గిడుగు రాజేశ్వరరావు

గిడుగు రాజేశ్వరరావు (నవంబరు 7, 1932 - జూలై 21, 2013) తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి మనుమడు. ఈయన తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు, తెలుగు భాషను మాట్లాడండి. పిల్లలకు నేర్పించండి. అంటూ నిరంతరం సాగించిన ప్రచారం ఆయన భాషా సేవకు నిదర్శనం.

గిడుగు రాజేశ్వరరావు
గిడుగు రాజేశ్వరరావు
జననంగిడుగు రాజేశ్వరరావు
నవంబరు 7, 1932
పర్లాకిమిడి
మరణంజూలై 21, 2013
న్యూఢిల్లీ
మరణ కారణంగుండెపోటు
నివాస ప్రాంతంన్యూఢిల్లీ
ఇతర పేర్లుగిడుగు రాజేశ్వరరావు
ప్రసిద్ధిరచయిత, కళాకారుడు
పిల్లలుకుమార్తె స్నేహలత,
కుమారుడు రామదాసు
బంధువులుగిడుగు వెంకట రామమూర్తి (తాతయ్య)

జీవిత విశేషాలు మార్చు

నవంబరు 7, 1932లో పర్లాకిమిడిలో జన్మించిన రాజేశ్వరరావు విజయనగరంలో ఎఫ్.ఎ (ఫెలో ఆఫ్ ఆర్ట్స్.. ఇంటర్మీడియట్ సమానార్హత), పర్లాకిమిడిలో బి.ఎ చదివారు. భువనేశ్వర్ లోని ఉత్కళ విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకం పొందారు. చిన్న వయస్సులోనే రాజేశ్వరరావు రాసిన "టార్చి లైట్" అనే కార్డు కథ 1947, ఆగస్టు 15 నాటి "చిత్రగుప్త" సంచికలో ప్రచురితమైంది. దాదాపు ముప్పై కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. "రాగిరేకు", "విషవలయాలు", "కర్మయోగులు" కథలకు వివిధ పత్రికల్లో బహుమతులు వచ్చాయి. పలు నవలలు, కథలు, శతకాలు, పద్యాలు రచించారు. తాత గిడుగు రామమూర్తి గారి జీవిత విశేషాలు "ఉదాత్త చరితుడు" అన్న పుస్తకంలో పేర్కొన్నారు. ఆ పుస్తకాన్ని ప్రముఖ రచయిత డా. సి.నారాయణరెడ్డి 2012 లో ఆవిష్కరించారు. ఎంతో కష్టపడి శ్రమకోర్చి సేకరించిన సమాచారంతో తాత జీవిత చరిత్రను తీసుకొచ్చారు. భావవీచికలు, పిల్లలకు పిట్టకథలు, పూలతేరు,అమూల్య క్షణాలతోపాటు వివిధ లలిత గీతాలు, మరెన్నో కథలు రచించారు. హైదరాబాద్లో ఎ.జి. కార్యాలయ సిబ్బంది స్థాపించిన రంజని సంస్థ అధ్యక్షునిగా కొంతకాలం వ్యవహరించారు. ఆయన రచించిన చిన్నపిల్లల పాటలు, కథలు, ఆకాశవాణిలో ప్రత్యేకంగా ప్రసారమయ్యేవి. సరళ హృదయం, సాధుస్వభావం, సౌజన్యశీలం, మితభాషిత్వం, ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణాలు.

జీవితాన్ని ఉన్నదున్నట్లుగా దర్శించి దర్శించినదాన్ని అక్షరబద్దం చేసి పాఠకుల కళ్ల ముందుంచేందుకు రాజేశ్వరరావు తన కథల ద్వారా విశేష కృషి చేశారు. అనుభవాల్లోంచి అక్షరాల ద్వారా మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. సమకాలిక జీవితాన్నీ, సమస్యల్నీ అనేక కోణాల్లోంచి విశ్లేషించి, కనీసం ఆటు దృష్టి నిలిపి ఆలోచింపజేసే కథలు రాయాలని, ఆ లక్ష్యం వేపు నడవాలనేది రాజేశ్వరరావు కోరిక. స్పష్టంగా, తేలికగా, సూటిగా చెప్పడంలోనే పాఠకుల హృదయానికి సన్నిహితంగా వెళ్లవచ్చని తన కథలలో నిరూపించారు. బాల్యం నుంచి ఆయనపై ప్రభావితం చేసిన మహానుభావులెంతో మంది ఉన్నా... మొట్టమొదటగా ఆయన్ను ఆకట్టుకున్న కథలు టాల్‌స్యాయివే.

