మైసూరు సామ్రాజ్యం

భారతదేశంలో చారిత్రక రాష్ట్రం

మైసూరు రాజ్యం దక్షిణ భారతదేశంలోని రాజ్యం. దీన్ని 1399లో ఆధునిక మైసూరు నగరానికి సమీపంలో స్థాపించారని భావిస్తారు. 1799 నుండి 1950 వరకు, ఇది ప్రత్యేక రాజ్యంగా, సంస్థానంగా ఉండేది. 1947 వరకు బ్రిటిషు ఇండియాతో అనుబంధ కూటమిలో ఉండేది. 1831లో బ్రిటిషు వారు రాచరిక సంస్థానాలపై ప్రత్యక్ష నియంత్రణను చేపట్టినపుడు [1] ఇది మైసూరు సంస్థానంగా మారింది. ఆ తరువాత విస్తరించబడి కర్ణాటకగా పేరు మార్చబడింది. మైసూరు పాలకుడు 1956 వరకు రాజప్రముఖ్‌గా కొనసాగాడు. ఆ తరువాత కర్ణాటక రాష్ట్రానికి మొదటి గవర్నర్ అయ్యాడు.

మైసూరు సామ్రాజ్యం
పైన: వడయారు రాజుల పతాకం (1399-1761)(1799-1948) దిగువ: హైదరాలీ, టిపు ల పతాకం (1761-1799)
Anthem: కాయో శ్రీగౌరి
(1868–1948)
Location of మైసూరు
Capitalమైసూరు, శ్రీరంగపట్నం
Official languages కన్నడ
Government రాచరికం

హిందూ ఒడయార్ కుటుంబం స్థాపించిన, పాలించిన మైసూరు రాజ్యం, ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. 17వ శతాబ్దంలో రాజ్యం బాగా విస్తరించింది. నరసరాజ వడయార్ I, చిక్క దేవరాజ వడయార్‌ల పాలనలో రాజ్యం, దక్కన్‌ పీఠభూమి దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన రాజ్యంగా మారింది. ఇప్పటి దక్షిణ కర్ణాటక, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలు ఈ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. కొద్దికాలం పాటు సాగిన ముస్లిం పాలనలో, ఈ సామ్రాజ్యం సుల్తానేట్ పరిపాలనా శైలికి మారింది.[2] [3]

మైసూరు రాజ్యానికి మరాఠాలు, హైదరాబాద్ నిజాం, ట్రావెన్‌కోర్ రాజ్యం, బ్రిటిషు వారితో ఘర్షణలు ఉండేవి. నాలుగు ఆంగ్లో-మైసూరు యుద్ధాలతో ఈ ఘర్షణలు ముగిసాయి. మొదటి ఆంగ్లో - మైసూరు యుద్ధంలో మైసూరు రాజ్యం విజయం సాధించగా, రెండవ దానిలో ఫలితం తేలలేదు. మూడవ, నాల్గవ యుద్ధాలలో పరాజయాల పాలైంది. శ్రీరంగపట్నం ముట్టడిలో (1799) జరిగిన నాల్గవ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తరువాత, అతని రాజ్యంలోని పెద్ద భాగాలు బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దక్షిణ భారతదేశంపై మైసూరు ఆధిపత్యం ముగిసింది. బ్రిటిషు వారు సైన్య సహకార ఒప్పందం ద్వారా వడయార్లను సింహాసనంపై తిరిగి ప్రతిష్ఠించారు. క్షీణించిన మైసూరు రాజ్యం రాచరిక సంస్థానంగా మారింది. 1947 లో భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు వడయార్లు రాష్ట్రాన్ని పాలించారు. ఆ తరువాత మైసూరు భారత యూనియన్‌లో చేరింది.

చరిత్ర మార్చు

ప్రారంభ చరిత్ర మార్చు

 
మైసూరు రాజ్యం (1704) రాజు చిక్క దేవరాజ వడయార్ పాలనలో

రాజ్య చరిత్రకు సంబంధించిన మూలాధారాలు అనేక శిలా శాసనాలు, రాగి ఫలక శాసనాలు, మైసూరు ప్యాలెస్ లోని రికార్డులు, కన్నడ, పర్షియన్, ఇతర భాషలలోని సమకాలీన సాహిత్య మూలాలలో లభిస్తున్నాయి. [4] [5] [6] సాంప్రదాయిక కథనాల ప్రకారం, ఈ రాజ్యం ఆధునిక మైసూరు నగరం చుట్టుపట్ల ఒక చిన్న రాజ్యంగా ఉద్భవించింది. ఇద్దరు సోదరులు యదురాయ (విజయ అని కూడా పిలుస్తారు), కృష్ణరాయలు దీన్ని స్థాపించారు. వారి మూలాల గురించి అనేక ఐతిహ్యాలు ఉన్నప్పటికీ యదార్థం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. కొంతమంది చరిత్రకారులు ద్వారక నుండి వచ్చారని సూచిస్తారు, [7] [8] మరికొందరు కర్ణాటక లోని వారేణని అంటారు. [9] [10] యదురాయ స్థానిక యువరాణి చిక్కదేవరసిని పెళ్ళి చేసుకున్నాడని, "వడయార్" అనే బిరుదును స్వీకరించాడు. ఆ పేరే రాజవంశానికి వచ్చింది. [11] విజయనగర రాజు అచ్యుత దేవ రాయ (1529–1542) పాలన నుండి 16వ శతాబ్దపు కన్నడ సాహిత్యంలో వడయార్ కుటుంబం గురించిన తొలి స్పష్టమైన ప్రస్తావన ఉంది. వడయార్‌లు స్వయంగా జారీ చేసిన తొలి శాసనం 1551లో తిమ్మరాజా II పాలన నాటిది. [12]

