వెంట్రప్రగడ రామారావు

(వి.రామారావు నుండి దారిమార్పు చెందింది)

వెంట్రప్రగడ రామారావు (డిసెంబరు 12 1935 - జనవరి 17 2016) సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా 2002 నుండి 2005 వరకు పనిచేసారు.[1] హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు.[2]

వెంట్రప్రగడ రామారావు
వ్యక్తిగత వివరాలు
జననం(1935-12-12)1935 డిసెంబరు 12
మచిలీపట్నం, కృష్ణా జిల్లా
మరణం2016 జనవరి 17(2016-01-17) (వయసు 80)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామివసంత కుమారి
సంతానంవి. శ్రీనివాస్
నివాసంభజన్ హిల్స్, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్

ప్రారంభ జీవితం మార్చు

రామారావు, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో, డిసెంబరు 12 1935 న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి అప్పారావు హోమియో వైద్యుడు కావడంతో కొంత కాలం పాటు మండవల్లిలో ఉన్నారు. మచిలీపట్నంలో కళాశాల విద్య పూర్తయ్యాక, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్య పూర్తిచేశారు. కొద్దికాలం పాటు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆయన స్వస్థలం మచిలీపట్నం అయినా హైదరాబాద్ బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు.

రాజకీయ జీవితం మార్చు

21 ఏళ్ల ప్రాయంలో 1956లో రామారావు జనసంఘ్ లో సభ్యునిగా చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జనసంఘ్ విస్తరణకు విశేషకృషి చేశారు. అనేక సంవత్సరాలపాటు భారతీయ జనసంఘ్ కు నేషనల్ ఎక్జిక్యూటివ్ సభ్యునిగా తమ సేవలనందించారు. తరువాత భారతీయ జనతా పార్టీ లోనికి చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా రెండు సార్లు (1993-2001) పనిచేసారు. ఆయన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 2002 నుండి 2007 వరకు ఉన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా కూడా సేవలనందించారు.

శాసన మండలి సభ్యులుగా మార్చు

ఆయన హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 1966లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై వరుసగా 1966, 1972, 1978, 1984 లలో తిరిగి ఎన్నికై, 19 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యుడిగా సేవలందించారు. 1984లో అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసే వరకు రామారావు బీజేపీ పక్ష నేతగా శాసనమండలిలో బాధ్యతలు నిర్వర్తించారు. పలు లెజిస్లేటివ్‌ కమిటీలలో సభ్యునిగా కొనసాగారు. ఆయన పార్టీ ఫ్లోర్ లీడరుగా కూడా వ్యవహరించారు. 1993లో ఆంధ్రప్రదేశ్ భాజపా పార్టీ పగ్గాలు చేపట్టి, 1997 వరకు ఆ పదవిలో కొనసాగారు. అనంతర కాలంలో పార్టీ జాతీయ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు. 2002లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో భాజపా భాగస్వామిగా ఉన్న కాలాల్లో రామారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, ఉస్మానియా విశ్వవిద్యాలయపు సెనేట్‌ బాధ్యతలు నిర్వహించారు.

సిక్కిం గవర్నరుగా మార్చు

వాజపేయి ప్రభుత్వ హయాంలో, ఆయన ఆగస్టు 2002 న సిక్కిం రాష్ట్ర గవర్నరుగా భారత రాష్ట్రపతిచే నియమింపబడ్డారు. 2002- 2005 మధ్య కాలంలో సిక్కింకు గవర్నర్గా పనిచేసిన ఆయన. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది తెలుగువారిలో ఒకరు.

మరణం మార్చు

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు జనవరి 17 2016 ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆసుపత్రిలో మరణించారు.[3]

మూలాలు మార్చు

  1. Hindu, The. "The Hindu Article".
  2. సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత January 17, 2016 16:44 (IST)
  3. "Sikkim former Governor Rama Rao died". TelanganaNewspaper.