స్నేహశీలి అయినా గిడుగు రాజేశ్వర్‌ రావు, ప్రపంచంలో ఏమార్పైన మానవ అభ్యుదయానికి దోహదపడాలనీ మనసారా అకాంక్షించిన అభ్యుదయ వాదిగా గుర్తింపు పొందారు. వీరు రాసిన 80 కథానికల్లో బ్రతుకు భయం, రాగిరేకు, కర్మయోగులు వంటి 18 కథానికలు బహుమతు అందుకున్నాయి. నవంబర్‌ 7, 1932లో జన్మించిన రాజేశ్వర్‌ రావు రంజని ఏజి ఆఫీసు తెలుగు సాహితీ సమితికి అధ్యక్షులుగా పనిచేశారు. 1993లో రాగవీచికలు కావ్యానికి గరికపాటి సాహిత్య పురస్కారం, మల్లెపందిరికి ఆంధ్ర సారస్వత సమితి సాహిత్య పురస్కారం లభించాయి.

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, శైలజ, జానకి, మోహన రాజు తదితరులు ఆయన రచించిన పాటలను పాడారు. కందపద్యాలు రాయడంలో రాజేశ్వరరావు దిట్ట. పిల్లల కోసం గేయాలు, కథలు సైతం రచించారాయన. 'గిడుగురామ్మూర్తి జీవిత చరిత్ర'ను కూడా రాశారు. రాజేశ్వరరావుకు కుమార్తె స్నేహలత, కుమారుడు రామదాసు ఉన్నారు. రామదాసు ఢిల్లీలోనే రక్షణ శాఖలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తుండగా.. కూతురు స్నేహలత గాయనిగా, వైణికురాలిగా పేరొందారు. కాగా..

ఆయన స్వగతం మార్చు

"పిలిస్తే పలక్కుండా పోయే ఎంతటి పెంకి పిల్లాడైనా కథ చెప్తానంటే చాలు ఆగి వెనక్కి వచ్చేస్తాడు. సాహిత్య ప్రక్రియల్లో కథకుండే ప్రత్యేకత ఇది. అందుకే పంచతంత్ర కర్త విష్ణుశర్మ కథను ప్రయోజనకరంగా మలచుకున్నారు. చిన్నపిల్లలకోసం వచ్చే కొద్ది మంచి పత్రికలూ, కథల పుస్తకాలూ, పెద్దవాళ్ల చేతుల్లో తరచూ కనిపిస్తుంటాయి. యాంత్రికంగా పరుగు పందెంలా తయారైన ఈవిత గమనంలో కథకు ఉన్న ఆకర్షణా, ఆదరణా ముందు ముందు పెరుగుతుందే గాని తరగదు. అందుకనే నా ఆనందాన్ని, ఆశ్చర్యాన్నో, ఆవేదననో కథా రూపంలో అందరితో పంచుకోవాలని కోరుకుంటాని. అదో తృప్తి". అని గిడుగు రాజేశ్వరరావు ఓ పుస్తకంలో స్యయంగా స్వగతంగా రాసుకున్న పలుకులివి.

ఆయన తన కుమారుని యింట్లో ఢిల్లీలో 2013, జూలై 21 న గుండెపోటుతో మరణించారు.

రచనలు మార్చు

కథలు మార్చు

  1. కాళిందిలో వెన్నెల
  2. గిడుగు రాజేశ్వరరావు కథలు
  3. పూలతేరు

గేయాలు మార్చు

  1. భావవీచికలు
  2. మల్లె పందిరి
  3. రాగవీచికలు

రేడియో నాటికలు మార్చు

  1. శబ్ద చిత్రాలు (నాటికలు)లో వీరు రాసిన తొమ్మిది నాటికలను ప్రచురించారు.[1]
  2. ఐదువేలు
  3. కావ్యగానం
  4. చంద్రగ్రహణం
  5. మంత్రదండం
  6. మనం కూడా మారాలి
  7. మావారు మంచివారు
  8. మెనీ హాపీ రిటన్స్
  9. సుందరీ సుధాకరం

మూలాలు మార్చు

  1. శబ్ద చిత్రాలు (నాటికలు), గిడుగు రాజేశ్వరరావు, స్నేహలత ప్రచురణలు, హైదరాబాద్, 2003.

యితర లింకులు మార్చు