లాల్‌జాన్ బాషా

(లాల్ జాన్ బాషా నుండి దారిమార్పు చెందింది)

లాల్‌జాన్ బాషా (ఆగస్టు 2, 1956 - ఆగష్టు 15, 2013) ఒక రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. 1984లో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1991లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ రాజకీయవేత్త ఎన్.జి.రంగాను ఓడించారు. తరువాత ఆయన భారత పార్లమెంట్ ఎగువసభ అయిన రాజ్యసభ సభ్యునిగా కూడా ఓసారి పనిచేశారు. లాల్ జాన్ భాషా గుంటూరులో కీలకమైన నాయకుడుగా గుర్తింపుపొందారు.[1]

ఎస్.ఎం.లాల్‌జాన్ బాషా
జననంఆగస్టు 2, 1956
మరణంఆగష్టు 15 , 2013
నల్గొండ జిల్లా, నార్కెట్‌పల్లి
మరణ కారణంరోడ్డు ప్రమాదం
ఇతర పేర్లులాల్‌జాన్ బాషా
ప్రసిద్ధితెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షులు
రాజ్య సభ సభ్యులు
మతంఇస్లాం (ముస్లిం)

జీవిత సంగ్రహం మార్చు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గుంటూరు మాజీ ఎంపీ లాల్‌ జన్‌ బాషా ఆగస్టు 2, 1956గుంటూరు జిల్లాల్లో జన్మించారు. బాషాకు 1977లో వివాహం జరిగింది. ఆయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.కుటుంబం అంటే ఆయనకు బాగా ఇష్టం. అందుకే తరచూ తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో గడుపుతుంటారు. ఇనుము వ్యాపారి అయిన బాషా, ఎన్టీఆర్‌ హయాంలో టిడిపిలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1991లో గుంటూరులో ఎన్.జి.రంగా పై గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి బాషా రికార్డు సాధించారు.ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా బాషాకు గుర్తింపు ఉంది. అయితే తదుపరి 1996, 98లో గుంటూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి రాయపాటి సాంబశివరావు చేతిలో ఓటమి చెందారు. 1999లో నరసారావుపేట నుంచి పోటీ చేసి నేదురుమల్లి జనార్థనరెడ్డి చేతిలో ఓటమి పొందారు. బాషా ఎన్నడూ తెలుగుదేశం పార్టీని వీడలేదు. పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాలలో, సంస్థాగత వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి 2002లో చంద్రబాబు ఆయనను రాజ్యసభ సభ్యునిగా నియమించారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు[2]. పొలిట్‌బ్యూరో సభ్యులుగా పార్టీ ప్రధాన కార్యదర్శి, మర్కంటైల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా, టిడిపి మైనార్టీ విభాగ ఛైర్మన్‌గా బాషా పనిచేశారు. దేశంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, విదేశాంగ విధానంపైన, వివిధ వర్గాల ప్రజల కష్టాలపై బాషా లోక్‌సభలో, రాజ్యసభ సభల్లో తన వాణిని వినిపించారు. సౌదీలో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. మహిళల సంక్షేమం కోసం తెలుగుదేశం హయాంలో అమలుచేసిన దీపం పథకం రూపకల్పనలో కూడా బాషా ముఖ్యపాత్ర పోషించారు. టిడిపి ఇటీవల ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్‌ను రూపొందించడంలో బాషా ముఖ్య భూమిక పోషించారు. మైనార్టీల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించడంతో పాటు పెద్ద దిక్కుగా నిలిచారు.

మరణం మార్చు

ఆగస్టు 15, 2013, గురువారం నాడు హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతుండగా, నల్గొండ జిల్లా, నార్కెట్‌పల్లి సమీపంలో కామినేని ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లాల్ జాన్ బాషా మృతి చెందారు. నల్గొండ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు కామినేని ఆసుపత్రి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాషా మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. లాల్ జాన్ మృతదేహాన్ని నల్లగొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి చెబుతున్నారు. వర్షం పడుతుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే మరో వాహనం ఢీకొట్టడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని కొందరు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.[3]

సంతాపం మార్చు

బాషా మృతి చెందిన వార్త తెలియగానే నకిరేకల్ శాసన సభ్యులు తిరుమర్తి లింగయ్య, టీడీపీ నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు.అయితే లాల్ జాన్ బాషా మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆ పార్టీ నేతలు బాషా మృతికి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. బాషా మృతితో గుంటూరు జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఓ మంచి నేతను కొల్పోయిందని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి తన సంతపం ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చూడండి మార్చు

సూచికలు మార్చు

  1. Sakshi (16 August 2013). "టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం". Sakshi. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  2. లాల్ జాన్ బాషా గూర్చి సాక్షి లో
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-09-05. Retrieved 2013-09-02.

బయటి లింకులు మార్చు