వేంపెంట ఉద్యమం కర్నూలు జిల్లా పాములపాడు మండలం వేంపెంట గ్రామం లో ప్రభుత్వం తలపెట్టిన జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్థులు చేసిన సుదీర్ఘ ఉద్యమం. ప్రజాస్వామ్య పద్ధతిలో గాంథేయ మార్గంలో గ్రామస్థులు 1567 రోజుల సుదీర్ఘ దీక్షను చేపట్టారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పవర్ ప్లాంటు అనుమతులను రద్దుచేసింది[1].

విశేషాలు మార్చు

1998లో ఎనిమిది మందిని సజీవ దహనం చేసినపుడు[2],[3] 2004లో ఎనిమిది మందిని ఊచకోత కోసినపుడు, వేపెంట ప్రధానంగా వర్తలలోకి ఎక్కింది. ఈ ఊరు నక్సల్స్ ఉద్యమానికి పురిటిగడ్డ. ఈ గ్రామంలో 7వేల జనాభా, 1500 ఇళ్ళు ఉన్నాయి. ఈ గ్రామానికి ఒకవైపు నల్లమల అడవులు మరోవైపు సీమ ప్రాంతానికి నీరందించే కె.సి.కెనాల్ ఉన్నాయి. గ్రామంలో 5800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే అందులో 1300 ఎకరాల రిజర్వు ఫారెస్టు ఉంది. మిగిలిన భూమికి కె.సి. కెనాల్ నుండి సాగునీరు అందుతుంది. ఊరి పక్కనే ఉన్న శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి మోటర్లతో పంటలకు నీరుపెట్టుకుంటారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుండి ఈ గ్రామంలో కమ్యూనిస్టుల ప్రభావం ఉంది. ఇళ్లస్థలాల కోసం, భూము కోసం గ్రామంలో అనేక ఉద్యమాలు జరిగాయి. 1990, 1994-95 లలో గ్రామస్థులు ప్రభుత్వం నుండి భూములు పొందారు. రైతుకూలీ సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో భూ ఉద్యమాలు ఈ ప్రాంతంలో జరిగాయి.

వేంపెంటలో ఒక దశలో దళిత, అగ్రవర్ణాలకు మధ్య విభేదాలు ఏర్పడి అది కాస్త దమనకాండకు, ఊచకోతకు దారితీసింది. 1998లో 9 మందిని సజీవ దహనం చేసారు. అందులో ఐదుగురు దళితులు, నలుగురు బీ.సీలు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది[2]. ఈ ఘటన తరువాత గ్రామంలో 173 మందిని బాధితులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ప్రభుత్వం అందజేసింది. వారందరికీ ఇళ్ళు కట్టి ఇచ్చింది ప్రభుత్వం. ఈ ఘటనకు ప్రతీకారంగా 2004లో మావోయిస్టులు ఎనిమిది మందిన నల్లకాల్వ వద్ద ఊచకోత కోసారు. ఈ రెండు ఘటనలతో వేంపెంట సంచలనంగా మారింది.[4] సారా ఉద్యమం కూడాఅ వేంపెంట లో తీవ్ర స్థాయిలో జరిగింది.

