చౌమహల్లా పాలస్ లేదా Chowmahalla Palace (నాలుగు మహాళ్ళు) హైదరాబాదు రాష్ట్రం లోని నిజాం నివాసం. ఆసఫ్ జాహి వంశపు పరిపాలనా రాజధాని హైదరాబాదు యందు నిజాం నివాస స్థలం. ఈ భవనం బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జాహ్ ఆస్తిగా పరిగణింప బడుతుంది.[1] పర్షియన్ భాషలో "చహర్" అనగా నాలుగు, అరబీ భాషలో "మహాలత్" అనగా సౌధాలు (బహువచనం), అలా దీనికి చౌమహల్లా అనే పేరు పెట్టబడింది. ఉన్నత స్థాయి ప్రభుత్వ, రాజరిక కార్యక్రమాలన్నీ ఈ పాలస్ లోనే జరిగేవి. ఈ సౌధానికి, యునెస్కో వారిచే సాంస్కృతిక వారసత్వ కట్టడంగా 2010 మార్చి 15 న ప్రదానం చేయబడింది.[2][3]

చౌమహల్లా పేలస్ భవనం
సాధారణ సమాచారం
రకంరాజ సౌధం
నిర్మాణ శైలినమూనా ఇరాన్ షాహ్ సౌధం
ప్రదేశంహైదరాబాద్ , తెలంగాణ , భారత్
పూర్తి చేయబడినది1880
చౌమహల్లా పేలస్ సుందర దృశ్యం. ఫోటో సౌజన్యం - లాలా దీన్ దయాళ్ - 1880.

చరిత్ర సవరించు

 
చౌమహల్లా పాలస్ లోని డ్రాయింగ్ రూమ్.

సలాబత్ జంగ్ దీని నిర్మాణాన్ని 1750 లో ప్రారంభించాడు, ఆసఫ్ జాహ్ 5, ఐదవ నిజాం దీనిని 1857, 1869 మధ్యలో పూర్తి చేసాడు. ఈ నిర్మాణాన్ని టెహ్రాన్ లోని షాహే ఇరాన్ సౌధం నమూనాగా భావిస్తారు.

ఈ సౌధం తన విలక్షణమైన నిర్మాణానికి ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో ప్రారంభింపబడిన దీని నిర్మాణం పూర్తి గావడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ కాలంలో నూతన ఒరవడులకు చవిచూసింది. ఈ సౌధంలో రెండు ప్రాంగణాలు వున్నాయి, దక్షిణ ప్రాంగణం, ఉత్తర ప్రాంగణం. వీటిలో సుందర సౌధాలున్నాయి. ఒక ఖిల్వత్ (మహాదర్బారు), నీటి ఫౌంటెన్, ఉద్యానవనాలు ఉన్నాయి.

ఈ సౌధం మొదట నలభై ఐదు ఎకరాల్లో విస్తరించి వుండేది, కానీ నేడు అది కేవలం పద్నాలుగు ఎకరాల్లో మాత్రమే ఉంది.

దక్షిణ భాగం సవరించు

ఈ భాగం, సౌధం లోని పురాతన భాగం. ఇందులో నాలుగు చిన్న సౌదాలున్నాయి, అవి, అఫ్జల్ మహల్, మహాతాబ్ మహల్, తహ్నియత్ మహల్, ఆఫ్తాబ్ మహల్. ఇది నవీన సాంప్రదాయిక రీతిలో నిర్మింపబడింది.

ఉత్తర భాగం సవరించు

ఈ భాగంలో బారా ఇమాం వున్నది, తూర్పు వైపున ఓ పొడవైన గదుల సమూహం, దాని ముందు భాగాన నీటి కొలను, ఈ విభాగంలో ప్రభుత్వ పరిపాలనా విభాగం వుండేది. షీషె - అలత్ (అద్దపు దృశ్యం) ఉంది.

ఇందులో మొఘలుల శైలిలో గల అనేక గుమ్మటాలు, పర్షియన్ నిర్మాణశైలిలో గల అనేక రూపాలు కలిగి ఉంది. ఖిల్వత్ ముబారక్ లో "ఆభరణాల కళారీతి" కలిగిన అందమైన వస్తువులెన్నో ఉన్నాయి. దీపాలంకరణల కొరకు అనేక షాన్డ్లియర్లు (ఝూమర్లు) ఉన్నాయి.

