కాకోరీ కుట్ర

కాకోరీలో జరిగిన దోపిడీకి రైలు

కాకోరీ కుట్ర (లేదా కాకోరీ ట్రైన్ దోపిడీ, కాకోరీ కేసుభారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకోరీ, లక్నో స్టేషన్ల మధ్య 1925 ఆగస్టు 9న జరిగిన ట్రైన్ దోపిడీ. ఈ దోపిడీని హిందుస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్.ఆర్.ఎ.) వారు చేశారు.

జర్మనీలో తయారైన మాసర్ పిస్టల్ బొమ్మ. భారత స్వాతంత్ర్య సమరయోధులు నాలుగు మాసర్లు వాడారు.

ఈ దోపిడీకి తర్వాతికాలంలో హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌గా పేరుపడ్డ హెచ్.ఆర్.ఎ.కు చెందిన రాం ప్రసాద్ బిస్మిల్లా, అష్ఫాకుల్లా ఖాన్ ప్రణాళిక రచించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు బ్రిటీషు ఇండియా మీద విప్లవాత్మక చర్యలు చేపట్టాలన్నది వారి లక్ష్యం. సంస్థ ఆయుధాలు కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం కాబట్టి బిస్మిల్, అతని పార్టీ ఉత్తర రైల్వే లైనులోని ఒక రైలును దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నది.[1] దోపిడీ ప్రణాళికను రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, చంద్రశేఖర్ అజాద్, సచీంద్ర బక్షీ, కేశబ్ చక్రవర్తి, మన్మథ్‌నాథ్ గుప్తా, మురారీ లాల్ ఖన్నా (మురారీ లాల్ గుప్తా పెట్టుకున్న మారుపేరు), ముకుండిలాల్ గుప్తా, భన్వరీ లాల్ అమలుచేశారు.[2][3] ఈ దోపిడీలో ప్రమాదవశాత్తూ ఒక ప్రయాణికుడు చనిపోయాడు.

దోపిడీ మార్చు

1925 ఆగస్టు 9న షాజహాన్‌పూర్ నుంచి లక్నో ప్రయాణిస్తున్న 8వ నంబర్ రైలును కాకోరీ పట్టణం (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో ఉంది) సమీపంలో విప్లవకారుల్లో ఒకడు అత్యవసర గొలుసు లాగి రైలును ఆపి, వెనువెంటనే గార్డును దెబ్బతీశారు. ఆ రైల్లో భారతదేశపు పన్నుల డబ్బు బ్రిటీష్ ఖజానాకు తరలిపోతోంది కాబట్టి దోపిడీ చేశారని చెప్తారు. వారు కేవలం ఆ డబ్బు సంచుల్లోని రూ.8 వేలు మాత్రమే దోపిడీ చేసి లక్నో తప్పించుకున్నారు. ఈ దోపిడీ లక్ష్యాలు:

  • హెచ్.ఆర్.ఎ.ను బ్రిటీష్ ప్రభుత్వం నుంచి దోపిడీచేసిన డబ్బుతో నడపడం.
  • హెచ్.ఆర్.ఎ. గురించి భారతీయుల్లో ఆసక్తిని, సదభిప్రాయాన్ని కలిగించడం.

ఉద్దేశపూర్వకంగా కాక ప్రమాదవశాత్తూ జరిగిన కాల్పులో అహ్మద్ అలీ అన్న ప్రయాణికుడు మరణించడంతో ఇది, హత్యకేసు కూడా అయింది. ఈ సంఘటన తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం తీవ్రమైన వేట ప్రారంభించి హెచ్.ఆర్.ఎ.కు సంబంధించిన పలువురు విప్లవకారులను పట్టుకుంది. 1925 సెప్టెంబర్ 26న వారి నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ సహరణ్‌పూర్‌లో, తర్వాతి ముఖ్యనాయకుడు అష్పాకుల్లాఖాన్ మరికొన్ని నెలలకు ఢిల్లీలో దొరికారు.