పవర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం మార్చు

1999లో వేంపెంటకు కొన్నిమీటర్ల దూరంలో మూడు పవర్ ప్లాంట్లకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. అప్పట్లో ఆ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉండటంతో పవర్ ప్లాంటు ఏర్పాటు చేయలేదు. వేంపెంట ప్రక్కనే ఉన్న నిప్పుల వాగు మీదుగా 2.4 మెగావాట్ల సామర్థ్యం చొప్పున మూడు పవర్ ప్లాంట్ లను అనుమతి నిస్తూ 2003లో జీ.వో నెం.48,49,50 లను జారీ చేసింది ప్రభుత్వం. 2011లో పవర్ ప్లాంటు నిర్మాణానికి సర్వే మొదలు కావటంతో గ్రాంస్థులలో ఆందోళన మొదలైంది. పవర్ ప్లాంటు నిర్మాణం చేపడుతున్న స్థలం గ్రామానికి ప్రక్కనే ఉండటంతో నిర్మాణ సమయంలో ప్రేలుళ్లకు ఇళ్ళు కూలిపోయాయనీ, ప్రేలుడు సమయంలో వెలుపడే రసాయన పదార్థాలు అనారోగ్యానికి దారితీస్తాయని, ఆందోళన మొదలైంది. పవర్ ప్లాంటు కోసం కాలువ లోతుగా త్రవ్వితే భూగర్భ జలాలు అడుగంటి పోయాయని దాని మూలంగా పంటలు పండవని భావించిన గ్రాంస్థులు 2011 ఆగస్టులో భూమి పూజ చేసేందుకు వెళ్ళిన వారిని అడ్డుకున్నారు[1]. గ్రామాలలో పరిశ్రమ స్థాపించాలంటే గ్రామ పంచాయితీ నిరభ్యంతర పత్రం ఉండాలి. పంచాయితీ తీర్మానం చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. ఇవేమీ లేకుండానే పవర్ ప్లాంటు పని మొదలైంది. ఊరిని వల్లకాడుగా మార్చేపవర్ ప్లాంటు వద్దంటూ గ్రామస్థులు ఆందోళను దిగారు. హైకోర్టు న్యాయవాదులను ఆశ్రయించారు. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు పిర్యాదు చేసారు. జాతీయ ఎస్.సి, ఎస్.టి కమీషన్ కు పిర్యాదు చేసారు. నీటిపారుదల, కాలుష్య, అటవీ నివారణ మండలి వంటి అనేక ప్రభుత్వ శాఖలకు పిర్యాదు చేసారు. జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామస్థుల పిర్యాదుతో ఎస్.సి.,ఎస్.టి కమీషన్ విచారణ చేపట్టింది. బాధిత గ్రామస్థులు డిల్లీకి పోయి ఎస్.సి.,ఎస్.టి కమీషన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.[5] ఏళ్లతరబడి ఈ ఉద్యమం కొనసాగింది. గ్రామం లోని మహిళలు ఊరి బయటి ఉన్న చెట్ల క్రింద కూర్చుని దీక్ష చేపట్టారు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు అకృత్యాలను భరించారు. అనేక కష్టాలను భరించారు. 1567 రోజులు నిరాహార దీక్ష చేసారు. చివరకు విజయం సాధించారు.

