రేనాటి చోళులు
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేనాటి చోళులకు విశేషమైన స్థానం కలదు [1].రేనాడు అని వ్యవహరింపబడిన (కడప మండలంలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు మండలంలోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు) దేశ విభాగాలలో తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడా అంటారు. సా. శ. 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు చోళవంశానికి చెందిన ఒక శాఖ ఈ ప్రాంతంలో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశంలుగా ఏర్పడ్డారు. 7వ శతాబ్దంలో పర్యటించిన హుఎన్ చాంగ్ ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశం 16వ శతాబ్దినాటికి ఉదయగిరి పెనుగొండ దుర్గాల మధ్య అధిక భాగం ఆక్రమించి ఉంది.

ఈ వంశీయులు వేయించిన శాసనాలు తెలుగుభాషలో నున్నవి. మొట్ట మొదట తెలుగుభాషలో శాసనాలు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కింది.వీరి శాసనాలలో ఆంధ్రభాష స్థానమాక్రమించి, ప్రాకృత ప్రభావితమై, తెలుగు భాష ప్రాథమిక దశను సూచించింది.ప్రాకృత పదాలతో కలిసియున్న తెలుగు పదాలు, వింతవింత రూపాలతో కనిపించి, ఆంధ్రభాషావికాసంను పరిణామంను సూచించును.వీరి శాసనాలలో ధనంజయుని కలమళ్ళ శాసనం మొదటి తెలుగు శాసనం సా.శ.575 లో వేయింపబడింది.
వీరి మొదటి నివాసమగు చోళనాడి తెలంగాణలోని నేటి నల్గొండ, మహబూబునగరు ప్రాంతమని కొందరి అభిప్రాయం.రేనాడు ఏడువేల దేశం.అనగా ఏడువేల గ్రామాలున్న దేశం.రేనాటిని పాలించిరి గావున వీరు రేనాటి చోళులు అయ్యారు.వీరి శాసనాల ప్రకారం వీరు కరికాల చోడుని సంతతివారని, సూర్యవంశీయులని, కాశ్యపగోత్రీయులని తెలిస్తుంది.కడప మండలము పాలించినవారు రేనాటి చోడులు.కాలక్రమానన వీరు పాకనాడను ఆక్రమించి చిన్న చిన్న కుటుంబాలుగా చీలి, రాజ్యాలను స్థాపించి పాలించారు.వీరిలో రేనాడు, పాత్తపినాడు, కొణిదెన, నెల్లూరు ప్రాంతాలను పాలించిన చోడవంశీయులు ప్రసిద్ధులు.
రాజధాని సవరించు
పుణ్యకుమారుని తిప్పలూరు శాసనం ప్రకారము వీరి రాజధాని కమలాపురం తాలూకాలోని పెదచెప్పలి. ఇచట ప్రాచీనకాలపు కోట చిహ్నాలు, తామ్రశాసనాలు, శిలాశాసనాలు దొరికాయి.
రాజవంశము సవరించు
రేనాటి చోళులు మొదట పల్లవరాజులకడ సామంతులుగా ఉండి స్వతంత్రులయ్యారు. శాసనాలను బట్టి కరికాలుని వంశంలో నందివర్మ (సా. శ. 550), అతని కుమారులు సింహవిష్ణు, సుందరనంద, ధనంజయవర్మ (సా. శ. 575), కడపటివానికి మహేంద్రవిక్రమ (సా. శ. 600), వానికి గుణముదిత, పుణ్యకుమార అను ఇద్దరు కొడుకులు పుట్టారు. పుణ్యకుమారుడు (సా. శ. 625) హిరణ్యరాష్ట్రం ఏలాడు. అతని తర్వాత కొడుకు విక్రమాదిత్య (సా. శ. 650), శక్తికుమారుడు (సా. శ. 675), రెండవ విక్రమాదిత్యుడు (సా. శ. 700), సత్యాదిత్యుడు, విజయాదిత్యుడు (సా. శ. 750) పాలించారు. సా. శ. 800లో శ్రీకంఠుడు రాజ్యం చేశాడు. దీనినిబట్టి రేనాటి చోళులు సా. శ. 550 నుండి సా. శ. 850 వరకు రాజ్యం చేశారని చెప్పవచ్చును.