స్వయంప్రతిపత్తి: ముందడుగు, వెనకడుగులు మార్చు

తరువాత వచ్చిన రాజులు 1565లో విజయనగర సామ్రాజ్యం క్షీణించే వరకు సామంతులుగానే పాలించారు. ఈ సమయానికి, రాజ్యం 300 మంది సైనికులతో ముప్పై మూడు గ్రామాలకు విస్తరించింది. [13] తిమ్మరాజా II చుట్టుపక్కల ఉన్న కొన్ని రాజ్యాలను జయించాడు. [14] ఆ కాలపు రాజుల్లో ఎంతో కొంత రాజకీయ ప్రాముఖ్యత పొందిన బోలా చామరాజా IV విజయనగర చక్రవర్తి అరవీడు రామరాయలకు కప్పం కట్టడాన్ని ఆపేసాడు. [15] అళియ రామరాయల మరణం తరువాత, వడయార్‌లు తమను తాము మరింత బలపరచుకోవడం ప్రారంభించారు. రాజా వడయార్ I, శ్రీరంగపట్నంలో విజయనగర సామ్రాజ్యపు మహామండలేశ్వరుడైన అరవీడు తిరుమల నుండి శ్రీరంగపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానికి, అప్పట్లో చంద్రగిరి నుండి విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న వెంకటపతి రాయల మౌన అంగీకారం ఉంది. [16] రాజా వడయార్ I పాలనలో జగ్గదేవ రాయ [16] [17] నుండి ఉత్తరాన చన్నపట్నాన్ని విలీనం చేయడంతో సామ్రాజ్య విస్తరణ కూడా జరిగింది. దీంతో మైసూరు‌ ప్రాంతీయ రాజకీయ శక్తిగా మారింది. [18] [19]

పర్యవసానంగా, 1612-13 నాటికి, వడయార్లు చాలా స్వయంప్రతిపత్తి సాధించారు. వారు అరవీడు రాజవంశం యొక్క నామమాత్రపు ఆధిపత్యాన్ని అంగీకరించినప్పటికీ, చంద్రగిరికి కప్పం కట్టడం ఆపేసారు. ఇది 1630ల వరకు చంద్రగిరి చక్రవర్తులకు కప్పం కడుతూ వచ్చిన తమిళ నాయక రాజూలకు ఇది భిన్నంగా ఉంది. [16] చామరాజా VI, కంఠీరవ నరసరాజు I ఉత్తరం వైపున మరింత విస్తరించడానికి ప్రయత్నించారు. అయితే బీజాపూర్ సుల్తానేట్, దాని మరాఠా సామంతులూ వారిని అడ్డుకున్నారు. రణదుల్లా ఖాన్ ఆధ్వర్యంలోని బీజాపూర్ సైన్యాలు 1638 శ్రీరంగపట్నాన్ని ముట్టడించినపుడు మైసూరు రాజ్యం వారిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. [19] [20] రాజ్య విస్తరణ దక్షిణాదిన తమిళ దేశం వైపు దృష్టి సారించింది. అక్కడ నరసరాజ వడయార్ సత్యమంగళాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతని వారసుడు దొడ్డా దేవరాజ వడయార్ మదురై అధిపతులను విజయవంతంగా ఓడించిన తర్వాత పశ్చిమ తమిళ ప్రాంతాలైన ఈరోడ్, ధర్మపురిని స్వాధీనం చేసుకుని మరింత విస్తరించారు. మల్నాడు కేలాడి నాయకుల దండయాత్రను కూడా విజయవంతంగా ఎదుర్కొన్నారు. 1670లలో మరాఠాలు, మొఘలులు దక్కన్‌లోకి ప్రవేశించినప్పుడు, ఈ కాలం సంక్లిష్టమైన భౌగోళిక-రాజకీయ మార్పులను చూసింది. [19] [20]


చిక్క దేవరాజు (r. 1672–1704), మైసూరు రాజులలో అత్యంత ప్రముఖుడు. అతను అత్యవసర పరిస్థితులను తట్టుకోవడమే కాకుండా భూభాగాన్ని మరింత విస్తరించగలిగాడు. అతను మరాఠాలు, మొఘలులతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకోవడం ద్వారా దీనిని సాధించాడు. [21] [22] తూర్పున సేలం, బెంగుళూరు, పశ్చిమాన హాసన్, ఉత్తరాన చిక్కమగళూరు, తుమకూరు, దక్షిణాన మిగిలిన కోయంబత్తూర్‌లతో అతని రాజ్యంలో భాగాలయ్యాయి. [23] ఈ విస్తరణ జరిగినప్పటికీ, పశ్చిమ కనుమల నుండి కోరమాండల్ మైదానపు పశ్చిమ సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న దక్షిణ భారత హృదయ భూభాగంలో అధిక భాగం భూమిని కలిగి ఉన్నప్పటికీ మైసూరు రాజ్యం, తీరప్రాంతం లేకుండా భూపరివేష్టితంగానే ఉంది. దీనిని పరిష్కరించడానికి చిక్క దేవరాజు చేసిన ప్రయత్నాలు మైసూరు‌ని ఇక్కేరి <i id="mwpg">నాయకా</i> నాయకులు, కొడగు (ఆధునిక కూర్గ్) రాజులతో విభేదాలకు దారితీశాయి. [24] ఈ వివాదం మిశ్రమ ఫలితాలను తెచ్చిపెట్టింది - పెరియపట్నాన్ని మైసూరు స్వాధీనం చేసుకోగా, పలుపారే వద్ద తిరోగమనాన్ని చవిచూసింది. [25]

హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల పాలన మార్చు

 
అడ్మిరల్ సఫ్రెన్ 1783లో మిత్రుడైన హైదర్ అలీతో సమావేశం. JB మోరెట్ చెక్కడం, 1789
 
బెంగళూరు కోట ప్రవేశ ద్వారం వద్ద మైసూరు సుల్తానేట్ జెండా

హైదర్ అలీ తన పోరాట పటిమతో, పరిపాలనా చతురతతో కర్ణాటక చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. [26] [27] ఉపఖండంలో ముఖ్యమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్న సమయంలో హైదర్ ఎదిగాడు. యూరోపియన్ శక్తులు వ్యాపార సంస్థల నుండి రాజకీయ శక్తులుగా మారడంలో నిమగ్నమై ఉండగా, మొఘలుల సుబేదార్‌గా ఉన్న నిజాం, దక్కన్‌లో తన విస్తరణను సాగించాడు. పానిపట్‌లో ఓటమి తరువాత మరాఠాలు దక్షిణాన సురక్షితమైన స్థలాల కోసం వెతుక్కున్నారు. ఈ కాలంలో కర్నాటిక్‌పై నియంత్రణ కోసం బ్రిటిషు‌తో ఫ్రెంచివారు పోటీ పడ్డారు. ఈ పోటీలో సర్ ఐర్ కూట్ నేతృత్వం లోని బ్రిటిష్ వారు 1760లో జరిగిన వాండివాష్ యుద్ధంలో కామ్టే డి లాలీ ఆధ్వర్యంలోని ఫ్రెంచివారిని నిర్ణయాత్మకంగా ఓడించి విజయం సాధించారు. భారతదేశ చరిత్రలో దక్షిణాసియాలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసింది. [28] ఈ కాలంలో వడయార్లు మైసూరు‌కు నామమాత్రపు అధిపతులుగా ఉన్నప్పటికీ, నిజమైన అధికారం హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు చేతుల్లో ఉండేది. [29]

