తెలుగు నాటకరంగ ఆరంభదశలో నటునిగా చరిత్రను సృష్టించి ఆంధ్ర నట పితామహునిగా పేరొందిన వ్యక్తి హరిప్రసాదరావు. ప్రసాదరావు ఇంటిపేరు హరి.

హరి ప్రసాదరావు
హరి ప్రసాదరావు
జననం1871
కూచిపూడి, కృష్ణా జిల్లా
మరణంఅక్టోబర్ 7, 1936
గుంటూరు
భార్య / భర్తసీతమ్మ

జననం మార్చు

ఈయన 1871లో కృష్ణా జిల్లా, కూచిపూడి లో జన్మించారు.

ఉద్యోగం మార్చు

రైల్వే, టెలిగ్రాఫ్ శాఖలలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ప్రసాదరావు సతీమణి సీతమ్మ చిన్న వయసులో మరణించినా పునర్వివాహం చేసుకోకుండా నాటక రంగానికే జీవితాన్ని అంకితం చేశారు.

నాటక ప్రస్థానం మార్చు

వచన నాటకాలలో నటిస్తున్న హరిప్రసాదరావు బళ్లారి కేంద్రంగా వీరవిహారం చేస్తున్న పద్య వైభవాన్ని గురించి తెలుసుకొని అక్కడకు వెళ్లారు. బళ్లారిలో ధర్మవరం రామకృష్ణమాచార్యులు చిత్రనళీయం నాటకాన్ని చూసి ఆ నాటకాన్ని ప్రదర్శించడానికి తనకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆయన తిరస్కరించారు. బళ్లారిలో ఒక నాటకాన్ని ప్రదర్శించి ధర్మవరం వారిని మెప్పించి చిత్రనళీయ నాటక ప్రదర్శనకు అనుమతిని పొందారు. భావస్ఫోరకంగా; సర్వజన సుబోధకంగా, రాగాన్ని పద్యంలోనే ఇమిడ్చి పద్యంతోపాటు రాగం ముసిగేవిధంగా నూతన సంప్రదాయానికి హరిప్రసాదరావు శ్రీకారం చుట్టారు.

బంకుమల్లి వీరవెంకయ్య ‘సత్యహరిశ్చంద్ర’, వడ్డాది సుబ్బారాయుడు ‘వేణీ సంహారం’, కందుకూరి ‘శాకుంతలం’, ధర్మవరం రామకృష్ణమాచార్యులు ‘చిత్రనళీయం’, ‘సారంగధర’, కోలాచలం శ్రీనివాసరావు ‘సునందినీ పరిణయం’, వంగిపురం రామకృష్ణమాచార్యులు ‘జనకు జనానందం’, బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి ‘హరిశ్చంద్ర’; బుద్ధిమతీ విలాసం నాటకాలతోపాటు సుంకరి కాండడు, మొద్దబ్బాయి, భామాకలాపం, బోరుూ వంటి ప్రహసనాలను అద్భుతంగా ప్రదర్శించారు. హరిప్రసాదరావు ఎన్ని పాత్రలను పోషించినా హరిశ్చంద్రుడు, సారంగధరుడు, నలుడు, దుర్యోధనుడు వంటి పాత్రలను అద్భుతంగా పోషించారు. ఆనందభైరవి, భైరవి, ముఖారి, మోహన, బారువ, పున్నాగ, శహానీ, శ్రీ, పూరీ కళ్యాణి, ఆరభి, వరాళీ రాగాలను ఆలపించడంలో ఈనాటికి హరిప్రసాదరావును అగ్రగణ్యులుగా పేర్కొంటారు.

హరిప్రసాదరావు, కోపల్లె హనుమంతరావు నాయికా నాయకులుగా పలు నాటకాలలో నటించారు. గుంటూరు ఫష్ట్ కంపెనీలో హరిప్రసాదరావుతోపాటు జాగర్లపూడి లక్ష్మీనరసింహారావు, కడియాల రత్తయ్య, కోటంరాజు లక్ష్మీకాంతం, ఆరణి సత్యనారాయణ, స్థానం నరసింహారావు, యం.కె.ఆర్.దీక్షితులు, ఉప్పులూరి సంజీవరావు, ముప్పిడి జగ్గరాజు వంటివారు నటించారు.

