కర్నూలు జిల్లా

ఆంధ్రప్రదేశ్ జిల్లా


కర్నూలు జిల్లా దక్షిణ భారతదేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జిల్లా కేంద్రం కర్నూలు. 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో కలిపారు.

కర్నూలు జిల్లా
1618 లో హంద్రీ నది ఒడ్డున నిర్మించిన కొండారెడ్డి బురుజు
1618 లో హంద్రీ నది ఒడ్డున నిర్మించిన కొండారెడ్డి బురుజు, కర్నూలు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంరాయలసీమ
ప్రధాన కేంద్రంకర్నూలు
Area
 • Total7,980 km2 (3,080 sq mi)
Population
 (2011)[1]
 • Total22,71,700
 • Density280/km2 (740/sq mi)
భాషలు
 • ఆధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 0( )
లోక్‌సభ నియోజక వర్గంకర్నూలు లోక్‌సభ నియోజకవర్గం

తొలి ఆంధ్ర రాష్ట్రానికి జిల్లా లోని కర్నూలు ముఖ్యపట్టణంగా ఉంది. ఉమ్మడి జిల్లాలో పర్యాటక ఆకర్షణలు చాలావరకు నంద్యాల జిల్లాలో భాగమైనవి.

ఉమ్మడి కర్నూలు జిల్లా చరిత్ర మార్చు

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

1565 లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687 లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. గియాసుద్దీన్ జయించిన ఈ ప్రాంతానికి ఔరంగజేబు మొఘల్ సేనానుల్లో ఒకడైన దావూద్ ఖాన్‌కు జాగీరుగా యిచ్చారు. 1733 లో అతని మరణానంతరం పాలన చేపట్టిన హిమాయత్ ఖాన్ మొదటి కర్నూలు నవాబుగా పాలకవంశాన్ని ప్రారంభించారు. ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741 లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.

1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799 లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800 లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.

1733 నుంచి 1838 వరకూ కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్‌ నవాబుల యొక్క రాజ్యభాగంగా ఉండేది. ఈ నవాబులు మొదట మొఘల్ సామ్రాజ్యానికి, ఆపైన క్రమంగా మైసూరు సామ్రాజ్యం, హైదరాబాద్ సామ్రాజ్యం, ఈస్టిండియా కంపెనీలకు సామంతునిగా వ్యవహరించారు. 1838 లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది.[2] నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉంది. 1947 లో భారత దేశ స్వాతంత్ర్యానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953 లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956 లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.

1830 లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్రలో కర్నూలు జిల్లా గురించి నాటి విశేషాలు నమోదు చేశారు. అప్పట్లో కర్నూలు జిల్లాలో అడుగుపెట్టింది మొదలు ఆవులకు పాలు తీయడం చూడలేదన్నారు. ఆయన ఈ విషయాన్ని గురించి ఇట్లా వ్రాసుకున్నారు: కడప విడిచిన తర్వాత ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని యితర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టు చున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పశువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరు సీమనుంచి తెచ్చేవారి వద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికేగాని అచ్చటి దున్నలు ఆ భూమిని నిగ్గి దున్ననేరవు. తడవకు 10 నుంచి 20 వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. సాధారణంగా ఆవులను పాల కోసమో లేక, ఎద్దుల కోసమో పెంచుతూండే అలవాటు వాడుక. ఇది చాలా విచిత్రమైన సంగతిగా చెప్పుకోవాలి.[3]

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 మండలాలు వుండేవి.[4] 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లాలో కొంత భాగాన్ని కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో కలిపారు.[1][5]

భౌగోళిక స్వరూపం మార్చు

2022 జిల్లా పునర్వ్యవస్థీకరణ తర్వాత జిల్లా విస్తీర్ణం 7,980 చ.కి.మీ.[1]

ఖనిజములు మార్చు

ఉమ్మడి జిల్లాలో నాపరాయి, సున్నపురాయి, ముగ్గురాయి, రంగురాయి, సీసము నిల్వలున్నాయి. పూర్వము రత్నాలకోట (ప్రస్తుత రామళ్ళకోట), జొన్నగిరి గ్రామాలలో రత్నములు లభ్యమయ్యేవి.[6][7]

