దువ్వూరి సుబ్బమ్మ

స్వాతంత్ర్య సమర యోధురాలు

దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ (జ: 1880 - మ: 31 మే, 1964) స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ.

దువ్వూరి సుబ్బమ్మ
రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గరలోని స్వాతంత్ర సమరయోధుల పార్కులోని దువ్వూరి సుబ్బమ్మ విగ్రహం
జననం1880
ద్రాక్షారామం
మరణంమే 31,1964
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు
మతంహిందూమతం
భార్య / భర్తదువ్వూరి వెంకయ్య

సుబ్బమ్మ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో 1880 సంవత్సరం నవంబరు నెలలో మధ్యతరగతి వైదిక బ్రాహ్మణ కుటుంబంలో మల్లాది సుబ్బావధాని దంపతులకు జన్మించింది. ఈమె భర్త దువ్వూరి వెంకయ్య. ఈమెకు బాల్య వివాహం జరగడం, భర్తను చిన్నతనంలోనే కోల్పోయి బాల్య వితంతువు అయ్యింది. చదువుకోలేదు. అయితే ఈమెకు వెంకటశాస్త్రి బంధువు అవటం వల్ల ఆయన సుబ్బమ్మకు సాహిత్యంలో శిక్షణ ఇచ్చాడు.[1] సుబ్బమ్మ స్వాతంత్ర్యోద్యం వైపు అడుగులు వేసి కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడింది. ఈమె కంఠం చాల గంభీరంగా ఉండడం వల్ల మైకులు లేకపోయినా ఆమె ప్రసగించే ఉపన్యాసం చాలా దూరం వినిపించేది. ఈమె పాడిన పాటలు ఆంగ్లేయులకు వినిపించకుండా డప్పులు డబ్బాలు వాయించేవారు. ఈమె 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది. అంతే కాకుండా ఈమె ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొంది. ఒక సన్నివేశంలో ఈమెను ఆంగ్లేయులు నిర్భంధించి, క్షమాపణ చెబితే విడిచి పెడతామనప్పుడు "నా కాలి గోరు కూడా అలా చేయదు" అని నిస్సంకోచంగా చెప్పిన ధైర్యవంతురాలు. ఒకసారి పెద్దాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మ అనే వ్యక్తి వన భోజనాల పేరుతో ఒక రాజకీయ సభ ఏర్పాటు చేసిందని, అందులో సుబమ్మ పాల్గొటుంటున్నట్లు ఆంగ్లేయ పోలీసులు తెలుసుకొని అక్కడ దాడి చేశారు. దీనికి సుబమ్మ ఆగ్రహించి వారిపై విరుచుకుపడింది, ఆమె ధైర్యానికి చూసి మిగిలిన వారు ధైర్యం తెచ్చుకొని మిగతా వారు బ్రిటిష్ రక్షక దళాలపై విరుచు పడ్డారు.

సుబ్బమ్మ మహాత్మా గాంధీ ఆదేశాలపై ఖద్దరు కట్టింది. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పింది, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసింది. రాజమండ్రిలో సనాతన స్త్రీవిద్యాలయం అనే బాలికల పాఠశాలను స్థాపించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఈమె అందరికి మిఠాయిలు పంచింది. ఈమె 16 సంవత్సరాల పాటు ఏ.ఐ.సి.సి. సభ్యురాలిగా ఉన్నారు. కాకినాడలో 1923లో జరిగిన కాంగ్రేసు సభలో ఈమెకు 'దేశ బాంధవి' అనే గౌరవం ఇచ్చారు.జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం, 1964 సంవత్సరం మే 31న ఈమె పరమపదించింది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-30. Retrieved 2013-03-12.

బయటి లింకులు మార్చు