కాకినాడ
కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా నగరం, జిల్లాకేంద్రం. ఇది భారత తూర్పుతీర ప్రాంతంలో ప్రముఖ ఓడరేవు కూడా. దగ్గరలోని కె.జి బేసిన్ లో చమురు అన్వేషణ, వెలికితీత కార్యకలాపాలవలన పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం. తిన్నటి విశాలమైన వీధులు, విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి గ్రంథాలయాలు, కళాశాలలు మొదలైన హంగులన్నీ దరిదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి.
కాకినాడ
కొరింగ, కొ-కెనడ, కాకి నందివాడ | |
---|---|
నగరం | |
Nickname(s): రెండవ మద్రాసు, ఫింఛనుదారుల స్వర్గం | |
Coordinates: 16°57′58″N 82°15′18″E / 16.96611°N 82.25500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రంkannA shivanageswararao | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ |
స్థాపన | 1759 |
పట్టణంగా గుర్తింపు | 1866 |
Government | |
• Type | నగర పాలక సంస్థ |
• Body | కాకినాడ నగరపాలక సంస్థ Kakinada Urban Development Authority (KAUDA) |
• మేయరు | సుంకర శివ ప్రసన్న[1] |
• శాసనసభ్యుడు(రాలు) | ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(పట్టణ) కురసాల కన్నబాబు(గ్రామీణ) |
• పార్లమెంటు సభ్యుడు(రాలు) | వంగా గీత |
Area | |
• నగరం | 30.51 km2 (11.78 sq mi) |
Population | |
• నగరం | 3,84,182 |
• Density | 13,000/km2 (33,000/sq mi) |
• Metro | 4,43,028 |
Demonym | కాకినాడోడు |
అక్షరాస్యత వివరాలు | |
• అక్షరాస్యత శాతం | 81.23% |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 533001, 533002, 533003, 533004, 533005, 533006, 533016 |
Area code | +91–884 |
వాహనాల నమోదు | AP05, AP06 (గతం) AP39 (2019 జనవరి 30 నుండి)[5] |
పేరు వ్యుత్పత్తి సవరించు
తొలిగా కాకి నందవాడ అనేపేరుగల ఈ ప్రాంతం డచ్ వలసప్రాంతంగా వుండేది.[6] వాళ్లు చీరల నిల్వ, ఎగుమతి స్థావరంగా వాడేవారు. చీరలను తెలుగులో కోక అంటారు కాబట్టి కోకనాడ అనే పేరువచ్చింది. [7] బ్రిటీషు వారి పాలనలో, తొలి కెనడా బాప్టిస్టు మిషన్ స్థాపించిన తరువాత కో-కెనడా అని పిలవబడిందనే సిద్ధాంతంకూడా వుంది. బ్రిటిషు వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకెనడా గానే ఉన్నాయి. ఉదాహరణ-కొకెనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జే ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వే స్టేషను క్లుప్తాక్షరాలు ( కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT).
దగ్గరలో కొరింగా నదికి ఓడరేవు వుండటం వలన కొరింగా అనే పేరు కూడా వాడబడింది. స్వాతంత్ర్యం తరువాత కాకినాడ అనే పేరు స్థిరపడింది.
కలియుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కోయిల రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించినందున, కాక అనే ఇక్ష్వాకు రాజు ఈ ఊరిని స్థాపించినందున, తీరంలో చేపలు పట్టే కాకులున్నందున పేరు వచ్చిందనే కథనాలున్నాయి .[8]
చరిత్ర సవరించు
కొన్ని ముఖ్య సంఘటనలు సవరించు
- 19వ శతాబ్దంలో కాటన్ ఆనకట్ట పూర్తయ్యి ధవళేశ్వరం – కాకినాడ కాలువ (బకింగ్ హామ్ కాలువ) వినియోగంలోకి వచ్చిన తర్వాత, కాకినాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1881నాటికి 17వేలుగా ఉన్న పట్టణ జనాభా, 1901 నాటికి 48వేలకి చేరి, సర్కారు జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఏర్పడి, మద్రాసు – కలకత్తా మధ్యలో అత్యంత భద్రమైన, అత్యుత్తమైన ఓడరేవుగా, రెండవ మద్రాసుగా పేర్కొనబడింది. నిజాం ఏలుబడిలోని బీరార్ ప్రాంతంనుండి, గోదావరి నదిమీద, భద్రాచలం మీదుగా, కాకినాడ ఓడరేవుకి జలరవాణా అధికమయ్యింది. ఒకానొక స్థాయిలో, కాకినాడ రాజధానిగా సర్కారు జిల్లాలని మద్రాసు ప్రెసిడెన్సీనుండి వేరుచేసి, మఱో ప్రెసిడెన్సీగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా బ్రిటీషువారు చేసుకున్నారు. (ఆ కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.) [9]
- 1923సంవత్సరంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సభలకు కాకినాడ వేదిక అయింది. ఎప్పటిలాగే, వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా, అప్పటి కాంగ్రెస్ ముస్లిం నాయకుడు మౌలానా ముహమ్మద్ అలీ జవహర్, అది ఇస్లాంకి వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేసారు.అయితే, వందేమాతరం కాంగ్రెస్ సంప్రదాయమని, తక్కిన పెద్దలందరూ నచ్చజెప్పడంతో ఆయన ఊరుకున్నాడు. వందేమాతరం గీతం పైన కొందరు ముస్లింలలో ఉన్న వ్యతిరేకతకి ఉదాహరణగా నిలిచిన తొలి ఘటనగా దీనిని పరిగణిస్తారు.[10]
- రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకవ్యక్తి మృతి చెందాడు.[11]
నైసర్గిక స్వరూపం సవరించు
కాకినాడ 16.53° ఉత్తర అక్షాంశం దగ్గర, 82.15° తూర్పు రేఖాంశం దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది. నగరం యొక్క సరాసరి వెడల్పు 6 కి.మీ కాగా, పొడవు 15 కి.మీలు. రాష్ట్ర రాజధాని అమరావతికి ఈశాన్యంగా 232 కి.మీ దూరంలో వుంది.
స్థూలంగా, నగరం రెండు ప్రాంతాలుగా ఉంటుంది. దక్షిణ ప్రాంతమైన జగన్నాధపురాన్ని, మిగిలిన నగరాన్ని విడదీస్తూ బకింగ్ హాం కాలువ ఉంటుంది. స్థానికంగా, దీనిని ఉప్పుటేరుగా పిలుస్తారు. డచ్ కోరమాండల్ వారి వలసల కాలంలో, జగన్నాధపురం, డచ్ ఈస్టిండియా కంపెనీకి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1734 సం. నుండి 1834 సం. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.
ఉత్తరం నుండి దక్షిణం వఱకూ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, నగరం యొక్క తూర్పు ప్రాంతాన్ని సముద్రతీరం నుండి వేరుచేస్తోంది. కాకినాడకి అగ్నేయంగా కాకినాడ అఖాతం ఉంది. ఈ ప్రాంతంలోని మడ అడవులు, భారతదేశంలో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానంలో వున్నాయి. ఇది కోరింగ అభయారణ్యానికి నెలవు. గోదావరికి పాయలలో ఒకటైన 'గౌతమి', నగరానికి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.
హోప్ ఐలాండ్ లంక సవరించు
కాకినాడ తీరంలో హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) 23 కి.మీ.ల మేర విస్తరించి ఉంది. తీర ప్రాంతం అంతా బంగాళా ఖాతపు ఆటుపోట్ల వలన కోతకు గురికాకుండా రక్షణగా వుంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండటానికి సహకరిస్తుంది.
