చాగంటి తులసి

రచయిత్రి

చాగంటి తులసి ప్రముఖ కథా రచయిత. ఈమె చాగంటి సోమయాజులు (చాసో) కుమార్తె. తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి అంటే ‘చాసో’ కూతురు మాత్రమే కాదు. చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తులసి తనదయిన వేరే దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచనా ఆమె విశిష్ట వ్యకిత్వానికి అద్దం పడతాయి.[1]

చాగంటి తులసి
చాగంటి తులసి
జననంచాగంటి తులసి
1937
నివాస ప్రాంతంవిజయనగరం
ఇతర పేర్లుచాగంటి తులసి
వృత్తిఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్‌
దక్షిణ కొరియా సియోల్‌లోని హాంకుక్‌ యూనివర్సిటీలో గెస్ట్‌ ప్రొఫెసర్‌
ప్రసిద్ధితెలుగు రచయిత్రి
మతంహిందూ
తండ్రిచాగంటి సోమయాజులు

జీవిత విశేషాలు మార్చు

ఈమె చాగంటి సోమయాజులు గారి కుమార్తె. తండ్రి, ఆయన స్నేహితులు గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు.వారి మధ్య గొప్పవారు అన్న స్పృహ లేకుండా వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగారామె. అంతే సహజంగా అమ్మా బామ్మల సంప్రదాయ సంస్కారాల ఉత్తమ నడవడికలతో ఎదిగారు. ఆ పెంపకంలో అమే చదవడం అలవర్చింది. ఆమె నిర్ణయాలు ఆమె చేసుకునే విధంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చింది ఆ కుటుంబం. మంచి కవయిత్రిగా తీర్చి దిద్దబడ్డారు.[2]

రచయిత్రిగా మార్చు

”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946 లో బాలపత్రికలో మొదటికథ వ్రాశారు. యాభయ్యవదశకంనించే పురోగామి దృక్పథంతో కథలు వ్రాస్తున్నారు. పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకమైన కథలు ఆమెవి. పధ్నాలుగు కథలతో వచ్చిన ”తులసి కథలు” కథాసంపుటి, ”యాత్ర” చిన్న నవల, ”సాహితీ తులసి” అనే వ్యాససంపుటి, ”తులసి కథలు” ప్రచురణానంతరం వ్రాసిన కొన్ని కథలు, ”తగవు” అనే నాటిక ఆమె తెలుగు రచనలు కాగా, అనువాదాలు ఎక్కువ చేసారు.

హిందీ నుంచీ రాహుల్‌సాంకృత్యాయన్‌ఓల్గా నుంచి గంగ వరకు”, సఫ్దర్‌ అస్మి ”హల్లాబోల్‌”, డాక్టర్‌ అంబేద్కర్‌ జీవిత చరిత్ర అనువదించారు. ఒరియానించీ ”సచ్చిరౌత్రాయ్‌ కథలు” గోపీనాథ్‌ మహంతి ”బ్రతుకుతెరువు”, ఇంగ్లీష్‌ నుంచి కేంద్రసాహిత్యఅకాడమి కోసం సరళాదాసు, కాజీ నస్రుల్‌ ఇస్లాం మోనోగ్రాఫ్‌లు, ఆరుద్ర రాసిన "రాముడికి సీత ఏమౌతుంది"ను తెలుగు నించీ హిందీకి ”సీతా రామ్‌ కి క్యా లగతీ హై”గా అనువదించారు. ప్రసిద్ధ తెలుగు కథలెన్నింటినో హిందీలోకి ఒరియాలోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు. హిందీలో ”మహాదేవీకీ కవితామే సౌందర్య భావన్‌” అనే విషయంపై డాక్టరేట్‌ తీసుకున్న తులసి, ఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్‌గా పనిచేశారు. తరువాత దక్షిణ కొరియా సియోల్‌లోని హాంకుక్‌ యూనివర్సిటీలో గెస్ట్‌ ప్రొఫెసర్‌గా హిందీ బోధించారు. పదవీ విరమణ తరువాత ప్రస్తుతం విజయనగరంలో వుంటున్నారు.[3].

తులసి విజయనగరం జిల్లా మాండలికంలో చెయ్యి తిరిగిన రచయిత. ఆమె వ్రాసిన ”ఆడదాయికి నోరుండాలి” ”చోద” రెండూ ఆ మాండలికంలో వ్రాసిన ఉత్తమపురుష కథలే. మధ్యతరగతి జీవుల నెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారామె. గుడిసెవాసులకి బుల్‌డోజర్లనించీ ఎంత ప్రమాదం వుందో ప్రకృతినించీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ ”స్వర్గారోహణ”లో తన సత్తు బిందెకోసం ఇంట్లోకి వెళ్లి ముంపులో మునిగిపోయింది పోలి…వ్రాసినవి తక్కువ కథలే అయినా శిల్పంలోను వస్తువులోను తాత్వికతలోనూ గుణాత్మకమైనవి తులసి కథలు. తులసి కథలకు ముందుమాట వ్రాసిన రోణంకి అప్పలస్వామి గారు చాసో కథల కన్న తులసి కథలే తనకు నచ్చుతాయని కితాబిచ్చారు.

పురస్కారాలు[3] మార్చు

మొదలైన పురస్కారాలను అందుకున్నారు.

సాహితీ సేవ మార్చు

ప్రసిద్ధ కథారచయిత చాగంటి సోమయాజులు గారి ”చిన్న”మ్మాయి అయిన తులసి ఆయన పేరున 1994లో చాసో సాహిత్య ట్రస్టును స్థాపించి ప్రతి సంవత్సరం ఉత్తమ సాహిత్య స్రష్టలకు చాసో స్ఫూర్తి అవార్డు ఇస్తున్నారు.

మూలాలు మార్చు

  1. "సారంగ సాహిత్య వార పత్రికలో ఇంటర్వ్యూ". Archived from the original on 2013-10-11. Retrieved 2013-09-09.
  2. "సారంగ సాహిత్య వార పత్రికలో ఆమె బాల్యం". Archived from the original on 2013-10-11. Retrieved 2013-09-09.
  3. 3.0 3.1 స్త్రీ వాద పత్రిక భూమికనుండి
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284.

యితర లింకులు మార్చు