ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్

కారకోరం వాటర్‌షెడ్ ప్రాంతానికి ఉత్తరంగా, షక్స్‌గామ్ లోయతో కలుపుకుని ఉన్న సుమారు 5,300 km2 (2,050 sq mi) విస్తీర్ణంలో [1] ఉన్న ప్రాంతాన్ని ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ అంటారు. [2][3] జిన్‌జియాంగ్ ఉయ్‌ఘుర్ అటానమస్ రీజియన్‌లోని టాక్స్‌కోర్గాన్, యెచెంగ్ కౌంటీలలో భాగంగా చైనా ఈ ప్రాంతాన్ని పాలిస్తోంది. దీనిని షక్స్‌గామ్ ట్రాక్ట్ అని కూడా అంటారు.1947 నుండి షక్స్‌గామ్ ట్రాక్ట్ ఏనాడూ పాకిస్తాన్ నియంత్రణలో లేనప్పటికీ, 1963 చైనా-పాకిస్తాన్ ఒప్పందంలో పాకిస్తాన్, షక్స్‌గామ్ ట్రాక్ట్‌పై చైనా సార్వభౌమాధికారాన్ని గుర్తించింది. బదులుగా చైనా, గిల్గిట్ ఏజెన్సీపై పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని గుర్తించింది. అలాగే, క్షేత్ర స్థాయిలో అధీనంలో ఉన్న భూభాగాలపై ఆధారపడిన రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా చైనా, పాకిస్తాన్‌లు గుర్తించాయి. [4] [5] భారతదేశం దీనిని తన లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా గుర్తిస్తోంది.

బ్రిటీష్ ఇండియాలో సంస్థానమైన జమ్మూ కాశ్మీర్ ప్రస్తుత సరిహద్దులతో, రాష్ట్రపు ఉత్తర భాగంలో (ఎరుపు గీతల ప్రాంతం) ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌ను చూపుతోంది [lower-alpha 1] - సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మ్యాప్

ఈ ప్రాంతం లోని చాలా భాగం షక్స్‌గామ్ లోయతో కూడుకుని ఉంటుంది. గతంలో ఇది బల్టిస్తాన్ ప్రాంతం లోని షిగర్‌ జిల్లాలో (గతంలో ఒక తహసీల్ గా ఉండేది) భాగంగా ఉండేది. షిగర్‌లోని అమాచా రాజ కుటుంబం షక్స్‌గామ్‌లో ఒక పోలో మైదానాన్ని నిర్మించింది. షిగర్ రాజులు హోటాన్‌లోని అమీర్‌లను అక్కడ పోలో ఆడేందుకు ఆహ్వానించేవారు. [6] ఇక్కడి పర్వతాలు, సరస్సులు, నదులు, కనుమల పేర్లు చాలా వరకు బల్టీ/లడాఖీ భాషలో ఉంటాయి. ఈ భూమి చాలా కాలంగా బల్టిస్తాన్/లడఖ్ ప్రాంతంలో భాగంగా ఉందని ఇది తెలుపుతోంది.

ఈ ట్రాక్ట్ ప్రపంచంలోని అత్యంత నివాసయోగ్యం కాని ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ కొన్ని ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. దీనికి ఉత్తరాన కున్ లున్ పర్వతాలు, దక్షిణాన కారకోరం శిఖరాలు, బ్రాడ్ పీక్, K2, గాషెర్‌బ్రమ్‌లు, ఆగ్నేయంలో భారతదేశం నియంత్రణలో ఉన్న సియాచిన్ గ్లేసియర్ లోని ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధభూమికి ఆనుకుని ఉంది.

