బాల్య వివాహాలను నిషేధిస్తూ భారత ప్రభుత్వం చేసిన చట్టమే, శారదా చట్టం. 1927 లో హర్‌బిలాస్ శార్‌దా (Harbilas Sarda) అనే ప్రైవేటు సభ్యుడు అప్పటి కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు తదుపరి చట్టంగా రూపొందింది. ఆయన పేరు మీద దీనికి 'శారదా చట్టం' అనే పేరు వచ్చింది.

నేపథ్యం మార్చు

పూర్వం భారత్‌లో బాల్య వివాహాలు విస్తృతంగా జరిగేవి. ఊహ తెలియని పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు జరిగేవి. 1921 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో 12 'నెలల' లోపు వయసు గల పెళ్ళయిన ఆడపిల్లలు 600 మంది ఉన్నారని తేలింది. ఈ వార్తకు నిర్ఘాంతపోయిన మహాత్మా గాంధీ దీన్ని నిషేధించే విధంగా ఒక బిల్లును ప్రవేశపెట్టాలని అప్పటి కేంద్ర శాసనసభ సభ్యుడైన హర్‌బిలాస్ శార్దా ను కోరాడు[1]. (అప్పటికే కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తలెందరో బాల్య వివాహాల నిషేధానికై కృషి చేస్తూ ఉన్నారు) ఆ విధంగా గాంధీ సూచనపై 1927 ఫిబ్రవరి 1 న కేంద్ర శాసనసభలో బాల్య వివాహాల నిరోధ చట్టం ప్రవేశపెట్టబడింది. అదే శారదా చట్టం. 1929 సెప్టెంబర్ 19 న ఈ బిల్లు సభ ఆమోదం పొంది, చట్టమయింది. 1930 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది.

చట్టం వివరాలు మార్చు

ఈ చట్టం ప్రకారం బాలురకు 18 ఏళ్ళు, బాలికలకు 14 ఏళ్ళు పెళ్ళి వయసుగా నిశ్చయించింది. అయితే బాల్య వివాహాలను నిషేధించలేదు. ఇది కేవలం 'నిరోధ' చట్టం మాత్రమే. ఆ తరువాత ఈ చట్టాన్ని మూడు సార్లు సవరించారు. 1949 లో బాలికల వయసు 15 ఏళ్ళుగాను, 1956 లో 16 ఏళ్ళుగాను సవరించారు. చివరగా 1978 లో బాలుర వయసు 21 ఏళ్ళు గాను, బాలికల వయసు 18 ఏళ్ళు గాను సవరించారు.

చట్టం పరిణామాలు మార్చు

ఈ చట్టం కేవలం నిరోధకమే గాని బాల్య వివాహాలు జరిపించే వారిని శిక్షించే వసతులు ఇందులో లేవు. అందుచేత బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టలేక పోయింది. శారదా చట్టం అనేక విమర్శలు ఎదుర్కొంది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో జరిగిన ఒక సదస్సుకు యావద్భారతం నుంచి 500 మందికి పైగా పండితులు హాజరయ్యారు. వల్లూరి సూర్యనారాయణరావు (1866-1937) ఆ సదస్సు తీర్మానాలపై అప్పట్లో సంధించిన విమర్శనాస్త్రం 2006 ఫిబ్రవరి 25న ఆంధ్రజ్యోతిలో తిరిగి ప్రచురితమైంది.

శారదా చట్టానికి యానానికి గల సంబంధం మార్చు

ఈ శారదా చట్టం యానాం ఫ్రెంచి వారిపాలనలో ఉండటం వలన ఇక్కడ వర్తించేది కాదు. బాల్యవివాహలనే సామాజిక రుగ్మత ను కొనసాగించటానికి యానాం ఆ సమయంలో ఒక కల్ప తరువు గా కనిపించింది. అందుకనే సమీప ప్రాంతాలనుండి బాల్య వివాహాలు జరుపుకోదలచిన వారు యానాం వచ్చి ఇక్కడ వివాహాలు జరిపించుకొని వెళ్లి పోయే వారు. ఫ్రెంచి వారికి కూడా ఈ దురాచారం పట్ల విముఖత ఉన్నా వారి చట్టాలలో మార్పు లేని కారణంగా మిన్నకుండిపోవలసి వచ్చింది.

మంచి ముహుర్తములు ఉన్న రోజులలో రోజుకి 100 కు పైగా బాల్య వివాహాలు జరిగేవి అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విధంగా చిన్న పిల్లలను వృధులకిచ్చి వివాహంచేయటమనే దురాచారాన్ని ఖందిస్తూ, ఈ దురాచారాన్ని రూపుమాపవలసినదిగా ఫ్రెంచి ప్రభుత్వాన్ని, యానానికి చెందిన తోట నరశింహ మూర్తి అనే ఒక రిటైర్డ్ హెడ్ మాస్టరు కోరటం జరిగింది. (రిఫరెంసు.: పుస్తకం ది తెలుగూస్ ఆఫ్ యానం అండ్ మచిలీపట్నం పే.న.147). ఈ ఉదంతం ద్వారా యానాం ప్రజలకు ఈ బాల్య వివాహల పట్ల అసహనం కలిగి ఉన్నారనే విషయం అర్ధం చేసుకొనవచ్చును. ఈ కాలంలో యానాన్ని కళ్యాణ పురమని ముద్దుగా పిలుచుకొనేవారు.

మూలాలు, వనరులు మార్చు

  1. ^ ఫ్రంట్‌లైన్‌ వ్యాసం
  2. మరో ఫ్రంట్‌లైన్‌ వ్యాసం