బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి

బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి తెనాలిలో సాధన గ్రంథ మండలి స్థాపకుడు.

జీవిత విశేషాలు మార్చు

ఆయన అమలాపురం దగ్గర భట్నవిల్లిలో జన్మించారు. ఆయన బాల్యంలో పలకా బలపం పట్టలేదు. స్కూలుకు వెళ్లలేదన్నమాటేగాని, తండ్రి నేలపై రాయించిన అక్షరాభ్యాసంతోనే వేదం, తర్కం, వ్యాకరణ శాస్త్రాలను నేర్చుకున్నారు. ఆయన విజయనగరం మహరాజా కాలేజీ, కోవూరు కాలేజీ, తెనాలి కాలేజీల్లో విద్యాభ్యాసం చేసారు. మధూకరం, వారాలు చేసుకొంటూ ఉభయ భాషాప్రవీణ, విద్వాన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు. కృష్ణ యజుర్వేదం చదివి సంస్కృతంలో దిట్ట అనిపించుకొన్నారు. జ్యోతిష్యశాస్తాన్ని అధ్యయనం చేశారు. విభూతి, బాలకేసరి, తరణి, కృష్ణాపత్రికల్లో మాస, వారఫలాలు రాశారు.

ఉద్యోగ జీవితం మార్చు

తెనాలి సంస్కృత కళాశాలలో ఐదేళ్లు, తాలూకా ఉన్నత పాఠశాల బ్రాంచిలో 36 ఏళ్ల పనిచేసి 1912లో పదవీవిరమణ చేసారు. గోరఖ్‌పూర్లో ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రచురించే గీతాప్రెస్‌ను సందర్శించిన సందర్భంలో అదే తరహాలో గ్రంథప్రచురణకు నిర్ణయం తీసుకొన్నారు. 1945లో తెనాలిలో "సాధన గ్రంధమండలి" అనే సంస్థను ప్రారంభించారు. రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని తెలుగువారి ఆధ్యాత్మిక గ్రంథాల అవసరాలను "సాధన" తీరుస్తూ వచ్చింది. శంకర గ్రంథ రత్నావళి పేరుతో శంకర భగవత్పాదుల సమగ్ర సాహిత్యాన్ని తెలుగులో 17 సంపుటాలుగా తీసుకొచ్చారు. శంకరుల ప్రస్థాన త్రయంలోని భగవద్గీత శంకర భాష్యాన్ని మూడు భాగాలుగా తెచ్చారు. భారతదేశంలో శంకరాచార్య గ్రంథాలన్నీ ప్రచురించినది సూర్యప్రకాశశాస్త్రి ఒక్కరే అని అంటారు. హరినామ మహిమ శతకం, భగవత్ ప్రాప్తి, ఈశ్వర సాక్షా త్కారం, సప్త మహావ్రతము, సుందర భారతయాత్ర, గీతా ప్రతిభ, శ్రీరామపూజ, తులసీపూజ, శ్రీకృష్ణ బదరీయాత్ర, నేపాలయాత్ర, సప్త మహావ్రతములుతో సహా 800 పైగా ఆధ్మాత్మిక పుస్తకాలను రూపొందించారు. 107 సంవత్స రాల వయసులో కన్నుమూశారు.

మూలాలు మార్చు