చరిత్ర మార్చు

 
1888 సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో కాశ్మీర్ సరిహద్దు. మలుబిటింగ్, రస్కామ్, అక్తాగ్ నుండి కరకున్లున్ షాన్ వరకు డాష్ లైన్‌లో నిర్వచించబడని సరిహద్దు చూపబడింది35°16′59″N 80°15′43″E / 35.28312°N 80.261863°E / 35.28312; 80.261863
 
షక్స్‌గామ్ నదికి సమీపంలో ఉన్న ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్‌లో కొంత భాగాన్ని చూపుతున్న వివరణాత్మక మ్యాప్ ( యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ మ్యాప్ సర్వీస్, 1953)
 
షక్స్‌గామ్ లోయ (జిన్‌జియాంగ్ ఉయ్ఘూర్ అటానమస్ రీజియన్). 2008 ఆగస్టు నాటి చిత్రం

చారిత్రికంగా హుంజా ప్రజలు కారకోరంకు ఉత్తరాన ఉన్న ప్రాంతాలను సాగు చేసుకుంటూ, పశువులను మేపుకుంటూ ఉండేవారు. హుంజా మీర్ ఆ ప్రాంతాలను హుంజా భూభాగాల్లో భాగంగా పేర్కొన్నాడు. షక్స్‌గామ్ లోయకు ఉత్తరాన ఉన్న రస్కామ్ వ్యాలీ కూడా ఆ ప్రాంతాలలో భాగం. [7]

1889లో ఫ్రాన్సిస్ యంగ్‌హస్‌బాండ్ షక్స్‌గామ్ లోయకు వెళ్ళిన తొలి యూరోపియన్‌ యాత్రికుడు. అతను షక్స్‌గామ్‌ను ఓప్రాంగ్‌ అని పేర్కొన్నాడు.

1899 మార్చిలో బ్రిటిష్ వారు సర్ క్లాడ్ మెక్‌డొనాల్డ్ చైనాకు పంపిన అధికారిక నోట్‌లో చైనా, బ్రిటిష్ ఇండియాల మధ్య కొత్త సరిహద్దును ప్రతిపాదించారు. హుంజాపై ఆధిపత్యం కోసం చైనా తన వాదనలను విరమించుకోవాలని ఆ నోట్‌లో ప్రతిపాదించారు. ప్రతిగా హుంజా తగ్దుంబాష్, రస్కామ్ జిల్లాలపై తన వాదనలను వదులుకోవాలి. [8] సింధు నది, తారిమ్ నదుల పరీవాహక ప్రాంతాలను విభజించే ప్రధాన కారకోరం శ్రేణిని అనుసరించే సరిహద్దును ఆ నోట్‌లో ప్రతిపాదించారు. అయితే షింషాల్ పాస్ సమీపంలోని దర్వాజా వద్ద హుంజా పోస్ట్ గుండా వెళ్ళే మార్గంలో కొంత తేడాను నోట్‌లో చూపించారు. [8] చైనీయులు ఆ నోట్‌కు ప్రతిస్పందించలేదు. భారత ప్రభుత్వం కూడా అందులో ప్రతిపాదించిన రూపంలో సరిహద్దు గురించి మళ్ళీ ప్రస్తావించలేదు. [8] 1905 లో భారతదేశంలో షింషాల్ పాస్‌కు తూర్పున ఉన్న ఒక చిన్న ప్రాంతాన్ని చేర్చి, షక్స్‌గాం నదిలో సరిహద్దును ఉంచేలా మెక్‌డొనాల్డ్ రేఖను సవరించారు. [8]

అదే సమయంలో, "ది గ్రేట్ గేమ్" దృష్ట్యా, చైనాలో క్వింగ్ రాజవంశం బలహీనపడటంతో రష్యా విస్తరణ ప్రమాదం పట్ల బ్రిటన్ ఆందోళన చెందింది. షక్స్‌గామ్ నదికి ఉత్తరాన సరిహద్దు ఉందంటూ కొత్త విధానాన్ని అవలంబించింది. ఇది 1897 నాటి మెమోరాండమ్‌లో సర్ జాన్ అర్దాగ్ ప్రతిపాదించిన రేఖను అనుసరించింది. [8] ఆ సరిహద్దులో రస్కామ్ లోయపై హుంజా మీర్ చెప్పిన దావా కూడా ఉంది. అయితే, బ్రిటీష్ పరిపాలన కారకోరం పరీవాహక ప్రాంతానికి ఉత్తరాన విస్తరించలేదు. [9]