1761 నాటికి, మరాఠా శక్తి క్షీణించింది. 1763 నాటికి, హైదర్ అలీ కేలాడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బిల్గి, బెద్నూర్, గుత్తి పాలకులను ఓడించాడు. దక్షిణాన మలబార్‌పై దండెత్తాడు. 1766లో జామోరిన్ రాజధాని కాలికట్‌ను సులభంగా స్వాధీనం చేసుకున్నాడు. ఉత్తరాన ధార్వాడ్, బళ్లారి వరకు మైసూరు రాజ్యం విస్తరించింది. [30] [31] మైసూరు ఇప్పుడు ఉపఖండంలో ప్రధాన రాజకీయ శక్తిగా మారింది. అంతగా గుర్తింఔ లేని స్థాయిని నుండి మెరుపులా ఎగసిన హైదర్ ధిక్కారం, భారత ఉపఖండంపై బ్రిటిష్ ఆధిపత్యానికి నిలిచి ఉన్న చివరి సవాలుగా మారింది. ఈ సవాలును అధిగమించడానికి బ్రిటిషు వారికి మూడు దశాబ్దాలకు పైగా సమయం పట్టింది. [32]


హైదర్ ఎదుగుదలను నిరోధించే ప్రయత్నంలో, బ్రిటిషు వారు మరాఠాలు, గోల్కొండ నిజాంతో కూటమిని ఏర్పరచుకున్నారు. ఇది 1767లో మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధంతో ముగిసింది. సంఖ్యాపరంగా ఆధిక్యత ఉన్నప్పటికీ హైదర్ అలీ, చెంగం, తిరువణ్ణామలై యుద్ధాలలో ఓడిపోయాడు. హైదర్ అలీ తన సైన్యాన్ని వ్యూహాత్మకంగా మద్రాసుకు ఐదు మైళ్ల లోపు వరకూ నడిపే వరకు బ్రిటిషు వారు అతని శాంతి ప్రస్తావనలను పట్టించుకోలేదు. [28] [31] [33] 1770లో, మాధవరావు పేష్వా యొక్క మరాఠా సైన్యాలు మైసూరు‌పై దండెత్తినప్పుడు (హైదర్‌పై మాధవరావు 1764, 1772 మధ్య మూడు యుద్ధాలు చేశాడు. వీటిలో హైదర్ ఓడిపోయాడు), 1769 ఒప్పందం ప్రకారం బ్రిటిషు మద్దతును హైదర్ ఆశించాడు. అయితే వారు అతనికి ద్రోహం చేశారు. బ్రిటిషు ద్రోహం, హైదర్ యొక్క తదుపరి ఓటమితో బ్రిటిషు వారిపై హైదర్‌కున్న అపనమ్మకాన్ని బలపరిచింది. ఇదే భావాన్ని అతని కుమారుడూ ఏర్పరచుకున్నాడు. ఇది రాబోయే మూడు దశాబ్దాల ఆంగ్లో-మైసూరు వైరానికి కారణమైంది. 1777 లో హైదర్ అలీ, గతంలో కోల్పోయిన కూర్గ్, మలబార్ ప్రాంతాలను మరాఠాల నుండి తిరిగి సాధించాడు. [34] హైదర్ అలీ సైన్యం మరాఠాల వైపు ముందుకు సాగి, సౌన్షి యుద్ధంలో వారితో పోరాడి విజయం సాధించింది. [34]

1779 నాటికి, హైదర్ అలీ దక్షిణాన ఆధునిక తమిళనాడు, కేరళల లోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నాడు. రాజ్యం దాదాపు 2,05,000 కిమీ2 కు విస్తరించింది. [31] 1780లో, అతను ఫ్రెంచి వారితో స్నేహం చేసి మరాఠాలు, నిజాంతో శాంతిని నెలకొల్పాడు. [35] అయితే, మరాఠాలు, నిజాం హైదర్ అలీకి ద్రోహం చేశారు, వారు బ్రిటిష్ వారితో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. 1779 జూలైలో, హైదర్ అలీ 80,000 మంది సైన్యంతో రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధాన్ని ప్రారంభించాడు. హైదర్ అలీ బ్రిటిషు వారికి వ్యతిరేకంగా కొన్ని ప్రారంభ విజయాలు సాధించాడు. ఐర్ కూట్ వచ్చాక, బ్రిటిష్ వారి అదృష్టాన . [36] 1 జూన్ 1781న పోర్టో నోవో నిర్ణయాత్మక యుద్ధంలో హైదర్ అలీపై కూట్ మొదటి భారీ దెబ్బ కొట్టాడు. దీని తర్వాత ఆగష్టు 27న పొల్లిలూర్‌లో (బ్రిటిషు సైన్యంపై హైదర్ అలీ విజయం సాధించిన దృశ్యం) మరొక కఠినమైన యుద్ధం జరిగింది, ఇందులో బ్రిటిషు వారు మరొక విజయాన్ని సాధించారు బ్రిటిషు వారితో పోరాటం కొనసాగుతుండగా, హైదర్ అలీ 7 డిసెంబర్ 1782న మరణించాడు. అతని తరువాత అతని కుమారుడు టిప్పు సుల్తాన్ బైదనూర్ మంగళూరులను తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా బ్రిటిష్ వారిపై శత్రుత్వాన్ని కొనసాగించాడు. [31] [37]

