ఉమా ధర్మలింగేశ్వరాలయం (పంచదార్ల)

(ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం (పంచదార్ల) నుండి దారిమార్పు చెందింది)

ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం (పంచదార్ల), ఇది అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం లోని పంచదార్ల (దీని అసలు పేరు ధరపాలెం) గ్రామంలో ఉంది. పంచదార్ల చారిత్రిక విశిష్టత కల గ్రామం.ఈ గ్రామంలోని ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం చారిత్రిక విశిష్టత కల అతి ప్రాచీన శైవక్షేత్రం. ఇది మండల కేంద్రమైన రాంబిల్లి నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 25 కి. మీ. దూరంలోనూ, ఎలమంచిలికి 10 కి.మీ. దూరంలో ఎలమంచిలి - విశాఖపట్నం (స్టీల్ ప్లాంట్, గాజువాక మీదుగా) రహదారి పై ఉంది. ఇక్కడ ఎల్లవేళలా భూగర్భం నుంచి పైకి వచ్చే ఐదు నీటి ధారలు (పంచ ధారలు) భక్తులకు కనువిందు కలిగిస్తాయి.పంచదార్ల (దీని అసలు పేరు ధరపాలెం) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రదేశాలలో ఒకటి. పంచదార్ల గ్రామం ఎలమంచిలికి ఈశాన్యంగా 10 కి.మీ దూరంలో, నర్సీపట్నం నుండి 50 కి.మీ దూరంలో ఉంది, ఇది సహజ శాశ్వత నీటి బుగ్గ నుండి సరఫరాను పొందే ఐదు ప్రదేశాలలో ఐదు దారలుగా ఎల్లప్పుడూ ప్రహస్తున్నందున దాని నుండి పంచదార్ల అనే పేరు వచ్చింది.[1][2] కార్తీక మాసం, శివరాత్రి, విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కళకళ లాడుతోంది.

ఉమా ధర్మలింగేశ్వరాలయం
ఆలయంలోని ఒక శాసనం

చరిత్ర మార్చు

సమీపంలో శివ లింగం ఉంది, దానిపై 12 వరుసల అడ్డ 85 నిలువు వరుసలలో ఇతర లింగాలు చెక్కబడ్డాయి. తత్ఫలితంగా దీనిని కోటిలింగం లేదా కోటి లింగాలు అని పిలుస్తారు. [3]ఆలయంలోని మండప స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి. వాటిలో రెండు సా.శ. 1407, 1428 నాటివి తూర్పు చాళుక్యుల పూర్వీకులని చెప్పుకునే, సర్వలోకాశ్రయ, విష్ణు వర్దన అనే తూర్పు చాళుక్యుల బిరుదులను కలిగి ఉన్న ముఖ్యుల వంశావళిని కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం, రాధా మాధవ స్వామి ఆలయం, కల్యాణ వినాయక (ద్విముఖి వినాయక) దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి.[4]

పురాణ కథనం మార్చు

 
పంచధార్ల దేవాలయాలు సమూహం ప్రధాన ప్రవేశం , స్మారక చిహ్నాలు, ధరపాలెం

ఇక్కడ స్వయం భూయుక్తమైన లింగం ఉండేదని కాల గతిలో అది మరుగున పడగా నారదుని సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టువ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్ధమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించేడని యమధర్మరాజుచే పునఃప్రతిస్టించ బడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయంఅనే పేరు వచ్చినట్టు స్థల పురాణం. ఇక్కడ పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించే కుబేరుడు ప్రతిష్ఠించాడని చరిత్రకారుల భావన. ఈ క్షేత్రంలో ముందుగా బయట మనకు కనిపించేది ’రాధామాధవ స్వామి’ నిలయం, ఒక మండపం. ఈ మండపాన్ని హరినరేంద్రుడు సా.శ.1538 లో నిర్మించాడు. ఆలయానికి దక్షిణ దిశలో తటాకం ఉంది. నీటి ధారలన్నీ దీనిలో కలుస్తాయి. ఈ తటాకాన్ని, తూర్పుదిశలో నున్న ఆస్థాన మండపాన్ని చాళుక్య నృసింహదేవుని భార్య వీరాంబికచే నిర్మితమయ్యాయి. ఇక్కడ ఆలయ సమూహంలో విశ్వేశ్వరస్వామి ఆలయం, అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు, శిథిల శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానమైన ధర్మలింగేశ్వరాలయం, అన్ని ఆలయాల కన్న ఎత్తులో ఉంది. గర్భగుడి లోపల నున్న మండపం సా.శ.1432 లో కుమార ఎర్రమనాయకునిచే నిర్మించ బడినదని, దేవుని కళ్యాణ ఉత్సవాలకై నిర్మించబడ్డ మండపం 1407 లో యలమంచిలి విశ్వేశ్వర దేవుని చే నిర్మిచబడినదని చెపుతారు. ఆలయాన్ని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ వారు పెట్టిన బోర్డు ఇక్కడ ఉంది. కార్తీక మాసం, శివరాత్రి, విజయదశమి రోజుల్లో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కళకళ లాడుతోంది.[5]

ప్రయాణ మార్గం మార్చు

బస్సు ద్వారా: అనకాపల్లి పంచదార్లకు సమీప పట్టణం. పంచదార్ల నుండి అనకాపల్లి 26 కి.మీ. అనకాపల్లి నుండి పంచదార్లకు రోడ్డు కనెక్టివిటీ ఉంది.

రైలు ద్వారా: ఎలమంచిలి, నరసింగపల్లి రైల్వే స్టేషన్ పంచదార్లకు సమీపంలోని రైల్వే స్టేషన్లు. అనకాపల్లి, తాడి రైల్వే స్టేషన్లు అనకాపల్లికి సమీప స్టేషన్లు. అనకాపల్లి నుండి పంచదార్లకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

మూలాలు మార్చు

  1. "Narsipatnam Online". narsipatnamonline.com. Archived from the original on 2023-04-26. Retrieved 2023-04-26.
  2. "Panchadarla Shiva Temple, a reflection of dire neglect". The Times of India. 2017-02-24. ISSN 0971-8257. Retrieved 2023-04-26.
  3. "Panchadarla Shiva Temple Visakhapatnam, Rambilli Vizag". Visakha guide. Retrieved 2023-04-27.
  4. "Panchadarla Shiva Temple, a reflection of dire neglect". The Times of India. 2017-02-24. ISSN 0971-8257. Retrieved 2023-04-26.
  5. https://timesofindia.indiatimes.com/city/visakhapatnam/panchadarla-shiva-temple-a-reflection-of-dire-neglect/articleshow/57318543.cms

వెలుపలి లంకెలు మార్చు