శ్వేతనాగు
శ్వేతనాగు సంజీవి దర్శకత్వంలో సి. వి. రెడ్డి నిర్మించగా 2004 లో విడుదలైన చిత్రం.[1] ఇందులో సౌందర్య ప్రధాన పాత్ర పోషించింది. అబ్బాస్ మరో ముఖ్యపాత్రలో నటించాడు.[2] ఈ సినిమా మొదట్లో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించాలనుకున్నారు కానీ తర్వాత తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నిర్మించబడింది. కన్నడలో శ్వేత నాగ అనే పేరుతో విడుదలైంది. రెండు భాషల్లో ప్రధాన తారాగణం ఒకటే అయినా సహాయ నటులు మాత్రం వేరు. మేఘాలయ నుంచి తీసుకువచ్చిన తెల్లటి నాగుపామును ఈ చిత్రంలో వాడుకున్నారు.[3] తెలుగు వర్షన్ తమిళంలో మధుమతి అనే పేరుతో అనువాదం అయింది. ఒక నాగు తనకు హాని చేసిన కథానాయికపై పగబట్టడం, నాగదేవత సాయంతో ఆమె అందులోంచి బయటపడటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.
శ్వేతనాగు | |
---|---|
దర్శకత్వం | సంజీవి |
రచన | సాయినాథ్ (సంభాషణలు) |
నిర్మాత | సి. వి. రెడ్డి |
నటవర్గం | సౌందర్య, అబ్బాస్ |
ఛాయాగ్రహణం | దివాకర్ |
కూర్పు | లంక భాస్కర్ |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | సి. వి. ఆర్ట్స్ |
విడుదల తేదీలు | 2004 ఫిబ్రవరి 18 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ సినిమా సౌందర్య 100వ సినిమా. ఆమె పెళ్ళైన తర్వాత మొదటి సినిమా. ఆమె చనిపోబోయే ముందు నటించిన ఆఖరి చిత్రాల్లో ఇది కూడా ఒకటి.
కథసవరించు
మధుమతి (సౌందర్య) పాములపై పరిశోధనలు చేసే ఒక విద్యార్థి. ఒకసారి ఆమె గైడు (శరత్ బాబు) నాగుల ప్రవర్తనపై కొన్ని శతాబ్దాల క్రితం కొంతమంది పూజారులచే రాయబడ్డ నాగ శాస్త్రం గురించి ఆమెకు చెబుతాడు. ఆ గ్రంథం నల్లమల అడవుల్లో ఎక్కడో దాగి ఉందనీ దానిని అన్ని వేళలా ఒక నాగుపాము సంరక్షిస్తూ ఉంటుందని చెబుతాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మధుమతి నల్లమల అడవుల్లోని ఒక గూడేనికి చేరుకుని ఆ గ్రంథాన్ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో ఉండగా ఆమెకు ఒక శ్వేతనాగు కనిపించి ఆమెను కాటు వేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆమెకు ఒక సాధువు కనిపించి ఆమె పూర్వ జన్మలో ఒక పామును చంపిందనీ అది ఈ జన్మలో ఆమె మీద పగ తీర్చుకోవాలనుకుంటుందనీ చెబుతాడు. దాన్నుంచి రక్షించడానికి ఆమెకు తాయెత్తు కూడా ఇస్తాడు. మధుమతి ఆ శ్వేతనాగునుంచి తప్పించుకుని నాగదేవత అనుగ్రహం ఎలా సంపాదించుకుంటుందనేది మిగతా కథ.
తారాగణంసవరించు
- మధుమతిగా సౌందర్య
- అబ్బాస్
- సర్పారణ్య దొరగా జయప్రకాష్ రెడ్డి
- ఆనంద్
- ప్రొఫెసర్ గా శరత్ బాబు
- అభినయశ్రీ
- మధుమతి తల్లిగా సంగీత
- పృథ్వీ రాజ్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- మల్లికార్జున రావు
- బ్రహ్మానందం
- కళ్ళు చిదంబరం
- రఘునాథ రెడ్డి
- పట్టాభిరాం
నిర్మాణంసవరించు
దర్శకుడు సంజీవికిది తొలి చిత్రం. నిర్మాత ఈ సినిమాను తక్కువ ఖర్చులో పూర్తి చేశారు. సౌందర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఆమెకు జోడీగా అబ్బాస్ నటించాడు. కథానాయిక తల్లిగా సంగీత నటించింది. సౌందర్యకు గాయని సునీత డబ్బింగ్ చెప్పింది.[1]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో శ్వేతనాగు చిత్ర సమీక్ష". idlebrain.com. idlebrain.com. Retrieved 11 August 2017.
- ↑ "Abbas receives mafia threat | undefined News — Times of India". The Times of India.
- ↑ "Wonderful white snake". The Hindu. 22 July 2003.