1783 నాటికి బ్రిటిష్ లేదా మైసూరు స్పష్టమైన విజయాన్ని పొందలేకపోయారు. ఐరోపాలో శాంతి పరిష్కారం తరువాత ఫ్రెంచ్ వారు మైసూరు‌కు మద్దతు ఉపసంహరించుకున్నారు. [38] "మైసూరు టైగర్"గా ప్రసిద్ధి చెందిన టిప్పు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధాన్ని కొనసాగించాడు. అయితే ఆధునిక తీరప్రాంత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను వారికి కోల్పోయాడు. 1785, 1787 మధ్య మరాఠా-మైసూరు యుద్ధం జరిగింది. బహదూర్ బెండా ముట్టడిలో మరాఠాలపై టిప్పు సుల్తాన్ విజయం సాధించిన తరువాత, రెండు రాజ్యాల మధ్య పరస్పర లాభనష్టాలతో శాంతి ఒప్పందం కుదిరింది. [39] [40] అదేవిధంగా, మంగళూరు ఒప్పందం 1784లో బ్రిటిష్ వారితో శత్రుత్వాన్ని తాత్కాలికంగానిలిపివేసి, వారి ప్రాంతాలను యుద్ధ పూర్వ స్థితికి తీసుకెళ్ళేలా సంతకం చేసుకున్నారు. [41] [42] ఈ ఒప్పందం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన పత్రం. భారతదేశంలో బ్రిటిషు వారు శాంతి కోసం అభ్యర్థించిన చివరి సందర్భం, ఓ భారతీయ రాజు వారికి నిబంధనలను నిర్దేశించిన చివరి సందర్భం అదే. ఐరోపాలో బ్రిటిషు, ఫ్రెంచ్ వాళ్ళ మధ్య తాజా శత్రుత్వాల ప్రారంభంతో టిప్పు తన ఒప్పందాన్ని రద్దు చేయడానికి, బ్రిటిషు వారిపై దాడి చేయాలనే అతని కాంక్ష పెరగడానికీ కారణమయ్యాయి. [43] నిజాం, మరాఠాలు, ఫ్రెంచ్, టర్కీ సుల్తాన్‌లను ఆకర్షించడానికి అతను చేసిన ప్రయత్నాలు ప్రత్యక్ష సైనిక సహాయాన్ని తీసుకురావడంలో విఫలమయ్యాయి. [43]

బ్రిటిషు మిత్రరాజ్యమైన ట్రావెన్‌కోర్ రాజ్యంపై 1790లో టిప్పు చేసిన దాడులు అతనికి విజయం తెచ్చిపెట్టాయి. అయితే ఇది బ్రిటిష్ వారితో శత్రుత్వం పెరగడానికి దారితీసింది. దీని ఫలితంగా మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం జరిగింది. [44] ప్రారంభంలో, బ్రిటిషు వారు కోయంబత్తూర్ జిల్లాను స్వాధీనం చేసుకున్నారు. అయితే టిప్పు చేసిన ఎదురుదాడి ఈ లాభాలను చాలా వరకు తిప్పికొట్టింది. 1792 నాటికి, వాయువ్యం నుండి దాడి చేసిన మరాఠాలు, ఈశాన్యం నుండి వచ్చిన నిజాం సహాయంతో, లార్డ్ కార్న్‌వాలిస్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారు శ్రీరంగపట్నాన్ని విజయవంతంగా ముట్టడించారు. ఫలితంగా టిప్పు ఓటమి పాలై, శ్రీరంగపట్నం ఒప్పందం కుదుర్చుకున్నాడు. మైసూరు‌లో సగభాగాన్ని మిత్రపక్షాలు పంచుకున్నారు. అతని ఇద్దరు కుమారులను బందీలుగా ఉంచుకున్నారు. [41] కానీ లొంగని టిప్పు తన ఆర్థిక, సైనిక శక్తిని పునర్నిర్మించుకున్నాడు. అతను ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్ అమీర్, ఒట్టోమన్ సామ్రాజ్యం, అరేబియా నుండి రహస్యంగా మద్దతు పొందేందుకు ప్రయత్నించాడు. అయితే, ఫ్రెంచ్ వారి జోక్యం కోరే ఈ ప్రయత్నాలు బ్రిటిష్ వారికి వెంటనే తెలిసిపోయాయి. వారికి మరాఠాలు, నిజాం మద్దతు ఇచ్చారు. 1799లో, టిప్పు నాల్గవ ఆంగ్లో-మైసూరు యుద్ధంలో శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే పనిలో మరణించాడు. రాజ్య స్వాతంత్ర్యానికి ముగింపు పలికాడు. [45] ఆధునిక భారతీయ చరిత్రకారులు టిప్పు సుల్తాన్‌ను బ్రిటిషు‌ వారి ఆగర్భ శత్రువుగా, సమర్థుడైన పరిపాలకుడుగా ఆవిష్కర్తగా భావిస్తారు. [46]

రాచరిక సంస్థానం మార్చు

టిప్పు పతనం తరువాత, మైసూరు రాజ్యంలో కొంత భాగాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ, నిజాం లు పంచుకున్నారు. మిగిలిన భూభాగాన్ని రాచరిక సంస్థానంగా మార్చారు; వడయార్ కుటుంబానికి చెందిన ఐదేళ్ల వంశస్థుడు, కృష్ణరాజు III, పూర్ణయ్య ప్రధానమంత్రి (దివాన్)గా సింహాసనంపై ప్రతిష్టించబడ్డాడు. పూర్ణయ్య గతంలో టిప్పు కింద పనిచేసి, రాజప్రతినిధిగా, లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసాడు. బారీ క్లోజ్ బ్రిటిష్ రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. బ్రిటిషు వారు మైసూరు విదేశాంగ విధానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మైసూరు వద్ద ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని నిర్వహించడానికి వార్షిక కప్పం, రాయితీని కూడా పొందారు. [47] [48] [49] దివాన్‌గా పూర్ణయ్య, బాలరాజు 16వ పుట్టినరోజు తర్వాత 1811 లో పదవీ విరమణ చేసే వరకు తన ప్రగతిశీల, వినూత్న పరిపాలనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కొంత కాలానికే మరణించాడు [50] [51]

