వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 26వ వారం

మైసూరు సామ్రాజ్యం

మైసూరు రాజ్యం దక్షిణ భారతదేశంలోని రాజ్యం. దీన్ని 1399లో ఆధునిక మైసూరు నగరానికి సమీపంలో స్థాపించారని భావిస్తారు. 1799 నుండి 1950 వరకు, ఇది ప్రత్యేక రాజ్యంగా, సంస్థానంగా ఉండేది. 1947 వరకు బ్రిటిషు ఇండియాతో అనుబంధ కూటమిలో ఉండేది. 1831లో బ్రిటిషు వారు రాచరిక సంస్థానాలపై ప్రత్యక్ష నియంత్రణను చేపట్టినపుడు ఇది మైసూరు సంస్థానంగా మారింది. ఆ తరువాత విస్తరించబడి కర్ణాటకగా పేరు మార్చబడింది. మైసూరు పాలకుడు 1956 వరకు రాజప్రముఖ్‌గా కొనసాగాడు. ఆ తరువాత కర్ణాటక రాష్ట్రానికి మొదటి గవర్నర్ అయ్యాడు. ఇది ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. 17వ శతాబ్దంలో రాజ్యం బాగా విస్తరించింది. నరసరాజ వడయార్ I, చిక్క దేవరాజ వడయార్‌ల పాలనలో రాజ్యం, దక్కన్‌ పీఠభూమి దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యంగా మారింది. ఇప్పటి దక్షిణ కర్ణాటక, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలు ఈ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. కొద్దికాలం పాటు సాగిన ముస్లిం పాలనలో, ఈ సామ్రాజ్యం సుల్తానేట్ పరిపాలనా శైలికి మారింది. మైసూరు రాజ్యానికి మరాఠాలు, హైదరాబాద్ నిజాం, ట్రావెన్‌కోర్ రాజ్యం, బ్రిటిషు వారితో ఘర్షణలు ఉండేవి. నాలుగు ఆంగ్లో-మైసూరు యుద్ధాలతో ఈ ఘర్షణలు ముగిసాయి. మొదటి ఆంగ్లో - మైసూరు యుద్ధంలో మైసూరు రాజ్యం విజయం సాధించగా, రెండవ దానిలో ఫలితం తేలలేదు. మూడవ, నాల్గవ యుద్ధాలలో పరాజయాల పాలైంది. శ్రీరంగపట్నం ముట్టడిలో (1799) జరిగిన నాల్గవ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత, అతని రాజ్యంలోని పెద్ద భాగాలు బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దక్షిణ భారతదేశంపై మైసూరు ఆధిపత్యం ముగిసింది. బ్రిటిషు వారు సైన్య సహకార ఒప్పందం ద్వారా వడయార్లను సింహాసనంపై తిరిగి ప్రతిష్ఠించారు. క్షీణించిన మైసూరు రాజ్యం రాచరిక సంస్థానంగా మారింది. 1947 లో భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు వడయార్లు రాష్ట్రాన్ని పాలించారు. ఆ తరువాత మైసూరు భారత యూనియన్‌లో చేరింది.
(ఇంకా…)