జనాభా గణాంకాలు సవరించు
2011 భారత జనగణన ప్రకారం, కాకినాడ నగర జనాభా 3,84,182. దీనిలో 1,88,308 పురుషులు కాగా, 1,95,874 స్త్రీలు.[12] దేశంలో అధిక జనాభాగల నగరాలలో 115 వ స్థానంలో వుంది.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1871 | 17,839 | — |
1881 | 28,856 | +61.8% |
1891 | 40,553 | +40.5% |
1901 | 48,096 | +18.6% |
1911 | 54,110 | +12.5% |
1921 | 53,348 | −1.4% |
1931 | 69,952 | +31.1% |
1941 | 75,140 | +7.4% |
1951 | 99,952 | +33.0% |
1961 | 1,22,865 | +22.9% |
1971 | 1,64,200 | +33.6% |
1981 | 2,26,409 | +37.9% |
1991 | 2,79,875 | +23.6% |
2001 | 3,27,541 | +17.0% |
2011 | 3,84,182 | +17.3% |
పరిపాలన సవరించు
కాకినాడ నగరపాలక సంస్థ నగర పాలనను నిర్వహిస్తుంది.
రవాణా వ్యవస్థ సవరించు
రోడ్డు రవాణా సవరించు
జాతీయ రహదారి 216 నగరం గుండా పోతుంది. కాకినాడ ఓడరేవు, శివారు పారిశ్రామిక ప్రాంతాలైన వాకలపూడి, వలసపాకల, సామర్లకోట, పెద్దాపురం లను జాతీయ రహదారి 16కి అనుసంధానిస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో నిర్మించిన ఎడిబి రోడ్డు ఉంది.
విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ నుండి విశాఖపట్నం వరకూ, సముద్ర తీరం వెంబడి నాలుగు-ఆరు వరుసల రహదారిని నిర్మించే ప్రతిపాదన ఉంది.[13]
రైలు రవాణా సవరించు
కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట - కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉంది. కాకినాడ స్టేషనులలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషను పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడింది. చెన్నై - కోల్కతా రైలు మార్గంలో సామర్లకోట దగ్గర బండి మారి కాకినాడ చేరవచ్చు.
విమాన రవాణా సవరించు
కాకినాడకు 65 కి మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, పిఠాపురం వద్ద కార్గో రవాణా కోసమై మరో విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.[13]
జలరవాణా సవరించు
కాకినాడ ఓడరేవు మధ్యతరహా ఓడరేవు. జాతీయ జలమార్గం 4 కాకినాడను పుదుచ్చేరితో కలుపుతుంది.[7]
విద్యాసంస్థలు సవరించు
కాకినాడ లో కొన్ని ప్రముఖ విద్యా సంస్థలు:
- మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.
- పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. రఘుపతి వెంకటరత్నంనాయుడు, అబ్బూరి రామకృష్ణారావు వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు. పిఠాపురం రాజావారి కళాశాల అత్యంత ప్రాచీనమైన కళాశాలగా ప్రాముఖ్యత సంతంరించుకున్నది. ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పి.జి.విభాగాలలో అభ్యసించవచ్చును.
- జవాహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల. ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీలో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.
- భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ (Indian Institute of Information Technology) కి శంకుస్థాపన జరిగింది.[14]
- ఆంధ్రా పాలీటెక్నిక్
- మల్లాడి సత్య లింగ నాయకర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం (Andhra University - Post-graduate Extension Center)
- రంగరాయ వైద్య కళాశాల
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్, కు శంకుస్థాపన జరిగింది.[15]
- సీహార్స్ అకాడమీ ఆఫ్ మర్చంట్ నేవీ
- రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ సైన్స్
- పైడా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పటవాలా
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (Indian Institute of Information Technology - IIIT) ని నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది.[14]
వైద్య సౌకర్యాలు సవరించు
నగరంలో గల పెద్ద ఆసుపత్రులలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, అపోలో హాస్పిటల్స్, క్రిస్టియన్ కేన్సర్ హాస్పిటల్, కేర్ ఆసుపత్రి వున్నాయి.