మైసూరు, బ్రిటిషు మధ్య సంబంధాలు 1820 లలో విషమంగా మారేవరకు బాగానే ఉండేవి. మద్రాసు గవర్నర్ థామస్ మున్రో, 1825లో వ్యక్తిగత విచారణ తర్వాత మైసూరు‌లో తమ ప్రతినిధి అయిన AH కోల్ చేసిన ఆర్థిక అక్రమాల ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని నిర్ధారించినప్పటికీ, పౌర తిరుగుబాటుతో విషయాలు గణనీయంగా మారిపోయాయి. 1831లో, తిరుగుబాటును ముగించి, దుష్పరిపాలనను ఉటంకిస్తూ, బ్రిటిష్ వారు సాంస్థానంపై ప్రత్యక్ష నియంత్రణను చేపట్టారు. [52] [53] తదుపరి యాభై సంవత్సరాల పాటు, మైసూరు వరుసగా బ్రిటిష్ కమీషనర్ల పాలనలో ఉంది. తన రాజనీతిజ్ఞతకు ప్రసిద్ధి చెందిన సర్ మార్క్ కబ్బన్, 1834 నుండి 1861 వరకు సమర్థవంతమైన, విజయవంతమైన పరిపాలనా వ్యవస్థను అమలులోకి తెచ్చాడు. ఈ కాలంలో మైసూరు‌ బాగా అభివృద్ధి చెందిన సంస్థానంగా మారింది. [54]

అయితే, 1876-77లో, ప్రత్యక్ష బ్రిటిష్ పాలనా కాలం ముగిసే సమయానికి, మైసూరులో వినాశకరమైన కరువుతో అలుముకుంది. 7,00,000, 1,100,000 మధ్య మరణాలు ఉంటుందని అంచనా. [55] కొంతకాలం తర్వాత, వడయార్ రాజవంశం ఏర్పాటు చేసిన లాబీ విజయవంతమవడంతో, బ్రిటిషు వ్యవస్థలో చదువుకున్న మహారాజా చామరాజా X, 1881లో మైసూరు పాలనను చేపట్టాడు. దీని ప్రకారం, మైసూరు కోర్టులో రెసిడెంట్ బ్రిటిష్ అధికారిని, మహారాజు పరిపాలనను నిర్వహించడానికి ఒక దివాన్‌నూ నియమించారు. [56] అప్పటి నుండి, 1947లో భారత స్వాతంత్ర్యం వచ్చే వరకు, వడయార్లు వారి పాలనను కొనసాగించడంతో, మైసూరు బ్రిటిషు ఇండియన్ సామ్రాజ్యంలో సంస్థానంగా కొనసాగింది. [56]

X చామరాజా మరణానంతరం, 1895లో పదకొండు సంవత్సరాల బాలుడైన IV కృష్ణరాజు 1895లో సింహాసనాన్ని అధిష్టించాడు. 1902 ఫిబ్రవరి 8 న కృష్ణంరాజు పగ్గాలు చేపట్టే వరకు అతని తల్లి మహారాణి [57] రాజప్రతినిధిగా పరిపాలించింది. సర్ M. విశ్వేశ్వరయ్య దివాన్‌గా నియమించుకుని మహారాజా, మైసూరు‌ను పరిశ్రమ, విద్య, వ్యవసాయం, కళలలో ప్రగతిశీల, ఆధునిక రాష్ట్రంగా మార్చాడు. మైసూరు సాధించిన పురోగతిని చూసి మహాత్మా గాంధీ, మహారాజును రాజర్షి అని పిలిచాడు. [58] బ్రిటిష్ తత్వవేత్త, ప్రాచ్య శాస్త్రవేత్త పాల్ బ్రంటన్, అమెరికన్ రచయిత జాన్ గుంథర్, బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు లార్డ్ శామ్యూల్ లు అతని ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ కాలంలో జరిగిన విద్యాపరమైన స్థాపనలు ఆ తరువాతి దశాబ్దాలలో కర్నాటకకు అమూల్యమైన సేవలను అందించాయి. [59] మహారాజా నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు. అతని పూర్వీకుల వలె, లలిత కళలను ఆదరించాడు. [60] అతని తర్వాత అతని మేనల్లుడు జయచామరాజేంద్ర [61] 1947 ఆగష్టులో ఇండియన్ యూనియన్‌లో చేరిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు పాలించాడు. జయచామరాజేంద్ర 1956 వరకు మైసూరు రాజప్రముఖ్‌గా పాలన కొనసాగించాడు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 తరువాత, అతను మైసూరు రాష్ట్ర గవర్నరు అయ్యాడు. 1963 నుండి 1966 వరకు మద్రాసు రాష్ట్రానికి మొదటి గవర్నర్‌గా ఉన్నాడు. [62]

ఆర్థిక వ్యవస్థ మార్చు

చాలా మంది ప్రజలు గ్రామాల్లో నివసించేవారు. వ్యవసాయం వారి ప్రధాన వృత్తి. రాజ్యం ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది. ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పూలు సాగు చేశారు. వాణిజ్య పంటలలో చెరకు, పత్తి ఉన్నాయి. వ్యవసాయ జనాభాలో భూస్వాములు (వొక్కలిగ, జమీందార్, హెగ్గద్దె ) ముఖ్యులు. వారు అనేక మంది భూమిలేని కార్మికులను నియమించడం ద్వారా భూమిని సాగు చేసేవారు. మైనర్ సాగుదారులు కూడా అవసరమైతే కూలీలుగా చేరేందుకు సిద్ధమయ్యేవారు. [63] ఈ కూలీల లభ్యత కారణంగానే రాజులు, భూస్వాములు రాజభవనాలు, దేవాలయాలు, మసీదులు, ఆనకట్టలు (ఆనకట్టలు), చెరువుల వంటి ప్రధాన ప్రాజెక్టులను అమలు చేయగలిగారు. [64] భూమి సమృద్ధిగా ఉన్నందున, జనాభా చాలా తక్కువగా ఉన్నందున, భూమి యాజమాన్యంపై ఎలాంటి అద్దె వసూలు చేయలేదు. బదులుగా, భూ యజమానులు పన్ను చెల్లించేవారు. ఇది మొత్తం పండించిన ఉత్పత్తులలో సగం వరకు ఉండేది. [64]

హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో మార్చు

మైసూరు రాజ్యం 18వ శతాబ్దం మధ్యలో మొఘల్ అనంతర కాలంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ల ఆధ్వర్యంలో ఆర్థిక శక్తిలో గరిష్ట స్థాయికి చేరుకుంది.

టిప్పు సుల్తాన్ తన రాజ్యంలోని వివిధ ప్రదేశాలలో స్టేట్ ట్రేడింగ్ డిపోలను స్థాపించిన ఘనత పొందాడు. అదనంగా, అతను మైసూరు ఉత్పత్తులను విక్రయించే కరాచీ, జెడ్డా, మస్కట్ వంటి విదేశీ ప్రదేశాలలో డిపోలను స్థాపించాడు. [65] టిప్పు పాలనలో వడ్రంగి, కమ్మరి పనిలో మొదటిసారి ఫ్రెంచ్ సాంకేతికత ఉపయోగించారు. చక్కెర ఉత్పత్తికి చైనీస్ సాంకేతికత ఉపయోగించారు. బెంగాల్ నుండి తెచ్చిన సాంకేతికతతో సెరికల్చర్ పరిశ్రమను మెరుగుపరచారు. [66] ఫిరంగులు, గన్‌పౌడర్‌లను ఉత్పత్తి చేయడానికి కనకపుర, తారామండల్‌పేటలో కర్మాగారాలు స్థాపించారు. చక్కెర, ఉప్పు, ఇనుము, మిరియాలు, ఏలకులు, తమలపాకులు, పొగాకు, గంధం వంటి నిత్యావసరాల ఉత్పత్తిలో, అలాగే చందనం నుండి అగరబత్తిని వెలికితీత, వెండి, బంగారం, విలువైన రాళ్ల తవ్వకంలో రాజ్యానికి గుత్తాధిపత్యం ఉండేది. చందనం చైనా, పెర్షియన్ గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. రాజ్యంలో ఇరవై ఒక్క కేంద్రాలలో సెరికల్చరును అభివృద్ధి చేసారు. [67]

టిప్పు సుల్తాన్ పాలనలో మైసూరు పట్టు పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పరిశ్రమ ప్రపంచ మాంద్యం, దిగుమతి చేసుకున్న పట్టు, రేయాన్‌ల నుండి పోటీ కారణంగా దెబ్బతింది. 20వ శతాబ్దపు ద్వితీయార్ధంలో, ఇది పునరుజ్జీవం పొంది, మైసూరు రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి మల్టీవోల్టిన్ సిల్క్ ఉత్పత్తిదారుగా అవతరించింది. [68]

బ్రిటిష్ పాలనలో మార్చు

బ్రిటిష్ వారి అనుబంధ కూటమిలో చేరాక, పన్ను చెల్లింపులు నగదు రూపంలో జరిగాయిఉ. సైన్యం, పోలీసు, ఇతర పౌర, ప్రభుత్వ సంస్థల నిర్వహణకు దాన్ని ఉపయోగించారు. పన్నులో కొంత భాగాన్ని "భారతీయ కప్పం"గా ఇంగ్లండ్‌కు బదిలీ చేశారు. [69] తమ సంప్రదాయ ఆదాయ వ్యవస్థను కోల్పోవడంతో, తాము ఎదుర్కొన్న సమస్యల పట్ల అసంతృప్తితో ఉన్న రైతులు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలలో తిరుగుబాటుకు దిగారు. [70] 1800 తర్వాత, కార్న్‌వాలిస్ చేసిన భూ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. రీడ్, మున్రో, గ్రాహం, థాకరే ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచిన కొంతమంది పాలకులు. [71] అయితే, బ్రిటిష్ పాలనలో ఉండగా భారతదేశంలోని చాలా ప్రాంతాల లాగానే చేనేత వస్త్ర పరిశ్రమ నష్టపోయింది.. [72] [73]

సంస్కృతి మార్చు

మతం మార్చు

 
ఒక ముఖ్యమైన జైన దేవాలయ పట్టణం శ్రావణబెళగొళలో రాజు చిక్క దేవరాజ వడయార్ నిర్మించిన పుష్కరిణి
 
మైసూరు ప్యాలెస్ మైదానంలో శ్వేత వరాహస్వామి ఆలయం (1673–1704).

వడయార్ రాజవంశపు తొలి రాజులు శివుడిని ఆరాధించారు. తరువాతి రాజులు, 17వ శతాబ్దం నుండి, వైష్ణవాన్ని స్వీకరించారు. [74] సంగీత విద్వాంసుడు మీరా రాజారాం ప్రాణేష్ ప్రకారం, రాజు రాజ వడయార్ I విష్ణు భక్తుడు. దొడ్డ దేవరాజు బ్రాహ్మణులకు మద్దతు ఇచ్చినందుకు "బ్రాహ్మణుల రక్షకుడు" ( దేవ బ్రాహ్మణ పరిపాలక ) బిరుదుతో సత్కరించబడ్డాడు. మహారాజా కృష్ణరాజు III చాముండేశ్వరి భక్తుడు. [75] విల్క్స్ ("మైసూరు చరిత్ర", 1800) జంగమ తిరుగుబాటు గురించి రాశాడు. అధిక పన్నులకు వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటును చిక్క దేవరాజు గట్టిగా అణిచివేశాడు. ఈ ప్రక్రియలో నాలుగు వందల మంది జంగములు హత్యకు గురయ్యారని చరిత్రకారుడు డిఆర్ నాగరాజ్ పేర్కొన్నప్పటికీ వీరశైవ సాహిత్యం ఈ సమస్యపై మౌనంగా ఉంది. [76] చరిత్రకారుడు సూర్యనాథ్ కామత్, చిక్క దేవరాజు శ్రీవైష్ణవుడే గానీ వీరశైవ వ్యతిరేకి కాదని రాసాడు. [77] నరసరాజు I, చిక్క దేవరాజుతో సహా కొంతమంది రాజులు వైష్ణవులు అని చరిత్రకారుడు అయ్యంగార్ ఏకీభవించాడు. అయితే వడయార్ పాలకులందరి విషయంలో అలా ఉండకపోవచ్చని అన్నాడు. [78] ఆధునిక మైసూరు నగరం దక్షిణ భారత సంస్కృతికి కేంద్రంగా అభివృద్ధి చెందడం వారి సార్వభౌమాధికార కాలం నుండే జరిగింది. [79] రాజా వడయార్ I మైసూరు‌లో దసరా పండుగ వేడుకలను ప్రారంభించాడు. ఇది పూర్వపు విజయనగర సామ్రాజ్యపు సంప్రదాయం. [80] [81]