పరిపాలనా విధానం సవరించు
రేనాటి చోడులు స్వతంత్రముగ కడప, చిత్తూరు మండలములను పాలించినను కొంతకాలము, విష్ణుకుండినులు కు, పల్లవులుకు చాళిక్యులుకు సామంతులుగా వ్యవహరించిరి.వీరి కాలమున ఆంధ్రదేశము సుభిక్షముగా నుండెను.వీరు సూర్యరాధాధికులు.చోడమహారాజు ఆజ్ఞగైకొని, సూర్యగ్రహణ నిమిత్తమున సూర్యునికి దేవాలయమును నిర్మించి, దేవ భోగారము కొంతభూమిని, ఒక గానుగును దానమిచ్చినట్లు చిలంకూరు శాసనమువలన తెలియుచున్నది.
వీరి కాలమున భూమిని న్రితుడ్లలూను, మఱుతుడ్లలోను కొలిచెడివారు.ప్రతీ వైశాఖ పున్నమిరోజు పండుగలు జరుపెడివారు.దేశము మండలములగను, విషయములుగను, గ్రామములగ విభజింపబడెను.గ్రామములందు రట్టొడ్లు లేదా రాట్టులు, లేక రెడ్లు ప్రాముఖ్యము వహించుచుండిరి.వీరు రైతులనందు పన్నును వశూలు చెసి రాజుకు ఇచ్చుచుండెరివారు.పొలములను చేను అనేవారు.
ఆకాలమున శాసనములను విశ్వబ్రాహ్మణులు అనగా పంచాణము వారిలో నొకరగు కమ్మరులు వ్రాయుచుండిరి.శాసనలేఖకుడిని శిల్పి అనిఅనెడివారు.బ్రాహ్మణులకుగాని దేవాలయములకుగాని ఇచ్చిన భూమిని పన్నశ అని పిలుచుచుండిరి.వీరి యుద్ధములలో ఒకరి నొకరు కత్తులతో పొడుచుకొని మరణించిన సంఘటనలు ఎక్కువుగా జరిగినట్లు శాసనములు తెలుపుచున్నవి.కొన్ని చోట్ల పురుషులకు కుళ్ళమ్మ అని పిలుచుచుండిరి.సేనాపతిని చమూపతి అంటారు.రాజు దైవాంశసంభూతుడని అప్పటి ప్రజల విశ్వాసము.చమూపతి, ధనాధ్యక్షుడు, మహామంత్రి, అమాత్యుడు మున్నగు వారు రాజ్యమునకు అధికారులు.ముఖ్యమైన ఉద్యోగులకు దుగరాజు అను బిరుదు గలదు. క్రింది ఉద్యోగులలో పేరుల చివర 'కాలు' అను పదము ఉంది. రేవణకాలు, పుద్దనకాలు, ఎడ్లకాలు, చేలకాలు, తరట్లకాలు ఉదాహరణలు.
స్త్రీలు కరాభరణములు, ముక్కరలు, కొప్పులకు పూలు, కంకణములు ధరించుచుండిరి.వివాహములు సాధారణముగా నాలుగు రోజులు జరుగు చుండెను.ప్రజలలో వినోద ప్రదర్శనలను ప్రోత్సహించు వారుండిరి.ఆకలమున వాడుకలో నున్న కోడి పందెములు, మేషమహిషయుద్ధములు, పండుగలు, ఏరువాకపున్నమువంటి పండుగలు ప్రజావినోదముల్గా పరిగణింపబడుచుండెను.
