జొన్నలగడ్డ రాజగోపాలరావు

జొన్నలగడ్డ రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్త, తెలుగు రచయిత. ఆయన తన భార్య రాజ్యలక్ష్మీతో కలసి వసుంధర కలం పేరుతో తెలుగులో అసంఖ్యాక రచనలు చేశారు. వాటిలో అనేకం అవార్డులు పొందాయి. కొన్ని చలన చిత్రాలుగా రూపు దిద్దుకున్నాయి.

జీవిత విశేషాలు మార్చు

ఈయన తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం గ్రామంలో 1943 నవంబరు 15 న జన్మించారు. రాజమండ్రి కళాశాలలో బి.ఎస్.సి డిగ్రీని చేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇనార్గానిక్ రసాయన శాస్త్రం ప్రధానాంశంగా ఎం.ఎస్.సి డిగ్రీని చేసారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రసాయన పరిశోధనలు చేసి పి.హెచ్.డిని 1972 లో అందుకున్నారు.

ఉద్యోగ పర్వం మార్చు

పరిశోధనా రంగంలో తొలి ఉద్యోగం రీసెర్చి లాబొరేటరీ (భువనేశ్వర్) లో 1968 లో చేరి పదోన్నతులు పొందుతూ డిప్యూటీ డైరక్తరుగా 1992 లో పదవీ విరమణ చేసారు. 1964 నుంచి దేశ విదేశాలలో Homogeneous, Precipitation, Development of Catalysts, Waste utilization, Pollution control, Themas analysis, Preparation of Industrial inorganic chemicals, మొదలైన అంశాలమీద పరిశోధనలు నిర్వహించారు.

ఈయన బెర్లిన్ (జర్మనీ) లో టెక్నికల్ విశ్వవిద్యాలయంలో 19 నెలలు (1974-75), మాస్కో విశ్వవిద్యాలయంలో పరిశోధనా సంస్థలో 1988), కొంతకలం పరిశోధనలు సాగించారు. 70 కి పైగా పరిశోధనా పత్రాలను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సమర్పించారు. ఆయన "ఇ-తెలుగు పత్రిక" అభివృద్ధికి సహకారాన్నందించారు.[1]

అవార్డులు,సత్కారాలు మార్చు

ఈయన విద్యార్థి దశలో అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ వారి స్కాలర్‌షిప్ (1963-64) ను, పి.హెచ్.డి కాలంలో కేంద్రప్రభుత్వం స్కాలర్ సిప్ తో పాటు డిమానిస్ట్రేటర్ ఉద్యోగాన్ని కూడా అందుకునారు. జర్మన్ అకడమిక్ ఎక్సేంజి సర్విసు వారు అడ్వాన్సెడ్ రీసెర్చి అవార్డు ప్రదానం చేసారు. రాజగోపాలరావు ఆయన సతీమణి రామలక్ష్మితో కలసి మంగాదేవి బాలసాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.[2]

సభ్యత్వాలు మార్చు

  • ఇండియన్ సొసైటీ ఆఫ్ అనలటికల్ సైంటిస్ట్స్
  • ఇండియన్ థెర్మల్ అలాలసిస్ సొసైటీ
  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిస్ట్స్
  • ఇండియన్ కెమికల్ సొసైటీ
  • ద కెటాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్ ఇంజనీర్స్
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్

పరిశోధనలు మార్చు

రసాయన శాస్త్ర రంగంలో పరిశోధకులుగా, ప్రతిష్ఠాత్మక ప్రచురణలను వెలువరించారు. స్వతంత్ర పరిశోధనా రచయితగా, సహ రచయితగా మొత్తం 74 ప్రచురణలను వెలువరించారు. 1978 నుండి 2002 నాటి వరకు మొత్తం 10 పేటెంట్ లను తమ సహ శాస్త్రవేత్తలతో కలసి పొందారు. మాంగనీస్ సల్ఫేట్ తయారీ, కార్బయిడ్ లైమ్‌ స్కడ్జి నుంచి కాల్షియం కార్బొనేట్ తయారీ మొదలగు అంశాల మీద ఈయన పరిశోధనా విజయాలు జాతీయ స్థాయి ఖ్యాతిని పొందాయి. రీజనల్ రీసెర్చి లేబొరేటరీ నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత హైదరాబాదు, కాప్రా ప్రాంతంలో స్థిరపడ్డారు.[3]

కవిగా మార్చు

జొన్నలగడ్డ రాజగోపాలరావు - రామలక్ష్మి దంపతులు వసుంధర కలం పేరుతో వ్రాస్తున్న జంట రచయితలు. రాజగోపాలరావు రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరయ్యాడు. వసుంధరతో బాటు బాబి, కమల, సైరంధ్రి, రాజా, రాజకుమారి, శ్రీరామకమల్, యశస్వి, కైవల్య, మనోహర్ వారి కలం పేర్లు.

వీరు ఒక్క చందమామ లోనే వెయ్యికి పైగా కథలు వ్రాశారు. వాటిలో కథల ప్రయోజనం, అపకారికి ఉపకారం, మొదలైనవి సుప్రసిద్ధం. వీరి కథల్లో పిల్లలకు విలువైన సందేశం గానీ, అద్వితీయమైన చమత్కారం గానీ తప్పనిసరిగా ఉంటాయి. బొమ్మరిల్లులో నూరుకట్ల పిశాచం కథలు, మరికొన్ని ఇతర కథలు వ్రాయడంతోబాటు లోకజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు-జవాబులు, ఈ శతాబ్దపు చివరి దశాబ్దం లాంటి ఇతర శీర్షికలు కూడా చాలాకాలం నిర్వహించారు. రామలక్ష్మి ఆ పత్రికకు పేరులేని సంపాదకురాలిగా పనిచేసింది. ఆమె వసుంధరలో భాగస్వామిగానే కాకుండా విడిగా కూడా చాలా కథలు, నవలలు వ్రాసింది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. the voluntary labour and time so generously given by Dr Jonnalagadda Rajagopala Rao and Jonnalagadda Ramalakshmi (Vasundhara)
  2. Couple chosen for literary award
  3. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ ed.). విజయవాడ: శ్రీ వాసవ్య. 2011. p. 36.