మొగల్తూరు కోట

(మొగల్తూరు సంస్థానం నుండి దారిమార్పు చెందింది)

మొగల్తూరు కోట, పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం, మొగల్తూరులో సా.శ.పూ. 1608 వ సంవత్సరంలో కర్నాటక రాష్ట్రంలో ధర్వాడ జిల్లా ఝల్లిగడ గ్రామానికి చెందిన గంగరాజు చే నిర్మించబడింది. ఇతడు సూర్యవంశానికి చెందిన వీరభాల్లాణుని వంశస్థుడు. వర్నాట దేశము (కర్నాటక) ను ఇతడు కొంతకాలం పాలించాడు. మొగల్తూరు సంస్థానం వారు ఇతడి వంశస్థులు. కౌండిన్య గోత్రానికి చెందిన మొగల్తూరు సంస్థానాధీశుల మతము విశిష్టద్వైతము. వీరు కృష్ణా జిల్లా కైకలూరు తాలూకాలోని కలిదిండి గ్రామంలో నివసించుట వలన ఆ గ్రామ నామము వీరి నూతన గృహనామమైనది. గంగరాజు వెనుక వంశజులలో 6 వ పురుషాంతము వారగు కలిదిండి రంగరాజు మొగల్తూరులో టంకశాల వేయించి తాలూకాలో తొమ్మిది కోటలు కట్టించాడు. అప్పటినుండి మొగల్తూరు రాచపట్టుగా కీర్తి గడించింది. కలిదిండి ప్రభువుల సంస్థానంగా ప్రసిద్ధికెక్కింది.

గుంటుపల్లి (కామవరపుకోట) వద్ద ఉన్న బౌద్ధ స్తూపాలు, మొగల్తూరులో చారిత్రికమైన మట్టి కోట విష్ణుకుండినుల కాలానికి చెందినవి

సంస్థానం తూర్పున వశిష్ట గోదావరి, పడమర కాళీపట్టణం వద్ద ఉన్న ఉప్పుటేరు, దక్షిణాన బంగాళా ఖాతం సరిహద్దులుగా కలిగి సుమారు 300 గ్రామాలతో విరాజిల్లింది. ఈ సంస్థాన విస్తీర్ణం 900 చదరపు మైళ్ళు అని తెల్లదొరలు భావించారు. క్రీస్తు శకం 1733 లో రుస్తుం ఖాన్ మొగల్తూరు సంస్థానాన్ని ఆక్రమించిన తర్వాత 1750 వరకూ మహమ్మదీయుల చేతుల్లోనే ఉండిపోయింది.

కోట విశేషాలు మార్చు

మొగల్తూరు కోట మట్టితో నిర్మించింది కావడంతో కాలక్రమేణా కూలిపోయింది. నేడు చిన్న లక్క మేడ మాత్రమే మిగిలి ఉంది.ఈ కోట 25 ఎకరాల స్థలంలో ఉంది. దీని చుట్టూ సుమారు 20 అడుగుల మందం రెండు తాడిచెట్ల ఎత్తు గల కోటగోడను మట్టితో నిర్మించారు. వీటికి రెండువైపులా దుర్భేద్యంగా కాల్చిన ఇటుకలతో గోడలు నిర్మించారు.ఈ కోటలోని ప్రత్యేక ఆకర్షణ "లక్షా గృహం" అనగా లక్కమేడ. ఇది ఆనాడు ముఖ్య రాజదర్బారుగా ఉపయోగించేవారు. ఈ మేడలోని గోడల పైభాగంలో చెక్కిన లతలు, పూలు, చిత్రకళా చాతుర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.దీనికి పడమరదిశగా ఓ విశ్రాంతి మందిరం ఉంది. దీనిని మహారాజు ఉపయోగించేవారట. ఇందులోకి అడుగుపెడితే ఈనాటి ఎ.సి.గదిలాగా చల్లగా ఉంటుంది. ఈ మేడకు దక్షిణం వైపు గజశాలలు, అశ్వశాలలు శిథిలావస్థలో కనిపిస్తాయి. కోటగోడపై 13 బురుజులు నిలిపారు. అయితే ఒక బురుజు మాత్రమే ఉండే కోటగోడ చూడ్డానికి వీలవుతుంది.

సంస్థానాధీశులు మార్చు

కేతకీపుర (మొగల్తూరు తాలూకా) సంస్థానాధీశ్వరులైన రాజా కలిదిండి రామరాజు బహదూర్ రచించిన వరసావిత్రీ చరితం [1] ప్రకారం ఈ క్రింది ఇవ్వబడినవి మొగల్తూరు సంస్థానాధీశ్వరుల పేర్లు:

  • కలిదిండి కుమార దైవప్రసాద లక్ష్మీ నరసింహరాజా బహదూర్
  • కలిదిండి దేవిప్రసాద వరహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీకాంత రాజా బహదూర్
  • కలిదిండి కుమార సత్యనారాయణ రాజా బహదూర్
  • కలిదిండి కుమార తిరుపతిరాజా బహదూర్
  • కలిదిండి కుమార లక్ష్మీ నరసింహా రాజా బహదూర కలిదిండి కుమార రంగరాజా బహదూర్
  • కలిదిండి కుమార వెంకట సూర్యనారాయణ రాజా బహదూర్
  • కలిదిండి కుమార చిన సత్యనారాయణ రాజా బహదూర్

మూలాలు మార్చు

  1. http://mogaltur.pradeep1.com Archived 2010-03-18 at the Wayback Machine మొగల్తూరు చరిత్ర

వెలుపలి లంకెలు మార్చు

  • ఆంధ్ర క్షత్రియులు
  • క్షత్రియులు