విశేషాలు సవరించు
కరికాలుని సంతతికిచెందిన వీరు కావేరీతీరమునగల చోళవంశమువారు. ధనంజయవర్మకు పూర్వమే వీరు తెలుగు దేశానికి వలస వచ్చిఉంటారు. కమలాపురం తాలూకాలో కలమళ్ళ గ్రామంలో ధనంజయవర్మ వేయించిన శిలాశాసనం వారి వంశపువారికే మొదటిదిగాక తెలుగు భాషకే మొదటి వాక్యరచనయై ఉంది. పగిలిఉన్న శిలాభాగములో "ఎరికల్ ముతురాజు ధనుంజయుడు రేణాండు ఏళన్" అనే వాక్య భాగము పూర్తి అర్థమిస్తున్నది. ‘ఎరికల్ ముతురాజు’ అనేది ఒక బిరుదు. లిపిని బట్టి శాసనము ఆరవ శతాబ్దము రెండవ సగము నాటిదని చెప్పుదురు.
రేనాటి చోళులు కాలమున తటాకములు నిర్మింపబడి కాలువులు త్రవ్వింపబడినవి.చెరువులు, కాలువలు త్రవ్వుట హిందూమత సంప్రదాయము ప్రకారము సప్తసంతాన ప్రతిష్ఠలలో చేరునని వీరు అభిప్రాయము.రాజులు వ్యవసాయాభివృద్ధికి కృషిచేయుచుండిరి.దేవభోగములకు బ్రాహ్మణులకు ఇచ్చిన భూమిపై పన్ను ఉండేదికాదు.
వీరి కాలమున వైదికమతము వృద్ధిచెందినట్లు తెలియుచున్నది.యజ్ఞయాగాదులకు ప్రాముఖ్య ఇచ్చినట్లు ఉంది. ఈ కాలమున శైవ మతము ఆంధ్రదేశమున వ్యాపించింది. సూర్యారాధన ఆనాడు విశేషవ్యాప్తిలోనుండెను.గ్రామాధికారులగు రెడ్లు దేవాలయములను నిర్మించెడివారు.
జైనబుద్ధ మతములనాదరించు ప్రజలు, ఆమత సన్యాసుల ప్రవర్తనలననుసరించు చుండిరి.జైన మతముందేర్పడిన కాపాలిక జైన విభాగమున జైనపాలికుల మధుమాంస భక్షణము, కాపాలిక స్త్రీలతో వ్యవహారము, ప్రజలలో సంచలనము బయలు దేరినది.వజ్రయాన బౌద్ధమత విభాగము వలన, బౌద్ధ సన్యాసుల యొక్కయు, సన్యాసినుల యొక్కయు అవధులు లేని ప్రవర్తన ప్రజలలో అసహ్యము కలిగించి వైదిక మతము వైపు వారి మనస్సులను మరల్చినవి.ఇది శైవ విజృంభణకు దోహదమైనది.
రేనాటి చోళులు పాలించిన కాలమున ఆంధ్ర వాజ్మయము ఆరంభదశలో నుండెను. తెలుగు పద్యములను పోలిన పద్యములు వీరి శాసనములందు కనిపించినను అవి గణ యతి ప్రాస నియమరహితముగ నున్నవి.ఇవి గద్యమయములు.ఇందు వృత్తగంధివాక్యము లున్నవి.
ఈకాలపు శాసనములందు ఫలశ్రుతి ఒకేవిధముగా ఉంది. దానమును కాచినవారికి అశ్వమేధ యాగము ఫలమును, వక్రము చేసినవారికి వారణాసిలో బ్రాహ్మణులను, కపిలగోవులను చంపిన పాపము కలుగునని చెప్పిరి.ఫలశృతి అనంతరము ఆజ్ఞప్తి కర్తృ లేఖకుల పేళ్ళు శాసనమున చేర్చబడెను.
ప్రొద్దుటూరి దగ్గర పెన్నానది ఒడ్డున రామేశ్వరాలయమును "పోర్ముఖరామ" అను బిరుదు గల పుణ్యకుమారుడు కట్టించాడు.
మూలాలు సవరించు
- భారతి మాస పత్రిక 1968 -వ్యాసం రేనాటి చోళుల నాటి ఆంధ్ర సాంఘిక చరిత్ర- వ్యాస కర్త శ్రీ.బి.ఎన్.శాస్త్రి
- ↑ విజ్ఞాన సర్వస్వము, సంపుటము ఒకటి, దేశము-చరిత్ర, 1990, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు