీకాకుళంలో ఆరు నెలలు పనిచేశాడు. తర్వాత ఆముదాలవలసకు బదిలీ అయింది. అక్కడ అతను అకారణంగా ఉద్యోగం కోల్పోయాడు. మద్రాసు వెళ్ళి పోరాడి తిరిగి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతని పైఅధికారి అతనిమీద కోపంతో బమినిగాం అనే ఏజెన్సీ ఏరియాకు బదిలీ చేశాడు. అక్కడ నివసించడానికి అనువుగా లేకపోవడంతో సత్యవతి కొద్ది రోజులు విడిగా ఉండవలసి వచ్చింది. తర్వాత అతనికి దారిగంబాడీ అనే స్టేషనుకు బదిలీ అయ్యింది. అక్కడికి తన భార్యతో పాటు ఒక మనిషిని ఇచ్చి పంపమని మామగారికి ఉత్తరం రాశాడు సీతారామయ్య. కానీ అక్కడి పరిస్థితులు తోడు వచ్చిన ఆమె వెళ్ళిపోయింది. చివరికి దంపతులిద్దరూ అక్కడ కొద్ది రోజులు కాపురం చేశారు. తర్వాత ఇద్దరూ అప్పుడప్పుడూ జ్వరం బారిన పడుతూ ఉండేవారు. కొంతకాలానికి సీతారామయ్య ఆ జ్వరంతోనే కన్నుమూశాడు.[3]

భర్తమీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ఆమె ఆయనతో పాటు చనిపోవాలని ప్రయత్నం చేసింది గానీ అక్కడి వాళ్ళు ఆపి ఆమెను తిరిగి తండ్రి వద్దకు పంపేశారు. అక్కడి నుంచి మరణించేవరకు ఆమె భర్తనే తలుచుకుంటూ జీవితం సాగించింది.

తెలుగులో ఆత్మకథలు మార్చు

1934 కు మునుపు తెలుగులో మూడు ఆత్మకథలు ప్రచురింపబడ్డాయి.

  1. కందుకూరి వీరేశలింగము - స్వీయచరిత్రము (మొదటి సంపుటము 1911, రెండవ సంపుటము 1915)
  2. రాంభొట్ల జగన్నాథ శాస్త్రి - స్వీయచరిత్రము (1915, విశాఖపట్టణము)
  3. రాయసం వెంకట శివుడు - ఆత్మచరిత్రము (1933, గుంటూరు)

ఈ ఆధారాలను బట్టి తొలి తెలుగు స్వీయచరిత్రల్లో ఈమెది ఉన్నత స్థానమని తెలుస్తుంది.

ఆత్మచరితములోని అంశాలు మార్చు

ఈ పుస్తకం రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగం సత్యవతి తన భర్త సీతారామయ్యతో మొదటిసారి కలవడంతో ప్రారంభమై ఆయన మరణం తర్వాత ఆమె అభిప్రాయాలతో అంతమవుతుంది. రెండవభాగంలో భగవంతుని అస్తిత్వం, ప్రశ్నలు, వాటికి ఆమెకు తోచిన సమాధానాలు ఉన్నాయి.

ప్రచురణలు మార్చు

ఈ పుస్తకం మొదటిసారిగా 1934 లో క.కోదండరామయ్యచే బెజవాడలోని ఆంధ్రముద్రణ గ్రంథాలయంలో ముద్రింపబడగా దీనికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుని సికిందరాబాదులోని అస్మిత (రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్) వారు 2005లో పునర్ముద్రించారు.

మూలాలు మార్చు

  1. "బతుకు దారిలో వెలుగు చూసిన నంబూరి పరిపూర్ణ". www.andhrajyothy.com. Retrieved 2020-05-30.[permanent dead link]
  2. "తెలుగులో తొలి మహిళా ఆత్మకథ – డా.శిరీష ఈడ్పుగంటి |". vihanga.com. Archived from the original on 2016-07-19. Retrieved 2020-05-30.
  3. 3.0 3.1 చౌదరి, జంపాల వి. (2011-09-07). "తొలి తెలుగు మహిళా ఆత్మకథ – ఏడిదము సత్యవతి ఆత్మచరితము". పుస్తకం (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-30.