ఈ గ్రామంలో ఉద్యమం కొనసాగుతుండగానే 2015లో పోలీసు బందోబస్తుతో పనులు ప్రారంభించారు. గ్రామస్థులు భయపడినట్టుగానే ప్రేలుళ్లకు ఇళ్ళు బీటలు వారాయి. దీనితో గ్రామస్థులలో తిరుగుబాటుమొదలైంది .పోలీసులను ఎదిరించారు. పవర్ ప్లాంటు నిర్మాణం కోసం వచ్చే సిబ్బందిని కర్రలతో తరిమి కొట్టారు. 2015 మార్చి 15న ఈ గ్రామంలో దీక్ష చేపట్టారు[6]. గ్రామ నిధి నుండి ఉద్యమానికి అవసరమైన ఖర్చు చేసారు. కొన్నాళ్ళు గ్రామమంతా ఐక్యంగా ఉన్నా తరువాత కొంతమంది ఉద్యమం నుండి తప్పుకున్నారు. ఐనాసరే వారి పట్టు సడలలేదు. ఏడాది గడిచినా దీక్ష కొనసాగించారు. ఇళ్ళు గడవాలంటే మగవారు పనులకు వెళ్లాల్సి వచ్చింది. మహిళలో నిరంతరం దీక్షలో పాల్గొన్నారు. ప్రతీరోజూ దీక్షలో పాల్గొన్నవారికి దండలు వేయడానికి, సాయంత్రం నిమ్మరసం ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి. షామియానాలు కూడా లేవు. చెట్ల క్రింద బండరాళ్లపై అట్టలు పట్టుకుని కూర్చున్నారు. ప్రక్కన ఉన్న పిట్టగోడపై దీక్ష ఎన్నిరోజులకు చేరిందో రాస్తూ వచ్చారు. ఈ దీక్షను భగ్నం చేసేందుకు ఎన్నో విధాల ప్రయత్నాలు జగిగాయి. ఉద్యమానికి నాయకత్వం వహించే వారికి డబ్బు ఆశ కూడా చూపించారు. కానీ వారు ప్రలోభాలకు లోను కాకుండా దీక్షను కొనసాగించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి పర్యటనకు రావడంతో అతనికి వినతి పత్రాన్నిచ్చారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చినపుడు వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వస్తే అనుమతులు రద్దు చేస్తామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చాడు. రాహుల్ గాంధీ పుట్టపర్తికి వస్తే అతనిని కూడా కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. మేథాపాట్కర్ విజయవాడకు వస్తే ఆమెను కలసి వినతి పత్రాన్నిచ్చారు.[7] ఉద్యమానికి అవసరమైమ ఖర్చు సుమారు 20 లక్షల రూపాయలు గ్రామస్థులు చందాలు వేసుకుని భరించారు.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కలెక్టర్ల సమావేశంలో కర్నూలు కలెక్టరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే జగన్ స్పందించి ఆ అనుమతులు రద్దుసేస్తున్నట్లు ప్రకటించారు.[8] కలెక్టరు వీరపాండ్యన్ కు దీక్ష వద్దకు పంపి దీక్ష విరమింపజేయవలసినదిగా కోరాడు. అప్పటికి దీక్ష 1567 రోజులకు చేరింది. 1568వ రోజు కలెక్టరు ఆ ప్రాంతాన్ని సందర్శించి దీక్ష విరమిచాల్సినదిగా కోరాడు. జీ.వో జారీ చేసేంతవరకు దీక్ష విరమించేది లేదని గ్రామస్థులు చెప్పడంతో వారికి జీ.వో గూర్చి హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు[9].

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "11 మంది మహిళలు.. తొమ్మిదేళ్ల పోరాటం.. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న జగన్!". Samayam Telugu. 2019-06-29. Retrieved 2019-07-12.
  2. 2.0 2.1 Avenue, Human Rights Watch | 350 Fifth; York, 34th Floor | New; t 1.212.290.4700, NY 10118-3299 USA | (1998-07-28). "HRW Letter: Killings of Dalits in Andhra Pradesh (India)". Human Rights Watch. Retrieved 2019-07-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "The Hindu : Andhra Pradesh / Kurnool News : Vempenta villagers shell-shocked". www.thehindu.com. Retrieved 2019-07-12.
  4. "Naxals kill eight villagers". Naxal Terror Watch. 2005-03-02. Retrieved 2019-07-12.
  5. hansindia (2013-07-01). "Vempenta villagers oppose mini power plant". www.thehansindia.com. Retrieved 2019-07-12.
  6. "'వేంపెంట' దీక్షలుఏ103 రోజులు | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2019-07-12. Retrieved 2019-07-12.
  7. Eenadu. "Latest Telugu News, Headlines - EENADU". www.eenadu.net. Archived from the original on 2019-07-12. Retrieved 2019-07-12.
  8. "Ap Cm Ys Jagan Orders To Stop Vempenta Hydroelectric Project In Kurnool". Telugu News, Latest Telugu News, Breaking News in Telugu. 2019-06-29. Retrieved 2019-07-12.[permanent dead link]
  9. "త్వరలో వేంపెంట పవర్‌ ప్లాంట్‌ రద్దు | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2019-07-12. Retrieved 2019-07-12.

బయటి లంకెలు మార్చు