1890లో మొదటిసారిగా ప్రచురించబడిన కాశ్మీర్, లడఖ్ గెజిటీర్‌ కాశ్మీర్‌లోని ప్రదేశాల వివరణను, వివరాలనూ అందిస్తుంది. దీన్ని భారత ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో ఉన్న క్వార్టర్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో సంకలనం చేసారు. ఇందులో అక్సాయ్ చిన్‌లోని హిందుతాష్ కనుమ గురించిన వివరణ ఉంది. గెజిటీర్ లోని 520, 364 పేజీల్లో "తూర్పు (కుయెన్‌లున్) శ్రేణి, ఖోటాన్ దక్షిణ సరిహద్దును ఏర్పరుస్తుంది", "యాంగి లేదా ఎల్చి దివాన్, హిందూటాక్ (అంటే హిందుతాష్ ) దివాన్ అనే రెండు కనుమల గుండా వెళ్తుంది ”. ఇది ఖోటాన్‌ను "తూర్పు కుయెన్‌లున్ శ్రేణికి ఉత్తరాన ఉన్న చైనా సామ్రాజ్యపు ప్రావిన్స్. ఇది ఇక్కడ లడఖ్‌తో సరిహద్దును ఏర్పరుస్తుంది" అని వర్ణించింది. [10] .

1899 నుండి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు, మ్యాప్‌లలో సరిహద్దు చిత్రణ మారుతూ ఉండేది. 1926లో కెన్నెత్ మాసన్ షక్స్‌గామ్ లోయను అన్వేషించి, సర్వే చేశాడు. [11] 1927లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మెక్‌డొనాల్డ్ లైన్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతంపై ఎలాంటి దావా వేయలేదు. అయితే ఈ విషయం బ్రిటిష్ మ్యాప్‌లలో చూపలేదు. [8] అయితే, 1959 నాటికి, చైనాలోని మెక్‌డొనాల్డ్ రేఖకు పశ్చిమ, దక్షిణాల్లో చాలా ప్రాంతాలను చూపుతూ చైనా మ్యాప్‌లు ప్రచురించింది. ఆ సంవత్సరం, పాకిస్తాన్ ప్రభుత్వం సరిహద్దు ప్రశ్నపై చైనాతో సంప్రదింపులకు సుముఖత ప్రకటించింది. [12]

1947కి ముందు స్వతంత్ర రాజ్యంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ మొత్తం ప్రాంతంపై భారతదేశం సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. పాకిస్తాన్, చైనా లకు అసలు ఉమ్మడి సరిహద్దు లేనేలేదని భారత్ పేర్కొంది.

1954లో టైమ్స్ అట్లాస్, సిస్-కుయెన్ లున్ ట్రాక్ట్ (కారకోరం, కుయెన్ లున్ పర్వతాల మధ్య ప్రాంతం) ను కాశ్మీర్‌లో భాగంగా, "నిర్వచించబడని సరిహద్దు ప్రాంతం" అనే శీర్షికతో చిత్రించింది. 1954 టైమ్స్ అట్లాస్ ప్రచురించిన ఉత్తర సరిహద్దులో తగ్దుంబాష్ పామిర్ నుండి యంగీ దావన్ వరకు కులనాల్డికి ఉత్తరాన ఉన్న కుయెన్ లూన్ శ్రేణి పరీవాహక ప్రాంతాన్ని దాదాపుగా అనుసరించింది. అయితే యాంగి దావన్ కనుమకు తూర్పున ఈ సరిహద్దు రేఖ, కుయెన్ పరీవాహక ప్రాంతం నుండి పక్కకు పోయింది.

చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం మార్చు

 
1962లో పాకిస్తాన్ ప్రభుత్వపు అధికారిక అలైన్‌మెంటు. సరిహద్దు, బాగా ఉత్తరాన ఉంది. అలైన్‌మెంట్ అఫీషియల్ పాకిస్తాన్ మ్యాప్ 1962 అనే శీర్షికతో చుక్కల రేఖగా చూపించబడి ఉంది.

1959లో, పాకిస్తానీలు తమ సొంత ప్రాంతాలుగా భావిస్తున్న ప్రాంతాలను చైనా, తమ దేశంలో భాగంగా చూపించిన మ్యాప్‌ల పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళన చెందింది. 1961లో, అయూబ్ ఖాన్ చైనాకు అధికారిక గమనికను పంపాడు. కానీ దానికి సమాధానం రాలేదు. భారత్‌తో పాకిస్తాన్‌కు ఉన్న సంబంధాల కారణంగా పాకిస్తాన్‌తో చర్చలు జరపడానికి చైనీయులు ముందుకు రాకపోవచ్చని భావించారు.

1962లో పాకిస్తాన్ ప్రభుత్వం, కాశ్మీర్ ఉత్తర సరిహద్దు అమరికను వర్ణించే అధికారిక మ్యాప్‌ను ప్రచురించింది. సిస్-కుయెన్ లున్ ట్రాక్ట్‌లో ఎక్కువ భాగం కాశ్మీర్‌లో ఉన్నట్లు ఇందులో చిత్రించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచురించిన అలైన్‌మెంటు 1954 టైమ్స్ అట్లాస్‌లో చిత్రించిన కాశ్మీర్ ఉత్తర సరిహద్దు చిత్రణను దాదాపుగా పోలి ఉంటుంది. అయితే కొన్ని ప్రదేశాలలో, పాకిస్తాన్ ప్రభుత్వ స్థానం 1954 టైమ్స్ అట్లాస్ నుండి వైదొలిగి, టైమ్స్ అట్లాస్‌లో కాశ్మీర్ సరిహద్దుకు ఉత్తరాన ఉన్నట్లు చూపిన భాగాలను కూడా చేర్చింది. ఈ విధంగా, 1963 చైనా-పాకిస్తాన్ ఒప్పందానికి ముందు పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక స్థానం ఏమిటంటే, పాకిస్తాన్ ఉత్తర సరిహద్దు కుయెన్ లూన్ శ్రేణిలో ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు అప్పగించిన భూభాగం కేవలం షక్స్‌గామ్ లోయకు మాత్రమే పరిమితం కాకుండా కుయెన్ లూన్ శ్రేణి దాకా విస్తరించి ఉంది. ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ లేదా సిస్-కుయెన్ లూన్ ట్రాక్ట్ విస్తీర్ణం గురించి ఒక ఆలోచన కోసం, చికాగోలోని DSAL వద్ద జో స్క్వార్ట్జ్‌బర్గ్ యొక్క హిస్టారికల్ అట్లాస్ ఆఫ్ సౌత్ ఏషియా నుండి మ్యాప్ (C)ని "1947కి ముందు బ్రిటన్‌ చిత్రించి, ప్రతిపాదించిన కాశ్మీర్ చైనా సరిహద్దు" అనే వర్ణనతో చూడవచ్చు. ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ లేదా సిస్-కుయెన్ లూన్ ట్రాక్ట్ భౌగోళిక ప్రాదేశిక పరిధి దాదాపుగా - అత్యంత ఉత్తరాన ఉన్న రేఖకు, అత్యంత లోపల ఉన్న రేఖకూ మధ్య ఉన్న భూభాగం అని చూపిస్తుంది.

