ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ

నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ (1910 మార్చి 16 - 1952 జనవరి 5), భారతీయ యువరాజు, క్రికెట్ ఆటగాడు.

మొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ
నవాబ్ ఆఫ్ పటౌడీ
1931 లో ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ
నవాబ్ ఆఫ్ పటౌడీ
Reign1917–1948
1948–1952 (నామమాత్రం)
Coronation1931 డిసెంబరు
Predecessorమొహమ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ
Successorమన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (నామమాత్రం)
జననంమొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ
మూస:Beath date
పటౌడీ, పటౌడీ సంస్థానం, బ్రిటిషు భారతదేశం (ఇప్పటి హర్యానా)
మరణం1952 జనవరి 5(1952-01-05) (వయసు 41)
న్యూ ఢిల్లీ
Burial
పట్టపురాణిసాజిదా సుల్తాన్
Issueమన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ముగ్గురు కుమార్తెలు
Houseనవాబ్ ఆఫ్ పటౌడీ
తండ్రిమొహమ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ
తల్లిషహర్ బానో బేగం
మతంసున్నీ ఇస్లాం
Occupationక్రికెట్ ఆటగాడు, ప్రభుత్వ అధికారి
వ్యక్తిగత సమాచారం
మారుపేరుPat
ఎత్తు6 ft 0 in (1.83 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 265/32)1932 డిసెంబరు 2 
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1946 ఆగస్టు 20 
ఇండియా - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1928–1931ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ క్రికెట్ క్లబ్
1932–1938వోర్సెస్టర్‌షైర్ క్రికెట్ క్లబ్
1945/46దక్షిణ పంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫ.క్లా
మ్యాచ్‌లు 6 127
చేసిన పరుగులు 199 8,750
బ్యాటింగు సగటు 19.90 48.61
100లు/50లు 1/0 29/34
అత్యధిక స్కోరు 102 238*
వేసిన బంతులు 0 756
వికెట్లు 15
బౌలింగు సగటు 35.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 6/111
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 58/–
మూలం: Cricinfo, 2009 మే 12

పటౌడీ 1946లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కుమారుడు మన్సూర్ కూడా, ఆ తరువాత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. అతన్ని నవాబ్ ఆఫ్ పటౌడీ జూనియర్ అని పిలుస్తారు,

పటౌడీ 1932, 1934లో ఇంగ్లండ్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు, రెండు దేశాలకు టెస్ట్ క్రికెట్ ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో అతనొకడు. భారతదేశం, ఇంగ్లండ్ రెండింటికీ ఆడిన ఏకైక టెస్టు క్రికెటరతడు.[1] అతను మొత్తం ఆరు టెస్టుల్లో - మూడు భారత కెప్టెన్‌గా, మూడు ఇంగ్లండ్‌కు ఆడాడు. [2]

పటౌడీ 1917 నుండి 1947 వరకు బ్రిటిష్ రాజ్ సమయంలో పటౌడీ సంస్థానాన్ని పాలించిన నవాబు. అది స్వతంత్ర భారతదేశంలో విలీనమైన తర్వాత, అతనికి భారత ప్రభుత్వం ప్రీవీ పర్సు, కొన్ని అధికారాలు, నవాబ్ ఆఫ్ పటౌడీ అనే బిరుదునూ ఇచ్చింది, [3]1952లో మరణించే వరకు అతను దానిని వాడుకున్నాడు.

వ్యక్తిగత జీవితం మార్చు

ప్రారంభ జీవితం, కుటుంబం మార్చు

ఇఫ్తికర్ అలీ ఖాన్ ఢిల్లీలోని పటౌడీ హౌస్‌లో పటౌడీ నవాబుల కుటుంబంలో జన్మించాడు. పటౌడీ 137 చ.కి.మీ విస్తీర్ణంలో, ఢిల్లీకి సమీపంలో ఉన్న, చిన్న నాన్-సెల్యూట్ సంస్థానం. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో ఉంది. [4] పటౌడీ రాజ్యానికి మొదటి నవాబైన ఫైజ్ తలాబ్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లోని బరేచ్ తెగకు చెందిన పష్టూన్‌. ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ నవాబ్ ముహమ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్, అతని భార్య షహర్ బానో బేగంల పెద్ద కుమారుడు. తల్లి, లోహారు నవాబ్ అయిన అమీరుద్దీన్ అహ్మద్ ఖాన్ కుమార్తె. ఆ విధంగా అతను గొప్ప ఉర్దూ కవి మీర్జా గాలిబ్‌కు, తరువాతి కాలంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి అయిన లియాఖత్ అలీ ఖాన్‌కూ బంధువు అవుతాడు. 1917లో తండ్రి మరణంతో ఇఫ్తికర్ నవాబు అయ్యాడు. అధికారికంగా 1931 డిసెంబరులో పాలకుడిగా నియమితుడయ్యాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, మరణించే వరకు భారత విదేశాంగ కార్యాలయంలో పనిచేశాడు.