హిందూ రాజ్యాలు, ఇస్లామిక్ కాలిఫేట్‌ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందిన 7వ శతాబ్దానికే దక్షిణ భారతదేశంలో ఇస్లాం పరిచయం అయింది. ఈ ముస్లిం వ్యాపారులు మలబార్ తీరంలో స్థిరపడి, స్థానిక హిందూ స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారి వారసులు మప్పిళ్ళలు అనేవారు. [82] 14వ శతాబ్దం నాటికి, పోర్చుగీస్ మిషనరీల ఆగమనంతో వారి ఎదుగుదలకు అడ్డుపడినప్పటికీ, దక్షిణాన ముస్లింలు గణనీయమైన మైనారిటీగా మారారు. [82] హైదర్ అలీ ముస్లిం అయినప్పటికీ, తన హిందూ రాజ్య పరిపాలనలో మతం జోక్యం చేసుకోవడానికి అనుమతించలేదు. అయితే, హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ ఉద్దేశాలపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. టిప్పు తన పరిపాలనలో హిందువులను ప్రముఖ స్థానాలలో నియమించాడని, హిందూ దేవాలయాలకు, బ్రాహ్మణులకూ ఉదారంగా గ్రాంట్లు ఇచ్చాడనీ, సాధారణంగా ఇతర విశ్వాసాలను గౌరవించేవాడనీ, టిప్పు చేపట్టిన మత మార్పిడులు అతని అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారికి వేసిన శిక్ష మాత్రమేననీ చెప్పారు. [83] అయితే టిప్పు సుల్తాన్ మైసూరులోని ముస్లిమేతరులను మలబార్, రాయచూర్, కొడగు ప్రాంతాల వారి కంటే మెరుగ్గా చూసేవాడని ఇతర చరిత్రకారులు అన్నారు. ఈ ప్రాంతాలలో క్రైస్తవులు, హిందువులను బలవంతంగానో, పన్ను రాయితీల ద్వారా ఆదాయ ప్రయోజనాలను అందించడం ద్వారానో మతం మార్చడానికి పెద్దఎత్తున కృషి వ్చేసాడని వారు అభిప్రాయపడ్డారు. [84] [85]

సాహిత్యం మార్చు

మైసూరు రాజ్య యుగం కన్నడ సాహిత్యం అభివృద్ధిలో స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. మైసూరు ఆస్థానాన్ని ప్రసిద్ధ బ్రాహ్మణ, వీరశైవ రచయితలు, స్వరకర్తలు అలంకరించడమే కాకుండా, [86] [87] రాజులు స్వయంగా లలిత కళలలో నిష్ణాతులు. వారు ముఖ్యమైన రచనలు చేశారు. [88] [89] తత్వశాస్త్రం, మతంలో సాంప్రదాయ సాహిత్యం ప్రజాదరణ పొందినప్పటికీ, క్రానికల్, జీవిత చరిత్ర, చరిత్ర, ఎన్సైక్లోపీడియా, నవల, నాటకం, సంగీత గ్రంథం వంటి కొత్త శైలి రచనలు ప్రజాదరణ పొందాయి. [90] యక్షగాన అనే నాటకీయ ప్రాతినిధ్యంతో జానపద సాహిత్య స్థానిక రూపం ప్రజాదరణ పొందింది. [91] [92] తరువాతి కాలంలో కన్నడ సాహిత్య అభివృద్ధిపై ఆంగ్ల సాహిత్యం, సాంప్రదాయ సంస్కృత సాహిత్యాలు చూపిన ప్రభావం చెప్పుకోదగ్గది. [93]

శ్రీరంగపట్నానికి చెందిన గోవింద వైద్య, కంఠీరవ నరసరాజ విజయాన్ని తన పోషకుడైన రాజు నరసరాజు I ను కీర్తిస్తూ సాంగత్య ఛండంలో రాసాడు. ఈ పుస్తకంలో రాజాస్థానం గురించి, ఆ కాలనికి చెందిన సంగీత కూర్పుల రకాల గురించి ఇరవై ఆరు అధ్యాయాలలో రాసాడు. [94] [95] రాజు చిక్క దేవరాజు రాజవంశాబికి చెందిన తొలి స్వరకర్త. [96] [97] గీతా గోపాల అనే ప్రసిద్ధ సంగీత గ్రంథం రాసాడు. జయదేవ్ సంస్కృత రచన గీత గోవిందం నుండి ప్రేరణ పొందినప్పటికీ, దానికి స్వంత స్వరం ఉంది. [98] కన్నడ మాట్లాడే ప్రాంతం అంతటి మీద తమదైన ముద్ర వేసిన సమకాలీన కవులలో బ్రాహ్మణ కవి లక్ష్మీశ, వీరశైవ కవి సర్వజ్ఞ ఉన్నారు. చెలువాంబే (కృష్ణరాజ వడయార్ I రాణి), హెలవనకట్టె గిరియమ్మ, శ్రీ రంగమ్మ (1685), సాంచి హొన్నమ్మ గుర్తించదగిన రచనలతో పాటు సాహిత్య అభివృద్ధిలో పాత్ర పోషించిన కవయిత్రులు. [99] [100]