అరెస్టులు మార్చు

కాకోరీ కుట్రకేసులో భారతదేశ వ్యాప్తంగా 40 మందిని అరెస్టు చేశారు.[4] వారి పేర్లు, వారిని అరెస్టు చేసిన ప్రదేశాలు ఇవి:

  • ఆగ్రాలో
    • చంద్ర ధర్ జోహ్రి
    • చంద్రబల్ జోహ్రి
  • అలహాబాదులో
    • షితాలా సహాయ్
    • భూపేంద్రనాథ్ సన్యాల్
  • వారణాసిలో
    • మన్మథ్‌నాథ్ గుప్త
    • ఫణీంద్రనాథ్ బెనర్జీ
    • దామోదర్ స్వరూప్ సేత్
    • రామ్‌నాథ్ పాండే
    • దేవ్ దత్ భట్టాచార్య
    • ఇంద్ర విక్రమ్ సింగ్
    • ముకుంది లాల్
  • బెంగాల్‌లో
  • ఎటాలో
    • బాబూ రాంవర్మ
  • హర్దోయ్‌లో
    • బైరాన్ సింగ్
  • కాన్పూర్ నుంచి
    • రాం దులారే త్రివేది
    • గోపీ మోహన
    • రాజ్‌కుమార్ సిన్హా
    • సురేష్ చంద్ర భట్టాచార్య
  • లాహోర్‌లో
    • మోహన్‌లాల్ గౌతమ్
  • లఖింపూర్‌లో
    • హర్ణం సుందర్‌లాల్
  • లక్నోలో
    • గోవింద్ చరణ్ కర్
    • సచీంద్రనాథ్ విశ్వాస్
  • మధుర నుంచి
    • శివ్ చరణ్ లాల్ శర్మ (ఇతనిపై వారెంట్ వచ్చింది, కానీ అప్పటికే ఫ్రెంచి పాలనలోని పాండిచేరీ పారిపోవడంతో అరెస్టు కాలేదు)
  • మీరట్‌లో
    • విష్ణు శరణ్ దుబ్లిష్
  • ఒరైలో
    • వీర్ భద్ర తివారీ
    • పుణెలో
    • రామకృష్ణ ఖత్రీ
  • రాయ్‌బరేలీలో
    • భన్వరీలాల్
  • షాజహాన్‌పూర్‌లో
  • బనార్సీ లాల్
  • From ప్రతాబ్‌గఢ్

వీరిలో సచీంద్రనాథ్ సన్యాల్, రాజేంద్ర లాహిరీ, యోగేష్ చంద్ర చటర్జీ బెంగాల్‌లో అప్పటికే అరెస్టై ఉన్నారు. దక్షిణేశ్వర్ బాంబు కేసులో లాహిరీని విచారించారు, అష్ఫాకుల్లా ఖాన్, సచీంద్ర బక్షీ కాకోరీ కుట్ర కేసు ముగిశాకా దొరికారు. ఒక అనుబంధ కేసు వీరిపై నమోదుచేసి అదే పద్ధతిలో విచారించారు. వీరిలో రామకృష్ణ ఖత్రీ కూడా ఉన్నారు. ఇతను గంగారాం అనే పేరుతో పిలవబడేవాడు. ఈ సంఘటన ప్రసారానికి గాను చంద్రశేఖర్ ఆజాద్, అశ్ ఫక్ ఉల్లాహ, రాజేంద్ర లాహిరి, సచీంద్రనాథ్ భక్షి వంటి క్రాంతికారులతో రామకృష్ణ ఖత్రి చేతులు కలిపారు. వీరిలో కొందరు 5 నుండు 10 సంవత్సరాల వరకు కారాగార శిక్ష అనుభవించారు. ఈ సంఘటను సంబంధించి రామకృష్ణ ఖత్రీ జైలు నుండి బయటకి వచ్చాక కాకోరీషహీద్ స్మృతి, షహీదోం కీ ఛాయా అను రెండు పుస్తకాలు రచించాడు.

కుట్ర కేసు మార్చు

దోపిడీ, హత్య సహా రాంప్రసాద్ బిస్మిల్‌పైనా, మరికొందరి పైనా పలు నేరాలను మోపారు. 15 మందిపై తగిన సాక్ష్యాలు లేక వారిని విడుదల చేశారు. కేసు నడిచేనాటికి ఐదుగురు పరారీలో ఉన్నారు. ఐదుగురిలో ఇద్దరు - అష్ఫాకుల్లా కాన్, సచీంద్రనాథ్ బక్షీ - కేసు విచారణ ముగిశాకా దొరికారు. మరొకడు చంద్రశేఖర్ అజాద్ 1928లో హెచ్.ఆర్.ఎ.ను పునర్నిర్మించి పోరాటం సాగించాడు, 1931 ఫిబ్రవరి 27న పోలీసులకు దొరికిపోబోగా అలహాబాదులోని చంద్రశేఖర్ అజాద్ పార్కులో తనను తాను కాల్చుకుని చనిపోయాడు.[5]