ఆర్థిక వ్యవస్థ సవరించు
1940 ల వఱకూ కాకినాడ చుట్టుపక్కల పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. స్థానిక ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం, చేపల వేట పైననే ఎక్కువగా ఆధారపడి ఉండేది. 1980 లలో ఎరువుల కర్మాగారాలు స్థాపించిన తర్వాతి నుండి పరిశ్రమలు ప్రారంభమైనాయి. ఓడరేవు అందుబాటులో ఉండడం వలన, ఓడరేవు ఆధారిత పరిశ్రమల స్థాపన జరుగుతోంది
ఓడరేవు సవరించు
కాకినాడ తీరం నుండి 5 కి.మీ ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్, వలన కాకినాడ సహజసిద్ధమైన ఓడరేవు అయ్యింది. ప్రస్తుతం కాకినాడలో రెండు ఓడరేవులు పనిచేస్తున్నాయి.
- కాకినాడ లంగరు రేవు
- కాకినాడ డీప్ వాటర్ రేవు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవు తర్వాత రెండవ పెద్ద ఓడరేవు, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన మొదటి ఓడరేవు. ఇది కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహింపబడుతోంది. డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండి ఉన్న కాకినాడ లంగరు రేవు, భారతదేశంలోని 40 చిన్న ఓడరేవులలో అతిపెద్దది. సింగపూర్ కి చెందిన సెంబవాంగ్ షిప్ యార్డ్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లు సంయుక్తంగా, కాకినాడలో నౌకానిర్మాణకేంద్రాన్ని నిర్మిస్తున్నాయి.
కాకినాడ నుండి జరిగే ప్రధాన ఎగుమతులు; వ్యవసాయ ఉత్పత్తులు (వరి, గోధుమ, నూనెదినుసులు, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్), సముద్ర ఉత్పత్తులు (చేపలు, రొయ్యలు, పీతలు) . అంతేగాకుండా రసాయనాలు, ఇనుప ఖనిజం, సైబాక్టు, జీవ ఇంధనాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, వంటనూనెలు మొదలైనవి ప్రధాన దిగుమతులు.
ఇవి కాకుండా, విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం ప్రత్యేకంగా మఱో ఓడరేవుని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.[13]
పరిశ్రమలు సవరించు
ఎరువులు సవరించు
కోస్తా ఆంధ్రలో అత్యధికంగా యూరియా ఉత్పత్తి చేసే నాగార్జున ఎరువుల కర్మాగారం, కోరమాండల్ ఎరువుల కర్మాగారం ఉన్నాయి.
పంచదార సవరించు
మురుగప్ప గ్రూపువారి ఈద్ పారీ (ఇండియా), కేర్గిల్ ఇంటర్నేషనల సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం అయిన సిల్క్ రోడ్ సుగర్స్, 600, 000 టన్నుల సామర్థ్యం కలది. ఇది, ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమగల నగరం.[16]
పెట్రోలియం(రాతి చమురు) , సహజవాయువు సవరించు
ఓ.ఎన్.జీ.సీ సంస్థ యొక్క తూర్పుతీర క్షేత్రాలకు కేంద్రస్థానం కాకినాడ. బేకర్ హ్యుగెస్, స్లంబర్జర్ వంటి కంపనీలు కాకినాడ సముద్ర తీరంలోని చమురు క్షేత్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద సహజవాయు క్షేత్రంగా కృష్ణ-గోదావరి హరివాణం పేరుగాంచింది. ఓ.ఎన్.జి.సీ, జి.ఎస్.పీ.సి, రిలయన్స్ వంటి సంస్ఠలు నిర్వహించిన అన్వేషణ కార్యక్రమంలో విస్తారంగా సహజవాయు నిక్షేపాలు లభించాయి.
కాకినాడ నుండి 24 కి.మీ దూరంలో నున్న గాడిమొగ వద్ద రిలయన్స్, సముద్రంలో టర్మినల్ ను నిర్మించింది. కె.జి డి6 లో లభించిన సహజవాయుని శుద్ధిచేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్ పోర్టేషన్ లిమిటెడ్, కాకినాడ నుండి భరూచ్ (గుజరాత్) వఱకూ పైపులైన్లను నిర్మించింది. రోజుకి 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, కాకినాడ నుండి భారతదేశపు పశ్చిమ తీరానికి సరఫరా చేయబడుతోంది.
వంట నూనెలు , జీవ ఇంధనాలు సవరించు
2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి.[17]
విద్యుదుత్పత్తి సవరించు
ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం వున్నది. [18]
విద్యుత్తోపకరణాలు/ఎలక్ఱ్రానిక్స్ సవరించు
కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి విద్యుత్తోపకరణాలు/ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.[19]
సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐ.టి) సవరించు
ఆంధ్రప్రదేశ్ ఐ.టీ పరిశ్రమలో కాకినాడ ద్వితీయ శ్రేణి నగరంగా పరిగణింపబడుతోంది. 2007 సం.లో సాఫ్ట్ వేర్ టెక్నాలకీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఐ.టీ పార్కుని స్థాపించినప్పటి [20] నుండి, కాకినాడలో వివిధ ఐ.టీ కంపెనీలు పనిచేయడం ప్రారంభించాయి.
ఉభయ గోదావరి జిల్లాలోని ఐ.టీ కంపెనీల సంఘం అయిన "గోదావరి ఐ.టీ అసోసియేషన్" (GITA), కాకినాడ కేంద్రంగా పనిచేస్తోంది.[21] ఇందులో దాదాపు 35 కంపెనీలు ఉన్నాయి. 2012-13 సంవత్సరంలో కాకినాడ నుండి రూ 35 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతులలో హైదరాబాదు, విశాఖపట్నం తర్వాత కాకినాడది మూడో స్థానం.[22]
సంస్కృతి సవరించు
ఆహారం సవరించు
కోటయ్య కాజాలు, సుబ్బయ్య హోటలు లో సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే భోజనం కూడా ప్రసిద్ధి పొందినది.
పెద్ద దుకాణాలు సవరించు
చందన బ్రదర్స్, సర్పవరం జంక్షన్ లో స్పెన్సర్స్, ఎం అండ్ ఎం, రాజు భవన్, ఇంకా సోనా షాపింగ్ మాల్స్ వున్నాయి.
సమీప పర్యాటక ఆకర్షణలు సవరించు
- కోరింగ వన్యప్రాణి అభయారణ్యం
- ఉప్పాడ కడలివాక (బీచ్) (కాకినాడ నుండి 7 కి.మీ )
- హోప్ ఐలాండ్ లంక
- భావనారాయణస్వామి దేవస్థానం, సర్పవరం, కాకినాడ
- మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవాలయం (రావణబ్రహ్మ గుడి), ఉప్పాడ, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణునికి పుజాభిషేకాలు జరిగే ఏకైక ఆలయం.
- కుమారారామం, సామర్లకోట: పంచారామ క్షేత్రాలలో ఒకటి. (కాకినాడ నుండి 12 కి.మీ)
- గోలింగేశ్వర స్వామి ఆలయం, బిక్కవోలు
- పాండవుల మెట్ట, పెద్దాపురం (కాకినాడ నుండి 16 కి.మీ)
- సూర్యనారాయణస్వామి దేవస్థానం, గొల్లల మామిడాడ (కాకినాడ నుండి 20 కి.మీ)
- భీమేశ్వర స్వామి దేవస్థానం, ద్రాక్షారామ: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి, పంచారామ క్షేత్రాలలో ఒకటి. అమ్మవారి పేరు మాణిక్యాంబా దేవి. (కాకినాడ నుండి 25 కి.మీ)
- యానాం (కాకినాడ నుండి 26 కి.మీ)
- కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం, కోటిపల్లి (కాకినాడ నుండి 30 కి.మీ)
- శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, అన్నవరం (కాకినాడ నుండి 45 కి.మీ)
- తలుపులమ్మ లోవ, తుని దగ్గర, (కాకినాడ నుండి 55 కి.మీ)
చిత్ర మాలిక సవరించు
-
గాంధీనగర్ ఉద్యానవనంలో జాతిపిత విగ్రహం
-
కోరమాండల్ ఎరువుల కర్మాగారం
-
కాకినాడలో స్పెన్సర్స్
ప్రముఖ వ్యక్తులు సవరించు
- ప్రతివాది భయంకర వెంకటాచారి - విప్లవ ముద్దాయి. కాంగ్రెస్ వాది
- దేవులపల్లి కృష్ణశాస్త్రి - కవి
- చాగంటి కోటేశ్వరరావు - ఆధ్యాత్మిక ప్రవచన కర్త
- రేలంగి - నటుడు
- హరనాథ్ - నటుడు
- సూర్యకాంతం - నటి
- పి. బి. శ్రీనివాస్ - గాయకుడు
- ఓంకార్
- శ్రీను వైట్ల - సినీ దర్శకుడు
- బులుసు సోమయాజులు
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
- ↑ Naidu, T. Appala (26 October 2021). "Sunkara Siva Prasanna is new Kakinada Mayor". The Hindu.