బసవప్ప శాస్త్రి, మైసూరు స్థానికుడు, కృష్ణరాజా III, చామరాజా X ల ఆస్థానంలో ప్రముఖుడు. అతన్ని "కన్నడ నాటక పితామహుడు" అని పిలుస్తారు. [101] అతను కన్నడలో నాటకాలు రచించాడు. విలియం షేక్స్పియర్ రాసిన "ఒథెల్లో" ను శూరసేన చరితెగా అనువదించాడు. సంస్కృతం నుండి కన్నడకు అతని ప్రసిద్ధ అనువాదాలు చాలా ఉన్నాయి. వాటిలో కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతల ఉన్నాయి. [102]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Rajakaryaprasakta Rao Bahadur (1936), p383
  2. India, Modernity and the Great Divergence: Mysore and Gujarat (17th to 19th C.), Brill Publisher, 2017, p. 115, ISBN 9789004330795
  3. Devotional Sovereignty: Kingship and Religion in India, Oxford University Press, 2020, pp. 10–12, ISBN 9780190088897
  4. Kamath (2001), pp. 11–12, pp. 226–227; Pranesh (2003), p. 11
  5. Narasimhacharya (1988), p. 23
  6. Subrahmanyam (2003), p. 64; Rice E.P. (1921), p. 89
  7. Kamath (2001), p. 226
  8. Rice B.L. (1897), p. 361
  9. Pranesh (2003), pp. 2–3
  10. Wilks, Aiyangar in Aiyangar and Smith (1911), pp. 275–276
  11. Aiyangar (1911), p. 275; Pranesh (2003), p. 2
  12. Stein (1989), p. 82
  13. Stein 1987
  14. Kamath (2001), p. 227
  15. Subrahmanyam (2001), p. 67
  16. 16.0 16.1 16.2 Subrahmanyam (2001), p. 68
  17. Venkata Ramanappa, M. N. (1975), p. 200
  18. Shama Rao in Kamath (2001), p. 227
  19. 19.0 19.1 19.2 Venkata Ramanappa, M. N. (1975), p.201
  20. 20.0 20.1 Subrahmanyam (2001), p. 68; Kamath (2001), p. 228
  21. Subrahmanyam (2001), p. 71
  22. Kamath (2001), pp. 228–229
  23. Subrahmanyam (2001), p. 69; Kamath (2001), pp. 228–229
  24. Subrahmanyam (2001), p. 69
  25. Subrahmanyam (2001), p. 70
  26. Shama Rao in Kamath (2001), p. 233
  27. Quote:"A military genius and a man of vigour, valour and resourcefulness" (Chopra et al. 2003, p. 76)
  28. 28.0 28.1 Venkata Ramanappa, M. N. (1975), p. 207
  29. Chopra et al. (2003), p. 71, 76
  30. Chopra et al. (2003), p. 55
  31. 31.0 31.1 31.2 31.3 Kamath (2001), p. 232
  32. Chopra et al. (2003), p. 71
  33. Chopra et al. (2003), p. 73
  34. 34.0 34.1 Jacques, Tony (2007). Dictionary of Battles and Sieges. Greenwood Press. p. 916. ISBN 978-0-313-33536-5.
  35. Chopra et al. (2003), p. 74
  36. Chopra et al. (2003), p. 75
  37. Chopra et al. 2003, p. 75
  38. Venkata Ramanappa, M. N. (1975), p. 211
  39. Mohibbul Hasan (2005), History of Tipu Sultan, pp. 105–107, ISBN 9788187879572
  40. Sailendra Nath Sen (1994), Anglo-Maratha Relations, 1785–96, Volume 2, p. 55, ISBN 9788171547890
  41. 41.0 41.1 Chopra et al. (2003), p. 78–79; Kamath (2001), p. 233
  42. Chopra et al. (2003), pp. 75–76
  43. 43.0 43.1 Chopra et al. (2003), p. 77
  44. Mohibbul Hasan (2005), History of Tipu Sultan, Aakar Books, p. 167, ISBN 9788187879572
  45. Chopra et al. (2003), pp. 79–80; Kamath (2001), pp. 233–234
  46. Chopra et al. (2003), pp. 81–82
  47. Kamath (2001), p. 249
  48. Kamath (2001), p. 234
  49. Venkata Ramanappa, M. N. (1975), p. 225
  50. Quote:"The Diwan seems to pursue the wisest and the most benevolent course for the promotion of industry and opulence" (Gen. Wellesley in Kamath 2001, p. 249)
  51. Venkata Ramanappa, M. N. (1975), pp. 226–229
  52. Kamath (2001), p. 250
  53. Venkata Ramanappa, M. N. (1975), pp. 229–231
  54. Venkata Ramanappa, M. N. (1975), pp. 231–232
  55. Lewis Rice, B., Report on the Mysore census (Bangalore: Mysore Government Press, 1881), p. 3
  56. 56.0 56.1 Kamath (2001), pp. 250–254
  57. Rama Jois, M. 1984. Legal and constitutional history of India ancient legal, judicial and constitutional system. Delhi: Universal Law Pub. Co. p. 597
  58. Puttaswamaiah, K. 1980. Economic development of Karnataka a treatise in continuity and change. New Delhi: Oxford & IBH. p. 3
  59. "The Mysore duo Krishnaraja Wodeya IV & M. Visvesvaraya". India Today. Archived from the original on 24 October 2008. Retrieved 23 October 2007.
  60. Pranesh (2003), p. 162
  61. Kamath (2001), p. 261
  62. Asian Recorder, Volume 20 (1974), p. 12263
  63. Sastri (1955), p. 297–298
  64. 64.0 64.1 Chopra et al. (2003), p. 123
  65. M. H. Gopal in Kamath 2001, p. 235
  66. Kamath (2001), pp. 235–236
  67. Kamath (2001), pp. 236–237
  68. R. K. Datta (2007). Global Silk Industry: A Complete Source Book. APH Publishing. p. 17. ISBN 978-8131300879. Retrieved 22 January 2013.
  69. Chopra et al. (2003), p. 124
  70. Chopra et al. (2003), p. 129
  71. Chopra et al. (2003), p. 130
  72. Kamath (2001), p. 286
  73. Chopra et al. (2003), p. 132
  74. Rice E.P. (1921), p. 89
  75. Pranesh (2003), p. 5, p. 16, p. 54
  76. Nagaraj in Pollock (2003), p. 379
  77. Kamath (2001), p. 229
  78. Aiyangar and Smith (1911), p. 304
  79. Pranesh (2003), p. 17
  80. Aiyangar and Smith (1911), p. 290
  81. Pranesh (2003), p. 4
  82. 82.0 82.1 Sastri (1955), p. 396
  83. Mohibul Hassan in Chopra et al., 2003, p. 82, part III
  84. Chopra et al. (2003), p. 82
  85. Kamath (2001), p. 237
  86. Kamath (2001), pp. 229–230
  87. Narasimhacharya (1988), pp. 23–27
  88. Mukherjee (1999), p. 78; Narasimhacharya (1988), p. 23, p. 26
  89. Kamath (2001), pp. 229–230; Pranesh (2003), preface chapter p(i)
  90. Narasimhacharya (1988), pp. 23–26
  91. Narasimhacharya (1988), p. 25
  92. Kamath (2001), p. 281
  93. Murthy (1992), p. 168–171; Kamath (2001), p. 280
  94. Rice E.P. (1921), p. 90; Mukherjee (1999), p. 119
  95. Kamath (2001), p. 227; Pranesh (2003), p. 11
  96. Kamath (2001), p. 230
  97. Pranesh (2003), p. 20
  98. Mukherjee (1999), p. 78; Pranesh (2003), p. 21
  99. Mukherjee (1999), p. 143, p. 354, p. 133, p. 135; Narasimhacharya (1988), pp. 24–25
  100. Pranesh (2003), pp. 33–34; Rice E.P. (1921), pp. 72–73, pp. 83–88, p. 91
  101. Pranesh (2003), p. 81
  102. Sahitya Akademi (1988), p. 1077; Pranesh (2003), p. 82