జనాభా లెక్కలు మార్చు

2011 జనగణన ఆధారంగా, 2022 లో ఏర్పాటైన నూతన జిల్లా జనాభా 22.717 లక్షలు.[1] 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లా జనాభా: 24,07,299, స్త్రీ పురుషుల నిష్పత్తి: 983:1000, అక్షరాస్యత శాతం, 28.42.[8]

డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు మార్చు

నూతన కర్నూలు జిల్లాను మూడు రెవెన్యూ డివిజన్లుగా, 26 మండలాలుగా విభజించారు. కర్నూలు మండలాన్ని కర్నూలు (పట్టణ), కర్నూలు (గ్రామీణ) మండలాలుగా విడదీశారు. [1]

మండలాలు మార్చు

కర్నూలు జిల్లా మండలాల పటం (Overpass-turbo)


నగరాలు, పట్టణాలు మార్చు

నగరం: కర్నూలు పట్టణాలు: ఆదోని, ఎమ్మిగనూరు

రాజకీయ విభాగాలు మార్చు

లోక్‌సభనియోజకవర్గం: కర్నూలు

శాసనసభ నియోజకవర్గాలు మార్చు

  1. ఆదోని
  2. ఆలూరు
  3. ఎమ్మిగనూరు
  4. కర్నూలు
  5. కోడుమూరు (SC)
  6. పత్తికొండ
  7. పాణ్యం (పాక్షికం) కొంత భాగం నంద్యాల జిల్లాలో గలదు.
  8. మంత్రాలయం

రవాణా వ్వవస్థ మార్చు

1985 నాటికి ఉమ్మడి జిల్లాలో 2209 కి.మీ. ప్రభుత్వ రహదార్లు, 2146 కి.మీ. జిల్లా పరిషత్ రహదారులు, 1883 కి.మీ. సమితి రోడ్లు ఉన్నాయి.

విద్యాసంస్థలు మార్చు

ఆర్ధిక స్థితి గతులు మార్చు

ఉమ్మడి జిల్లాలో ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి. కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు ప్రాజెక్టు, అవుకు, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం జలాశయాల కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది.

పరిశ్రమలు మార్చు

ఉమ్మడి జిల్లాలో టిజివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, తాడిపత్రి దగ్గరి ఎల్ అండ్ టి (L&T) ఉన్నాయి.

పర్యాటక ఆకర్షణలు మార్చు

 
కర్నూలులోని చారిత్రక కొండారెడ్డి బురుజు
 
నవాబ్ అబ్దుల్ వహాబ్ ఖాన్ సమాధి గోల్ గుమ్మజ్.
  • అయ్యప్ప స్వామి ఆలయము,కర్నూలు
  • కొండారెడ్డి బురుజు కర్నూలు [9]
  • జగన్నాథ గుట్ట ఆలయము,కర్నూలు
  • రేవనూరు హుస్సేన్ స్వామి దర్గ

చిత్రమాలిక మార్చు

ప్రముఖవ్యక్తులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "AP: కొత్త జిల్లాల స్వరూపమిదే.. పెద్ద జిల్లా ఏదంటే?". Sakshi. 2022-04-03. Retrieved 2022-04-03.
  2. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  3. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  4. "కర్నూలు జిల్లా తాలూకాల వివరాలు". Archived from the original on 2007-09-27.
  5. "కొత్త జిల్లా తాజా స్వరూపం". Eenadu.net. 31 March 2022. Retrieved 31 March 2022.
  6. సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము, రెండవ భాగము, 1960 ప్రచురణ, పేజీ సంఖ్య 545
  7. సురవరం, ప్రతాపరెడ్డి (1949). "  6 వ ప్రకరణము".   ఆంధ్రుల సాంఘిక చరిత్ర. వికీసోర్స్.   337. 
  8. ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1985
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-23. Retrieved 2007-07-26.

బయటి లింకులు మార్చు