కొందరు నిందితులపై సాక్ష్యం లేక కేసు ఉపసంహరించుకోగా మిగిలిన 28 మందిపై 1926 మే 21న ఎ. హామిల్టన్ ప్రత్యేక సెషన్ కోర్టులో విచారణ కొనసాగింది. అబ్బాస్ సలీం ఖాన్, భన్వరీ లాల్ భార్గవ, జ్ఞాన్ ఛటర్జీ, మహమ్మద్ ఆయుఫ్‌లు కేసులో న్యాయమూర్తికి సహకరించే మదింపుదారులుగా నియమితులయ్యారు. నిందితుల్లో బెంగాల్‌లో నిర్బంధించిన సచీంద్రనాథ్ సన్యాల్, జోగేష్ చంద్ర ఛటర్జీ, రాజేంద్రనాథ్ లాహిరీలను తరలించారు. 1916లో బాలగంగాధర్ తిలక్ లక్నో పర్యటించినప్పుడు భారీ ఊరేగింపుకు నేతృత్వం వహించినందుకు రాంప్రసాద్ బిస్మిల్‌పై వ్యక్తిగత వ్యతిరేకత పెంపొందించుకుంటూ వచ్చిన న్యాయవాది జగత్ నారాయణ్ ముల్లాను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది.

పోలీసులు అరెస్టు చేసిన నాటి నుంచీ అష్ఫాకుల్లా ఖాన్‌ నుంచి కేసులో అతని సహ నిందితుల మీద మౌలిక సాక్ష్యం సంపాదించేందుకు వేధించారు. అయితే ఎంత వేధించినా అష్ఫాకుల్లా ఖాన్ సహచరులకు వ్యతిరేకంగా వివరాలు చెప్పడానికి నిరాకరించాడు. మరో అనుబంధ కేసుని అష్పాకుల్లా ఖాన్, సచీంద్ర బక్షీలపై నమోదుచేసి, నడిపారు.

తుది తీర్పు మార్చు

ఈ కేసులో శిక్షలు ఇలా ఉన్నాయి:[6]

  • మరణశిక్ష: రాంప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లాహిరీ, అష్ఫాకుల్లా ఖాన్
  • అండమాన్ సెల్యూలర్ జైలుకు ద్వీపాంతరవాస శిక్ష: శచీంద్రనాథ్ సన్యాల్, శచీంద్ర బక్షీ
  • 14 సంవత్సరాల జైలు శిక్ష: మన్మథ్ నాథ్ గుప్త
  • 10 సంవత్సరాల జైలు శిక్ష: యోగేష్ చంద్ర ఛటర్జీ, ముకుంది లాల్, గోవింద్ చరణ్ కర్, రాజ్ కుమార్ సింగ్, రామ్ కృష్ణ ఖత్రీ
  • 7 సంవత్సరాల జైలు శిక్ష: విష్ణుచరణ్ దుబ్లిష్, సురేష్ చరణ్ భట్టాచార్య
  • 5 సంవత్సరాల జైలు శిక్ష: ధూపేన్ నాథ్ సన్యాల్, ప్రేమ్ కృష్ణ శర్మ
  • 4 సంవత్సరాల జైలు శిక్ష: కేశబ్ చక్రవర్తి

మూలాలు మార్చు

  1. Dr. Mehrotra N. C. Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan page 117.
  2. Dr. Mahaur Bhagwandas Kakori Shaheed Smriti page 30
  3. Sharma Vidyarnav Yug Ke Devta : Bismil Aur Ashfaq page 118
  4. Dr. Mehrotra N. C. Swatantrata Andolan Mein Shahjahanpur Ka Yogdan, page 124–125.
  5. क्रान्त (2006). Swadhinta Sangram Ke Krantikari Sahitya Ka Itihas (in Hindi). Vol. 2 (1 ed.). New Delhi: Praveen Prakashan. p. 549. ISBN 81-7783-120-8.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  6. Rana, Bhagwan Singh (2004). Chandra Shekhar Azad (An Immortal Revolutionary of India) (1st ed.). New Delhi, India: Diamaond books.