సురభి బాబ్జీ

సురభి నాటక సమాజానికి చెందినవాడు

సురభి బాబ్జీ, సురభి నాగేశ్వరరావు (1949, జూలై 1 - 2022, జూన్ 9)గా పేరు పొందిన రేకందార్ నాగేశ్వరరావు సురభి నాటక సమాజానికి చెందినవాడు. 2013లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[1]

సురభి బాబ్జీ
జననం(1949-07-01)1949 జూలై 1
మరణం2022 జూన్ 9(2022-06-09) (వయసు 72)
వృత్తినాటకరంగం
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ అవార్డు 2011
పద్మశ్రీ 2013

జననం మార్చు

రేకందార్ నాగేశ్వరరావు 1949, జూలై 1న చిన్న వెంకట్రావు, సుభద్రమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గజపతి నగరంలో జన్మించాడు. హెచ్.ఎల్.సీ వరకు చదువుకున్నాడు. సురభి నాటకసమాజంలో రేకందార్ కుటుంబం ఒకటి. వనారస గోవిందరావు కుమార్తె రేకందార్ సుభద్రమ్మ. ఈమె కుమారుడే రెకెందర్ నాగేశ్వరరావు. బాబ్జి తల్లిదండ్రులిద్దరూ నాటకరంగంలో నటీనటులే.[2]

నాటకరంగ ప్రస్థానం మార్చు

రేకందార్ నాగేశ్వరరావు 4 సంవత్సరాల వయస్సులోనే బాలనటునిగా రంగస్థల ప్రవేశంచేశాడు. శ్రీరామ, శ్రీకృష్ణ, వీరబ్రహ్మం, నక్షత్రక, కార్యవర్థి, లవకుశ, మహావిష్ణువు, వెంగళార్య, భవానీ శంకరుడు మొదలైన పాత్రలు పోషించి ప్రేక్షకులను తన నటనతో రజింపచేశాడు. గరిమెళ్ల రామమూర్తి, పద్మశ్రీ బి.వి. కారంత్ వద్ద నాటకరంగంలో శిక్షణ పొందాడు. ఈయన నటనతో పాటు రంగస్థల నిర్వహణ కూడా చేపట్టి విజయవంతమైన నాటకాలు ప్రదర్శింపచేసాడు.

నర్సీపట్నంలో డిగ్రీ పూర్తిచేసిన బాబ్జి, తన తండ్రి ప్రారంభించిన వెంకటేశ్వర నాట్యమండలికి 1973లో బాధ్యతలను స్వీకరించి 42 సంవత్సరాలుగా కార్యదర్శిగా ఉన్నాడు.[3] అంతేకాక అయిదు సురభి ఫెడరేషన్ ఉమ్మడి బ్యానర్ అయిన సురభి నాటక కళా సంఘానికి 24 సంవత్సరాల నుండి కార్యదర్శిగా కొనసాగాడు. 1991లో హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సురభి రంగస్థలాన్ని ఏర్పాటుచేసి నాటకాలకు శ్రీకారం చుట్టాడు.

రామరాజ్యం, శ్రీ కృష్ణలీలలు, బాలనాగమ్మ, జై పాతాళ భైరవి, లవకుశ, మాయాబజార్‌, వీరబ్రహ్మంగారి చరిత్ర, బొబ్బిలి యుద్ధం, చింతామణి, రంగూన్‌ రౌడి వంటి నాటకాలకు నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. దేశవ్యాప్తంగా వివిధ నాటక సంస్థలకు, కళాకారులకు ఈయన సుపరిచితుడు. చైన్నై, ముంబై, బెంగుళూరు, గోవా తదితర నగరాలల్లోనే కాక అనేక రాష్ట్రాలల సురభి నాటకాలను విజయవంతంగా ప్రదర్శించాడు.

అప్పటి ఐఏఎస్ అధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్, నాటక కళాకారుడు గరిమెళ్ళ రామ్మూర్తి వంటి వారి సహకారంతో 1980లో సాంస్కృతిక శాఖ నుంచి తొలి గ్రాంటును సాధించాడు. గుబ్బి వీరన్న నాటక కంపెనీ, రంగశంకరం, అలరిపు, కేంద్ర సంగీత నాటక అకాడమీ, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా వంటి సంస్థలతో పనిచేశాడు. 150 మంది కళాకారులతో ఫ్రాన్స్‌ వెళ్ళి రెండు నెలలపాటు నాటకాలను ప్రదర్శించి సురభి గొప్పదనాన్ని ప్రపంచ వేదికకు పరిచయం చేసాడు.[2]

గుర్తింపులు మార్చు

  • 2013లో భారత ప్రభుత్వ నుండి పద్మశ్రీ పురస్కారం[4]
  • సురభి సంస్థ ఆవిర్భవించి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన సురభి ధియేటర్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు 2011లో సంగీత నాటక అకాడమీ వారు అత్యున్నత పురస్కారంతో గౌరవించారు.[5]
  • నాగేశ్వరరావు కృషిని ప్రతిభను గుర్తించిన అనేకమంది ప్రముఖులు జ్ఞాని జైల్‌సింగు, పి.వి. నరసింహారావు, ఎన్.టి.ఆర్. వంటి ఎందరో అభినందనలు అందచేశారు.
  • 2000 సంవత్సరంలో రాష్టస్థ్రాయి ఉత్తమ నాటక రంగ నిర్వాహకునిగా పురస్కారం
  • 2004లో బళ్లారి రాఘవ పురస్కారం పొందాడు.

మరణం మార్చు

నాగేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2022 జూన్ 9న హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తన స్వగృహంలో మరణించాడు.[6][7]

మూలాలు మార్చు

  1. "Padma 2013". The Hindu. 26 January 2013. Retrieved 10 October 2014.
  2. 2.0 2.1 జె., డా. విజయకుమార్‌జీ (2022-06-14). "సురభి నాటక దీపం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-14. Retrieved 2022-06-14.
  3. "Surabhi". Surabhi. 2014. Archived from the original on 21 October 2014. Retrieved 15 October 2014.
  4. MAREEDU, MOULI (2022-06-10). "Veteran artiste Surabhi Babji dies at age 73". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-10. Retrieved 2022-06-14.
  5. "Surabhi bio". Surabhi Theatre. 2011. Archived from the original on 21 October 2014. Retrieved 15 October 2014.
  6. "సురభి నాగేశ్వరరావు కన్నుమూత". web.archive.org. 2022-06-10. Archived from the original on 2022-06-10. Retrieved 2022-06-10.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Sakshi (10 June 2022). "'రంగస్థలం' నుంచి నిష్క్రమించిన సురభి బాబ్జీ". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.

బయటి లింకులు మార్చు

ఆంధ్రభూమిలో సురభి బాబ్జీ గురించిన వ్యాసం[permanent dead link]