నేతన్నకు చేయూత పథకం

నేతన్నకు చేయూత పథకం (తెలంగాణ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ థ్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీం) అనేది తెలంగాణ రాష్ట్ర నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.[1][2] రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా చేనేత పరిశ్రమలను జియో ట్యాగింగ్‌ ద్వారా ఎంపికచేసి, తెలంగాణ హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ థ్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీం కింద ఈ పథకం ద్వారా నిధులు పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా నేత కార్మికులు, డిజైనర్స్‌, డయ్యర్స్‌, వార్పింగ్‌, వైండింగ్‌, బ్లీచింగ్‌, రోలింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరుతున్నది. ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత లబ్ధిదారుడు, సంబంధిత ఏడీ పేరు మీద ఉమ్మడి అకౌంట్‌ను బ్యాంకులో ప్రారంభించాలి. ఇందులో ప్రభుత్వం తమ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచింది.[3]

నేతన్నకు చేయూత పథకం
తెలంగాణ ప్రభుత్వం రాజముద్ర
ప్రాంతంభూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని నేత కార్మికులు
స్థాపన2017, జూలై 24
నిర్వాహకులు

ఉద్దేశ్యం మార్చు

కార్మికులు తమ ఆదాయంలో 8 శాతం పొదుపు చేసుకుంటే, దానికి ప్రభుత్వం 16 శాతం పొదుపు చేసి మూడేళ్ళ తర్వాత మొత్తం సొమ్ము ఇస్తుంది. ఏ కారణం చేతనైనా ఉత్పత్తులు విక్రయించలేకపోవడంగానీ, నూలు దిగుమతి లేకపోవడంగానీ, మరమగ్గాలు పని చేయకపోవడం వల్లగానీ కార్మికులకు ఇబ్బందులు ఎదురైతే వాటిని అధిగమించడానికి ఈ థ్రిఫ్ట్‌ పథకం ఉపయోగపడుతుంది.[4]

ప్రారంభం మార్చు

  • తొలి విడుత: 2017 జూలై 24న యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లిలో ‘నేతన్నకు చేయూత’ పేరుతో ఈ థ్రిఫ్ట్‌ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించాడు.
  • రెండో విడుత: జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా 2022 ఆగస్టు 7న పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించాడు.[5]

అమలు మార్చు

కార్మికులు తమ పొదుపు సొమ్మును రికరింగ్‌ డిపాజిట్‌-1(ఆర్‌డీ-1)ఖాతాలో జమ చేయనుండగా నెలవారీగా ప్రభుత్వం వారి పేరుతో ఉన్న రికరింగ్‌ డిపాజిట్‌-2(ఆర్‌డీ-2)ఖాతాలో జమ చేస్తుంది. 36 నెలల తర్వాత పొదుపుతోపాటు ప్రోత్సాహకం అందజేస్తుంది.

ఈ పథకంలో భాగంగా తొలివిడుత చేనేత కార్మికులు నెలకు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలు జమచేసి మొత్తం 2 వేల రూపాయల ప్రోత్సాహకం అందిచింది. వారి కింద ఓ సహాయకుడు 600 రూపాయలు పొదుపు చేస్తే, ప్రభుత్వం మరో 600 రూపాయలు జమచేసి మొత్తం 1200 రూపాయల ప్రోత్సాహకం అందజేసింది.[4]

బడ్జెట్ వివరాలు మార్చు

పొదుపు, ఆర్థిక భద్రతతో కూడిన ఈ పథకం, మూడేళ్ళ కాల పరిమితిని కలిగివుంటుంది. తొలి విడుతలో 103 కోట్ల రూపాయలతో ఈ పథకం నిర్వహించబడింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత పథకానికి 368 కోట్ల రూపాయలు కేటాయించింది. మొదటి విడతగా 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 51వేల మందికి ఈ పథకం వర్తిస్తోంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "1 నుంచి 'నేతన్నకు చేయూత' నమోదు". EENADU. 2021-08-20. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.
  2. ABN (2021-08-30). "'నేతన్నకు చేయూత' పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.
  3. telugu, NT News (2021-09-14). "బీమా.. చేనేతకు ధీమా". www.ntnews.com. Archived from the original on 2021-09-22. Retrieved 2023-01-01.
  4. 4.0 4.1 telugu, NT News (2022-04-13). "చేనేతకు చేయూత". www.ntnews.com. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.
  5. Velugu, V6 (2021-08-07). "'నేతన్నకు చేయూత' ప్రారంభించిన మంత్రి కేటీఆర్". V6 Velugu. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)