వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 04వ వారం

శృంగేరి, కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఈ గ్రామములోనే ఉన్న శృంగేరి శంకర మఠమును దక్షిణామ్నాయ మఠం అని అంటారు. ఇతిహాసం ప్రకారం శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో, శంకరుడు ఇక్కడకు వచ్చినప్పుడు ఒక కప్ప ప్రసవిస్తున్నప్పుడు సర్పము నీడ కలిపించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ఇంతే కాకుందా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఊదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చూసాక శంకరులు ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపించాడు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరిలో, కంచిలో, బదరిలో ,ద్వారకలో మఠాలను స్థాపించాడు.


2001 జనాభా లెక్కల ప్రకారం శృంగేరి జనాభా 4253 (52 శాతం పురుషులు 48 శాతం స్త్రీలు). శృంగేరి అక్షరాస్యత 83 శాతము. ఇది జాతీయ సగటు అక్షరాస్యత కంటే (59.5%) ఎక్కువ. ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా 8 శాతం.


శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉన్నది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. తుంగానదిలో అసంఖ్యాకంగా చేపలు నది ఒడ్డుకు వస్తుంటాయి, భక్తులు చేపలకు అటుకులు మున్నగునవి అహారంగా వేస్తారు. తుంగానది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అందువలన ఇక్కడ ఈత కొట్టవద్దని హెచ్చరికలు ఉంటాయి. మంగళూరు నుండి తరచు బస్సు సౌకర్యం ఉంది. షిమోగా నుండి కూడా తరచు బస్సు సౌకర్యం ఉంది. శృంగేరి నుండి ఉడిపి కి బస్సు ఆగుంబె అనే ఊరి మీదుగా మలనాడు పర్వతశ్రేణుల మధ్య నుండి వెళ్తుంది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి