కాకాని వెంకటరత్నం

కాకాని వెంకటరత్నం (1900 - 1972) స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు.ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా, మంత్రిగా పనిచేసారు, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేస్తూ అసువులు బాసారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు[1]. ఉక్కు కాకానిగా పేరొందారు.

ఆకునూరు గ్రామంలో నెలకొల్పిన కాకాని వెంకటరత్నం స్మారకవిగ్రహం

జననంసవరించు

కాకాని వెంకటరత్నం 1900 సంవత్సరం, ఆగస్టు 3వ తేదీన కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.

స్వాతంత్ర పోరాటంసవరించు

కాకాని వెంకటరత్నం మహాత్మ గాంధీ ఉపదేశాలతో స్పూర్తి పొంది 1924లో రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. 1937-40లలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1941-42లో యుద్ధ వ్యతిరేక ప్రచారం చేశారు. వీరు క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఫలితంగా 1942-1945 సంవత్సరాల మధ్య వెల్లూరు, తంజావూరు కారాగారాలలో శిక్షను అనుభవించారు.

రాజకీయ జీవితంసవరించు

1949-53 మధ్య కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేసారు. 1952-53లో ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పనిచేశారు. 1967 లో మరల ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.

1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో ఉయ్యూరు నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్దిగా శాసన సభకు ఏన్నికైనారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు, వీరు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులుగా పనిచేసారు. 1962 లో,1967లో మరల 1972లో ఉయ్యూరు నుండి కాకాని వెంకటరత్నం శాసన సభ్యునిగా ఏన్నికైనారు. 1959-66ల మధ్య వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు.

అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి (1969 -71), పి.వి. నరసింహారావు (1971 - 72) మంత్రి వర్గాలలో వ్యవసాయ, పశుపోషక, పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు[2][3] . మంత్రిగా సహకార రంగం లో పాడి పరిశ్రమలను నెలకొల్పి పాల విప్లవానికి నాంది పలికారు. వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేసారు. రైతు జనభాంధవునిగా పెరుపొందారు.

జై ఆంధ్ర ఉద్యమంసవరించు

1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో వీరు కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి రాజీనామా చేశారు. జై ఆంధ్రా ఉద్యమం లో విధ్యార్దుల పై పోలీసు కాల్పులు జరిగి విధ్యార్దులు మరణించారన్న వార్త విని వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు.

విజయవాడ కాకాని సర్కిల్ (బెంజ్ కంపెనీ జంక్షన్) వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు. కృష్ణా జిల్లాలోని నందిగామలోని కాలేజీకి వీరి గౌరవార్థం కె.వి.ఆర్ (కాకాని వెంకటరత్నం) కాలేజీ అనే పేరుతో పిలుస్తున్నారు. ప్రజలు వీరిని "ఉక్కు కాకాని" అని పిలిచేవారు.

మూలాలుసవరించు

  1. Lucien D. Benichou, From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948 (Orient Longman, 2000), p282
  2. "Aspirants beware! Voters tilt the scales here". The Hindu. Chennai, India. March 16, 2004. Archived from the original on 2012-10-24. Retrieved 2016-01-05.
  3. ""Jai Andhra" now in momentum". AndhraCafe.com. Archived from the original on 2011-07-07. Retrieved 2016-01-05.

ఇతర లింకులుసవరించు