హరిప్రసాదరావు నాటకాలలో నటించడం ఎంత ఇష్టమో స్వయంగా వాల్‌పోస్టర్లను వ్రాసి అంటించడం అంత ఇష్టంగా ఉండేది. ముత్యాల వంటి వ్రాతతో స్వయంగా వాల్‌పోస్టర్లను వ్రాసి ఇద్దరు కుర్రాళ్ళను వెంట బెట్టుకొని రాత్రివేళల్లో గోడల మీద అంటించేవారు.

రంగస్థలంపై నటించే సమయంలో వీరి సమయస్ఫూర్తి అద్భుతమైనది. ఒక పర్యాయం నలుని పాత్రను అభినయించే సమయంలో రుమాలు చేతిలో నుండి పడిపోయింది. ఆ పొరపాటును కప్పిపుచ్చుకోవడానికి అహో దుశ్శకునము అంటూ రుమాలును తీసుకొన్నారు. అది కూడా నటనలో ఒక భాగమని ప్రేక్షకులు భావించారట. హరిశ్చంద్ర పాత్రలో ప్రేక్షకులను వెక్కి వెక్కి ఏడ్పించే విధంగా నటించే హరిప్రసాదరావు పాత్ర పూర్తిఅయిన తరువాత గ్రీన్‌రూమ్‌లోకి వెళ్లి భోరుమని ఏడ్చేవారు. ప్రసాదరావుకు నాటకంలోని పాటలూ; పద్యాలను పూర్తిగా నోటికి వచ్చినా సంభాషణలు మాత్రం గుర్తుండేవి కావు. దానితో ప్రామ్టింగ్‌పైనే ఆధారపడేవారు. కానీ ఆ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించకుండా తగు జాగ్రత్తలు తీసుకొనేవారు.

నలుని వేషంలో రచయిత ధర్మవరం వారిని మెప్పించడమే కాకుండా ఆయనచే ‘ఆంధ్ర నట పితామహ’ బిరుదును పొందారు. బళ్లారి రాఘవ అభిమానానికి, ప్రశంసలకు పాత్రుడైన హరిప్రసాదరావు ఆయనకు ఆత్మీయ మిత్రులయ్యారు. హరిప్రసాదరావు అవసాన దశలో కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్నపుడు రాఘవ రెండు నాటకాలను ప్రదర్శించి ఆ కలక్షన్‌ను హరిప్రసాదరావుకు బహూకరించారు. యడవల్లి సూర్యనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, పత్రి శీనప్ప, రవణప్ప, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, బెల్లంకొండ సోదరులు హరిప్రసాదరావుకు ప్రత్యక్ష శిష్యులు. ఆంధ్ర నట పితామహుని నట వైభవానికి శాశ్వత రూపం ఇవ్వాలనే సంకల్పంతో పత్రి శ్రీనివాసరావు, వి.ఎస్.ఆర్.మూర్తి, దేశిరాజు బాబూరావు, మంత్రిప్రగడ శివరామకృష్ణారావు ‘మాయదారి మాణిక్యం’ అనే మూకీ చిత్రాన్ని నిర్మించి తెలుగు నాటక రంగానికి మహోపకారం చేశారు. గుంటూరులో తొలిసారిగా జిల్లా కోర్టును నెలకొల్పిన సమయంలో కాపీ యాక్టుగా పనిచేశారు.

మరణం మార్చు

తెలుగు నాటకరంగ ప్రారంభదశలో ఒక వెలుగు వెలిగిన హరిప్రసాదరావు 1936 అక్టోబర్ 7 న గుంటూరులో అస్తమించారు.

మూలాలు మార్చు