జ్యోతి బసు

(జ్యోతిబసు నుండి దారిమార్పు చెందింది)

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతం చేసుకున్న జ్యోతి బసు (ఆంగ్లం: Jyoti Basu; Bengali: জ্যোতি বসু) జూలై 8, 1914న కోల్కతాలో జన్మించారు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి చెందిన జ్యోతి బసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినారు. అంతకు ముందు 1967-69 కాలంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సి.పి.ఐ (యం) పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయినాడు. 2000లో మఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన జ్యోతి బసు జనవరి 17, 2010న 96 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఆయన భారతదేశంలో అత్యధిక కాలం పని చేసిన ముఖ్యమంత్రులు జాబితాలో రెండో స్థానంలో, సీపీఎం తరపున దేశంలో అత్యధిక కలం పని చేసిన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జ్యోతి బసు 23 సంవత్సరంలు, 137 రోజులు పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశాడు.

జ్యోతి బసు
জ্যোতি বসু
జ్యోతి బసు

జ్యోతి బసు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
పదవీ కాలం
21 జూన్ 1977–6 నవంబర్ 2000
ముందు సిద్ధార్థ శంకర్ రే
తరువాత బుద్ధదేవ్ భట్టాచార్య

వ్యక్తిగత వివరాలు

జననం (1914-07-08)1914 జూలై 8
కోల్కతా
మరణం 2010 జనవరి 17(2010-01-17) (వయసు 95)
కోల్కతా
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
వెబ్‌సైటు http://www.jyotibasu.net/
జనవరి 17, 2010నాటికి మూలం Communist Party of India (Marxist)

బాల్యం మార్చు

జ్యోతి బసు 1914 జూలై 8న కోల్‌కత్తాలో బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి నిశికాంత్ బసు వైద్యుడిగా పనిచేసేవాడు. తల్లి హేమలతా బసు. స్థానికంగా కలకత్తా (ఇప్పటి కోల్‌కత) లోనే జ్యోతి బసు విద్యాభ్యాసం కొనసాగింది. ఇతని అసలుపేరు జ్యోతికిరణ్ బసు కాగా పాఠశాల దశలో ఉన్నప్పుడు తండ్రి జ్యోతి బసుగా పేరును తగ్గించాడు. ప్రెసిడెన్సీ కళాశాల జ్యోతి బసు తన డిగ్రీ పూర్తిచేశాడు. ఉన్నత చదువుల కోసం 1935లో ఇంగ్లాండు బయలుదేరాడు. ఇంగ్లాండులో న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించుదశలోనే గ్రేట్‌బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 1940లో న్యాయశాస్త్రవిద్య పూర్తిచేసుకొని మిడిల్ టెంపుల్ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందినాడు.[1] అదే సంవత్సరంలో భారతదేశానికి తిరిగివచ్చాడు. 1944లో ట్రేడ్ యూనియన్ ఉద్యమాలలో పాలుపంచుకొని ఆ తరువాత యూనియన్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు.

రాజకీయ జీవితం మార్చు

ఇంగ్లాండులో ఉన్నప్పుడే జ్యోతి బసు రాజకీయాలవైపు ఆకర్షితుడైనాడు. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ లండన్ పర్యటన సమయంలో సదస్సు నిర్వహణ బాధ్యతను జ్యోతి బసు చేపట్టినాడు. సుభాష్ చంద్రబోస్ పర్యటన సమయంలో కూడా జ్యోతి బసు ఏర్పాట్లు చేసాడు. స్వదేశానికి తిరిగివచ్చిన పిదప 1946లో తొలిసారిగా బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు. బి.సి.రాయ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాడు. 1967లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో అజయ్ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ప్రభుత్వంలో 1967 నుండి 1969 వరకు పశ్చిమబెంగాల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. 1972లో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో జ్యోతి బసు కూడా తన శాసనసభ స్థానంలో కూడా ఓడిపోయాడు. 1977 జూన్ 21 నుండి 2000 నవంబరు 6 వరకు నిరాటంకంగా జ్యోతి బసు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. దీనితో దేశంలో ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డును కూడా జ్యోతి బసు స్వంతంచేసుకున్నాడు.[2] సి.పి.ఐ (యం) పోలిట్ బ్యూరో నిర్ణయం వల్ల 1996లో దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. 2000లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి పదవిని నుండి వైదొలిగినాడు. 2010 జనవరి 17న కోల్‌కతలో మరణించాడు.

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Political biography : Jyoti Basu
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-01-19. Retrieved 2010-01-17.