- ↑ M. N., Samdani (12 May 2015). "Andhra Pradesh's move to supply Krishna water to Coca-Cola plant irks opposition". The Times of India (in ఇంగ్లీష్). Mangalagiri. Retrieved 25 May 2019.
- ↑ 3.0 3.1 3.2 "Kakinada Corporation". Archived from the original on 2020-02-18. Retrieved 2022-07-22.
- ↑ "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. p. 41. Retrieved 23 June 2016.
- ↑ "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
- ↑ srinivas, vadrevu (24 November 2015). "Dutch building in Kakinada cries for attention". Deccan Chronicle.
- ↑ 7.0 7.1 KUMAR, V. RISHI. "Kakinada: 'Pensioner's paradise' goes fishing for more". @businessline.
- ↑ "History". Official website of Kakinada Municipal Corporation. Retrieved 13 June 2016.[permanent dead link]
- ↑ "Descriptive and Historical Account of the Godavery District in The Presidency of Madras, By Henry Morris". Retrieved 2014-05-10.
- ↑ "A Fatwa against the Idea of India". www.rediff.com. Retrieved 2014-05-10.
- ↑ "October, 69 years ago, when Madras was bombed". The hindu. Retrieved 2014-05-09.
- ↑ "Kakinada Census 2011". Census 2011.
- ↑ 13.0 13.1 13.2 "Advantage Andhra Pradesh, Petroleum, Chemical & Petrochemical Investment region - PCPIR; Visakhapatnam - Kakinada Corridor" (PDF). Andhra Pradesh Industrial Infrastructure Corporation Ltd. Archived from the original (pdf) on 2015-02-26. Retrieved 7 May 2014.
- ↑ 14.0 14.1 "ఐఐఐటీ కి పల్లంరాజు శంకుస్థాపన". ది హిందూ. Retrieved 2014-05-09.
- ↑ "జిల్లాకు 'మెగా' పర్యాటక కళ". ఆంధ్ర ప్రభ. Retrieved 2014-05-10.[permanent dead link]
- ↑ ""EID Parry teams up with Cargill for sugar EoU", The Hindu (25 April 2006)". The Hindu. India. 25 April 2006. Archived from the original on 2012-10-26. Retrieved 10 May 2014.
- ↑ "Nikhil, Acalmar edible oil refineries go on stream". The Hindu. 29 March 2002. Retrieved 10 May 2014.
- ↑ "SPGL.co.in". SPGL.co.in. Archived from the original on 2014-05-17. Retrieved 10 May 2014.
- ↑ "Andhraelec.com". Andhraelec.com. Retrieved 17 August 2014.
- ↑ "Software Technology parks of India, Kakinda". www.kkd.stpi.in. Archived from the original on 2013-03-28. Retrieved 9 May 2014.
- ↑ "Kakinada zooms ahead as an IT hub-". The Times of India. India. 14 February 2011. Archived from the original on 2014-02-02. Retrieved 2014-05-09.
- ↑ "Kakinada making strides in IT industry". The hindu. Retrieved 2014-05-08.