మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ (మా తెనుగు తల్లికి మల్లె పూదండ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీని రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ పాటలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.

గుంటూరు జిల్లా కలెక్టరు కార్యాలయమునందుగల లుంబినీ వనములోని తెలుగు తల్లి విగ్రహము

చరిత్ర మార్చు

సుందరాచారి 'మా తెనుగు తల్లికి' గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించారు.[1] కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడాలన్న కోరికకు ఈ పాట సరిపోలేదు కాబట్టి ఆ సినిమాలో చేర్చలేదు.[2] టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా పాడిన ఈ పాటను, తను ప్రైవేటుగా గ్రామఫోన్ రికార్డులో హెచ్‌.యం.వి. సంస్థ ద్వారా విడుదల చేసిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఈ పాటపై హక్కులను సూర్యకుమారి సుందరాచారికి 116 రూపాయలిచ్చి కొనుక్కున్నది.[3] ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధదర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యంతో పాడించారు. లీడర్ సినిమాలో టంగుటూరి సూర్యకుమారి గారి పాటను కొత్త పాటతో కలిపి కథానాయకుడిపై చిత్రీకరణ చేశారు

గేయం మార్చు

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెలుగు॥
కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెలుగు॥
గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి ॥మా తెలుగు॥
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!

అమరావతి గుహల - అమరావతి నగర మార్చు

పురాణాలలో అమరావతిని ఇంద్రనగరంగా, సర్వసుఖ, సర్వభోగ, సర్వాంగ సుందర నగరంగా తెగ వర్ణిస్తూ ఉంటారు. కాళిదాసు మేఘసందేశంలో అలకాపురిని వర్ణించి మనసులని ఊరించాడు. మనకి గొప్ప చరిత్ర ఉన్న ముఖ్యపట్టణం అమరావతి. ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అన్నారు మా తెలుగుతల్లి కవి. తరువాత అక్కడ గుహలు లేవని, ‘అమరావతి నగర’ అని సవరించి పాడడం మొదలు పెట్టారు.[4]

బుల్లెట్‌ సినిమాలో కూడా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలో ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ అని ఉంది. అయితే టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులో ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అనే ఉంది.[5]

మూలాలు మార్చు

  1. "State anthem composed in Chittoor". The Hindu. 2011-03-24. Retrieved 2014-02-02.
  2. కె, లక్ష్మీరాజ్యం (2012-10-21). "పాటకు పట్టాభిషేకం". సూర్య. Retrieved 2014-02-02.[dead link]
  3. ఎం, భాను గోపాల్‌రాజు (2012-12-29). "కష్టాలనెదిరించి మల్లె పూదండ కూర్చిన శంకరంబాడి". సూర్య. Retrieved 2014-02-05.[dead link]
  4. "అరచేతిలో అమరావతి". Sakshi. 2015-04-03. Archived from the original on 2015-08-20. Retrieved 2018-01-25.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "...ఏ నిర్వచనానికి లొంగని వారు -". www.andhrajyothy.com. Archived from the original on 2015-08-06. Retrieved 2018-01-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు మార్చు