జె.పి.ఎల్. గ్విన్

జె.పి.ఎల్. గ్విన్ బ్రిటుషు ప్రభుత్వ పాలనలో భారతదేశంలో నియమించబడిన ఒకానిక సివిల్ సర్వీసు ఆఫీసరు. ఆయన బహుభాషాకోవిదుడు. ఈయనకి తెలుగు భాషమీద ఉన్న ఇష్టంతో తెలుగు వ్యాకరణాన్ని, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువును రచించిన తెలుగు బాషా ప్రియుడు.[1]

జె.పి.ఎల్. గ్విన్
John Peter Lucius Gwyn
జననంజాన్ పీటర్ లూయిస్ గ్విన్
22 జూన్, 1916
లండన్
మరణం1999 సెప్టెంబరు 14(1999-09-14) (వయసు 83)
ఇంగ్లాండు
మరణ కారణంఅనారోగ్యం
నివాస ప్రాంతంతార్నాక, హైదరాబాద్
వృత్తిసివిల్ సర్వెంట్, భాషాశాస్త్ర అధ్యాపకులు

జీవిత విశేషములు మార్చు

గ్విన్ 1916 జూన్ 22వ తేదీన లండన్ లో పుట్టారు.డబ్లిన్-ఐర్లాండు 1938లో ఎమ్.ఎ.(క్లాసిక్స్)లో హానర్స్ చెసి బంగారుపతకం పొందారు. ఈయన తండ్రిగారు 1905 నుంచి 1919 వరకు ఐ.సి.ఎస్ ఆఫీసరుగా పనిచేసారు[2]. యుద్ధకాలంలో లండన్ నౌకాదళ కార్యాలయంలో పనిచేసారు. గ్విన్ చదువు ముగిసాక 1939లో సబ్ కలక్టరుగా భారతదేశం వచ్చారు.మొదట బళ్ళారిలో ట్రయినింగ్ అయినారు. 1941లో బళ్ళారిలోను, 1943లో హోసూరు లోను పనిచేసారు. 1950వరకు తమిళ జిల్లాలలూనూ, మలయాళం మండలాలలోనూ పనిచేసి, తమిళం, మలయాళం నేర్చుకున్నారు.1950-52 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలక్టెరుగానూ, 1953-56 వరకూ విశాఖపట్నం జిల్లా కలక్టరుగాను వున్నారు. అప్పుడే ఒక మాసం శ్రీకాకుళం లోనూ, ఆరు మాసాలు గుంటూరులోనూ ఉన్నారు. 1956 నుంచి 1967 వరకు ట్రాన్స్‌పోర్టు కమీషనరు గాను, ఎడ్యుకేషన్ సెక్రటరీగాను, రెవెన్యూ బోర్డు మెంబరుగాను హైదరాబాదులో ఉన్నారు.1967 లో రిటైర్ అయి లండన్ వెళ్ళిపోయారు.

గ్విన్ ఐ.సి.ఎస్. పరీక్షకి తయారయే ముందు 1938 ప్రొబేషన్ కాలంలో ఆక్సుఫర్డు యూనివర్సిటీలో తెలుగు నేర్చుకున్నారు. అప్పుడు అది కష్టంగా అనిపించినా, తెలుగు భాష ఆయనని ఆకర్షించిందని చెప్పుకున్నారు. ఆక్సుఫర్డులో ఎన్.రామారావు అని ఒకాయన తనకి తెలుగు నేర్పారు. ఆక్సుఫర్డు యూనివర్సిటీలో హిందీ, బెంగాలీ, గుజరాత్ భాషలకు ప్రెఫసెర్లు ఉన్నారట, తెలుగుకి అప్పటికి లేరని కానీ మిత్రుని ద్వారా కాకతాళీయంగా గ్విన్ తెలుగు నేర్చుకున్నారుట. ఆయన ఆంధ్రదేశంలో రెవెన్యూ బోర్డు మెంబరుగా పనిచేస్తున్నప్పుడు, ఆంధ్రదేశంలో అడుగడున కనిపిస్తున్న ప్రకృతి వైవిధ్యం, కోస్తాలో అందమైన ప్రకృతి, చాలా చారిత్రిక ప్రదేశాలు ఆయన్ని బాగా ఆకర్షించాయి. డా.బెజవాడ గోపాలరెడ్డిగారితో ఊరూరు తిరిగి తెలుగు సీమ చూసారుట. నరసాపురంలో కొత్త సినిమాహాలు ప్రారంభించారు. మధురమైన తెలుగు భాష అంటే నాకు గౌరవం, ప్రీతి అని చెప్పుకొనేవారు. గ్రాంధిక భాషకన్నా వాడుక భాషమీదే మక్కువ. ఆయన విశాఖపట్నంలో ఉండేటప్పుడు భద్రిరాజు కృష్ణమూర్తి గారి వాడుకభాష మీద శ్రద్ధ కలిగినది.

ఆపాటికి తెలుగు భాషకి సరైన ఆంగ్ల వ్యాకరణం, నిఘంటువు లేవు అని ఇవి అవసరమని భావించి, ఆయన ఆపనికి పూనుకొని భద్రిరాజు గారితో కలసి ఎ గ్రామర్ ఆఫ్ మోడర్న్ తెలుగు ('A Grammar of Modern Telugu') 1985లో రచించారు. అటుపై ఎ తెలుగు-ఇంగ్లీష్ డిక్షనరీ(A Telugu-English Dictionary) అన్న నిఘంటువును 1991 రచించారు.

మూలములు మార్చు

  • 1982 భారతి మాస పత్రిఅక్. వ్యాసం జె.పి.ఎల్. గ్విన్.వ్యాసకర్త: పురిపండా అప్పలస్వామి.

మూలాలు మార్చు

  1. "Obituary: J. P. L. Gwynn". The Independent. 17 November 1999.
  2. Irish Times, Dublin, 30 November 1999