త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి
త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి (సెప్టెంబరు 9, 1892 - జనవరి 30, 1981) ప్రసిద్ధిచెందిన పండితులు మరియు రచయిత.
త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి | |
---|---|
జననం | బుర్రిపాలెం | 1892 సెప్టెంబరు 9
మరణం | 1981 జనవరి 30 | (వయసు 88)
నివాసం | తెనాలి |
జాతీయత | భారతదేశం |
వృత్తి | బోధన |
మతం | హిందూమతం |
తల్లిదండ్రులు | వెంకటప్పయ్య శాస్త్రి, అన్నపూర్ణమ్మ |
జీవిత సంగ్రహంసవరించు
వీరు వైదికులు, భారద్వాజస గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. వీరు 9 సెప్టెంబర్ 1892 తేదీన (నందన నామ సంవత్సర భాద్రపద శుక్ల తదియ, శుక్రవారం) వెంకటప్పయ్య శాస్త్రి మరియు అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరి స్వస్థలం తెనాలి మండలం బుర్రిపాలెం. చిన్ననాడు ఆంగ్లవిద్యను అభ్యసించినా, తర్వాతకాలంలో వీరు సంస్కృత భాషను నేర్చుకొని కావ్య, నాటక, అలంకార, తర్క, వ్యాకరణ, పూర్వమీమాంస జ్యోతిశాస్త్రాలలో పాండిత్యాన్ని సంపాదించారు. శ్రీ కళ్యాణానంద భారతీ స్వామివద్ద వేదాంత భాష్యం చదివి, శ్రీవిద్యలో పాదుకాంత దీక్ష గ్రహించి, వేదాంత పారీణ అను బిరుదును పొందారు. తెనాలిలోని రామ విలాస సభకు వీరు ఉపదేష్ట.
చలనచిత్రరంగంలో కూడా పేరు గడించారు. వీరు సినీనటి కాంచనమాలకు నాట్యశాస్త్ర గురువు. విప్రనారాయణ చిత్రానికి సినేరియో రచయితగాను, నాట్యరంగ విధాతగాను, ఉషా పరిణయం చిత్రానికి రచయితగాను పనిచేశారు.
వీరు తల్లావజ్ఝల శివశంకరశాస్త్రితో కలసి సాహితీ సమితిని స్థాపించారు. ఆ సంస్థలో కార్యదర్శిగాను, మంత్రిగాను, ఉపాద్యక్షునిగాను సుమారు 25 సంవత్సరాలు పనిచేశారు.
వీరు సాహితి పత్రికకు మరియు విశ్వజనీయ గ్రంథావళికి సహ సంపాదకులుగా పనిచేశారు. తెనాలిలోని సంస్కృత పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు.
వీరు ఎన్నో కవితలను, కథానికలను, వ్యాకరణ గ్రంథాలను, నవలలను రచించారు.
వీరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు సెనేటులో, సిండికేటులో, పాఠ్యగ్రంథ నిర్ణాయక సంఘంలోను సభ్యులుగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో మొదట సాధారణ సభ్యత్వం పొంది, తర్వాత విశిష్ట సభ్యత్వాన్ని పొందారు.
వీరు 30 జనవరి 1981 తేదీన పరమపదించారు.
తెనాలిలో వీరు నివసించిన వీధికి "త్రిపురారిభట్లవారి విథి" అని పేరు పెట్టారు.
రచనలుసవరించు
- వాల్మీకి విజయము
- కపాల కుండల (నవల) బెంగాలీ భాషలో బంకించంద్ర చటర్జీ రచనకు తెలుగు అనువాదం
- ఏకోత్తర శతి బెంగాలీ భాషలో రవీంద్రనాథ ఠాగుర్ రచించిన రచనను కేంద్ర సాహిత్య అకాడమి కోరికపై తెలుగుపద్యకావ్యంగా అనువదించారు.
- నవమాలిక. దీనిని జయా పబ్లిషర్స్, తెనాలిలో 1948లో ప్రచురించారు.[1]
మూలాలుసవరించు
- వీరరాఘవస్వామి, త్రిపురారిభట్ల, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005, పేజీలు: 661-2.