 
ట్రాక్ట్ సరిహద్దులో ఉన్న బ్రాడ్ పీక్

ఐక్యరాజ్యసమితిలో చైనాకు స్థానం కల్పించేందుకు ఓటు వేసిన తర్వాత పాకిస్తాన్, 1962 జనవరి లో చైనా వివాదాస్పద మ్యాప్‌లను ఉపసంహరించుకుని, మార్చిలో సరిహద్దుపై చర్చలు జరిపేందుకు అంగీకరించింది. ఇరు దేశాల మధ్య చర్చలు అధికారికంగా 1962 అక్టోబరు 13 న ప్రారంభమై, 1963 మార్చి 2 న చైనా విదేశాంగ మంత్రి చెన్ యి, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టోలు ఒప్పందంపై సంతకం చేశారు. [5]

ఈ ఒప్పందం ఫలితంగా భారతదేశానికి చెందిన ఒక ముఖ్యమైన ప్రాంతాన్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్, దాన్ని చైనాకు అప్పగించినట్లు భారత ప్రభుత్వం అభిప్రాయపడింది. జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయం ప్రకారం, "పాకిస్తాన్ మ్యాప్‌ల సర్వే ప్రకారం - 1962లో ప్రచురించబడిన వాటి ప్రకారం కూడా - సింకియాంగ్ భూభాగంలోని దాదాపు 11,000 square miles [28,000 km2] కాశ్మీర్‌లో భాగంగా ఉంది. ఈ మ్యాప్‌ల ప్రకారం చూస్తే, పాకిస్తాన్ స్పష్టంగా 13,000 square miles [34,000 km2] పైగా భూభాగాన్ని అప్పగించింది.". [13]

ఇవి కూడా చూడండి మార్చు

  • NJ9842, LoC ముగిసి, AGPL ప్రారంభమయ్యే బిందువు
  • ఇందిరా కల్, AGPL LAC వద్ద ముగిసే బిందువు

గమనికలు మార్చు

  1. Siachen Glacier is under Indian administration despite being labelled "contested territory" in the map.

మూలాలు మార్చు

  1. Trivei, Abishek (8 July 2019). "Why the 1963 Sino-Pakistan Boundary Agreement Is Unlawful in Light of the Recent ICJ Advisory Opinion on the Chagos Archipelago, 2019". www.jurist.org. Retrieved 2021-11-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Snedden, Understanding Kashmir and Kashmiris 2015, p. 238.
  3. Schofield, Kashmir in Conflict 2003, p. 101.
  4. Noorani, A. G. (20 October 2006). "Facing the truth". Frontline. The Shaksgam Valley was never part of Kashmir and the northern and eastern boundaries of Kashmir were undefined
  5. 5.0 5.1 "Signing with the Red Chinese". Time (magazine). 15 March 1963. Archived from the original on 6 August 2020. Retrieved 28 October 2019. {{cite magazine}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 18 మార్చి 2013 suggested (help)
  6. Senge Sering, Polo Diplomacy as Part of Indo-Pak CBMs: Any Takers? Archived 2022-12-23 at the Wayback Machine, Centre for Land Warfare Studies, 1 December 2011.
  7. Lall, J. S. (1989), Aksaichin and Sino-Indian Conflict, Allied Publishers, p. 85
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 Woodman, Himalayan Frontiers (1970).
  9. Woodman, Himalayan Frontiers (1970), citing Alistair Lamb in the Australian Outlook, December 1964
  10. The Gazetteer of Kashmír and Ladák compiled under the direction of the Quarter Master General in India in the Intelligence Branch (1890), at page 493
  11. Mason, Kenneth (1928). Exploration of the Shaksgam Valley and Aghil ranges, 1926. pp. 72ff. ISBN 9788120617940.
  12. The Geographer. Office of the Geographer. Bureau of Intelligence and Research. Department of State, United States of America (November 15, 1968), China – Pakistan Boundary (PDF), International Boundary Study, vol. 85, Florida State University College of Law
  13. Formal statement of Mr. Jawaharlal Nehru in the Parliament of India on March 5, 1963