ఇమాం బారాకు ముందు భాగాన గల కొలనులో "అద్దపు ప్రతిబింబం" వుండేది. వీటికి చెందినా గదులు, అతిధుల విడిది కొరకు, ముఖ్యమైన పర్యాటకుల బస కొరకు ఉపయోగించేది వారు.

ఖిల్వత్ ముబారక్ సవరించు

 
ఖిల్వత్ ముబారక్.

చౌమహల్లా పేలస్ లో ఇది గుండెకాయ లాంటిది. హైదరాబాదీయులు దీన్ని గర్వకారణంగా భావిస్తారు. ఇది ఆసఫ్ జాహీ వంశపు అధికారిక ప్రదేశం. ఇందులోని ఉన్నత స్తంభాల విశాలమైన హాలు, ప్లాట్-ఫాం పాలరాయితో నిర్మితమయింది. దీనిపై తక్తే-నిషాన్ (సింహాసనం) ఉంది. నిజాంలు ఇక్కడ తమ దర్బారును (సభను) సమావేశాపరచేవారు. ఇవే గాక మతపరమైన ఉత్సవాలు ఇక్కడ జరిపేవారు. ఇందులో బెల్జియం నుండి తేబడిన 19 ఝూమర్లు లేదా షాన్డిలియర్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ. రాజదర్బారులోని ఈ ఝూమర్లు హాలును ప్రకాశవంతం చేసేవి.

క్లాక్ టవర్ సవరించు

చౌమహల్లా సౌధం ప్రధాన ద్వారంపై నిర్మింపబడిన గడియార స్తంభం ఈ క్లాక్ టవర్. దీనినే ముద్దుగా ఖిల్వత్ గడియారం అని అంటారు. ఈ స్తంభం పై గల గడియారం దాదాపు 250 సంవత్సరాలుగా "టిక్ టిక్" అంటూనే ఉంది. ఇది మెకానికల్ గడియారం కావున, గడియారపు రిపేరీకి చెందినా ఒక కుటుంబం వారు, ప్రతివారం దీనికి "కీ" ఇస్తూనే వుంటారు.

కౌన్సిల్ హాల్ సవరించు

ఈ కౌన్సిల్ హాలులో అమూల్యమైన అనేక గ్రంథాలు, ప్రతులు ఉన్నాయి. నిజాం తన ముఖ్య అనుచరులను, అధికారులను, అతిథులను ఇక్కడే సమావేశ పరుస్తాడు. నేడు ఇది ఒక తాత్కాలిక ఎక్జిబిషన్, ఇందులో చౌమహల్లా పేలస్ కు చెందినా అనేక విలువైన వస్తువులు, చారిత్రిక వస్తుసామాగ్రి, మొదలగునవి ప్రదర్శిమ్పబడుతాయి.

రోషన్ బంగ్లా సవరించు

ఆరవ నిజాం తన తల్లి రౌషన్ బేగం జ్ఞాపకార్థం నిర్మించినట్టు చెబుతారు. ప్రస్తుత నిజాం (ముకర్రం జాహ్, నిజాం వంశీకుడు), ఇతడి కుటుంబం కలసి చౌమహల్లా సౌధాన్ని సందర్శకులకొరకు, ప్రజల కొరకు జనవరి 2005 లో తెరచి ఉంచారు. సందర్శకుల కొరకు చౌమహల్లాను అలంకరిచడానికి, ప్రదర్శన ఏర్పాట్ల కొరకు దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టింది.

చిత్రమాలిక సవరించు

ఇవీ చూడండి సవరించు

బయటి లింకులు సవరించు

17°21′28″N 78°28′18″E / 17.357725°N 78.471705°E / 17.357725; 78.471705

మూలాలు సవరించు

  1. వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 1 May 2018.
  2. [1]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-08-30. Retrieved 2013-12-15.
  • Travel guide issued by Authority: The Administrator, H.E.H The Nizam's Private Estate