చదువు మార్చు

లాహోర్‌లోని చీఫ్స్ కాలేజీలోను (తరువాత ఐచిసన్ కాలేజ్ అని పేరు మార్చారు), ఆక్స్‌ఫర్డ్‌లోని బల్లియోల్ కాలేజీలోనూ చదువుకున్న ఇఫ్తికర్, 1939లో భోపాల్ చివరి పాలక నవాబు అయిన హమీదుల్లా ఖాన్ రెండవ కుమార్తె బేగం సాజిదా సుల్తాన్‌ను పెళ్ళి చేసుకున్నాడు. హమీదుల్లా ఖాన్ వారసత్వమైన భోపాల్ పాలక వంశపు బిరుదులు, అధికారాలూ అతని పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ కు చెందవలసి ఉంది. అయితే, భారతదేశ విభజన తర్వాత ఆమె పాకిస్థాన్‌కు వలస వెళ్లింది. హమీదుల్లా ఢిల్లీకి వెళ్ళి తన రాజ్యాన్ని స్వచ్ఛందంగా భారతదేశంలో విలీనం చేసాడు. ఆ సంగతిని VP మీనన్ తన ది స్టోరీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్‌లో వివరిస్తూ, అతన్ని "దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే మరణించిన గొప్ప దేశభక్తుడు" అని గుర్తు చేసుకున్నాడు. పెద్ద కుమార్తే లేనందున సాజిదాను 1961లో భోపాల్‌కు చెందిన బేగంగా భారత ప్రభుత్వం గుర్తించింది. 1995లో ఆమె మరణించిన తర్వాత, ఆమె కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ భోపాల్ నవాబులకు సంబంధించిన ఎస్టేట్లు, బిరుదులను పొందాడు.

క్రికెట్ కెరీర్ మార్చు

ఇఫ్తికర్ అలీ ఖాన్ భారతదేశంలో పాఠశాలలో ఆక్స్‌ఫర్డ్ క్రికెటర్ MG స్లేటర్ వద్ద, ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో ఫ్రాంక్ వూలీ వద్ద క్రికెట్ శిక్షణ పొందాడు. 1927లో అతను ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లాడు. అతను టెస్టు జట్టులో చేరడానికి రెండు సంవత్సరాల ముందు; కేంబ్రిడ్జ్‌తో జరిగిన మ్యాచ్‌ను కాపాడిన 106, 84 పరుగుల స్కోరు కోసం. 1931 సీజన్‌లో, అతను ఆక్స్‌ఫర్డ్ తరపున 1,307 పరుగులు చేసి, 93 బ్యాటింగ్ సగటు సాధించాడు. ఆ సంవత్సరం యూనివర్శిటీ మ్యాచ్‌లో, కేంబ్రిడ్జ్ తరఫున అలాన్ రాట్‌క్లిఫ్ 201 పరుగులు చేశాడు, ఇది కొత్త రికార్డు. పటౌడీ దానిని దాటేస్తానని ప్రకటించి, మరుసటి రోజు 238* కొట్టాడు. 2005 వరకు ఇది యూనివర్శిటీ మ్యాచ్‌ల రికార్డుగా నిలిచింది. పటౌడీ 1932లో వోర్సెస్టర్‌షైర్ తరపున ఆడేందుకు అర్హత సాధించాడు కానీ కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 65 పరుగులు చేశాడు. అయితే, 1932 జూలైలో లార్డ్స్‌లో జెంటిల్‌మెన్ తరఫున చేసిన 165 పరుగుల ఇన్నింగ్స్‌లో అతను టిచ్ ఫ్రీమాన్‌ను అద్భుత ఫుట్‌వర్క్‌తో చితక్కొట్టడంతో ఆ శీతాకాలపు యాషెస్ పర్యటనలో అతనికి చోటు దక్కింది. 1932 లో అతను విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

తొలి టెస్టు మ్యాచ్‌కు ఎంపిక మార్చు

అతను 1932-33 యాషెస్ సిరీస్‌లో మొదటి టెస్టుకు ఎంపికయ్యాడు. సిడ్నీలో తన తొలి టెస్టులో శతకం (102) సాధించి, రంజిత్‌సిన్హ్జీ అడుగుజాడలను అనుసరించాడు. ఆ మ్యాచ్, ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే అతను జార్డిన్ బాడీలైన్ వ్యూహాలతో విభేదించడంతో కెప్టెన్ డగ్లస్ జార్డిన్ ఆగ్రహానికి గురయ్యాడు. బాడీలైన్ లెగ్-సైడ్ ఫీల్డ్‌లో స్థానాన్ని తీసుకోవడానికి పటౌడీ నిరాకరించడంతో, జార్డిన్ ఇలా ప్రతిస్పందించాడు, "హిజ్ హైనెస్ మనస్సాక్షికి కట్టుబడి వ్యతిరేకిస్తున్నారు." మెల్‌బోర్న్‌లో జరిగిన రెండవ టెస్టు తర్వాత పటౌడీని తొలగించారు. రెండవ టెస్టులో అతను 15, 5 పరుగులు చేశాడు. ఇక, ఆ సిరీస్‌లో మళ్లీ ఆడలేదు.

జార్డిన్, నీ "దత్తత దేశం" కోసం మళ్లీ ఆడలేవు అని అతనితో చెప్పాడని అంటారు.[5] బహుశా జాతివివక్షతో కూడిన వ్యాఖ్య అది. నిజానికి పటౌడీ ఇంగ్లండ్ తరపున మరొకసారి ఆడాడు. 1932-33 పర్యటన ముగిసే సమయానికి, అతను జార్డిన్ గురించి ఇలా అన్నాడు: "అతనికేవో మంచి లక్షణాలు కూడా ఉన్నాయని అన్నారు. మూడు నెలలైంది, ఇంకా నాకవి కనబడలేదు." [6]

1933, పటౌడీ కౌంటీ క్రికెట్‌ ఆడిన ఏకైక పూర్తి సీజను. ఆ సీజనులో అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మళ్లీ వోర్సెస్టర్‌లో ఫ్రీమాన్‌ను చితక్కొట్టి మరో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. 49 సగటుతో 1749 పరుగులతో సీజను ముగించాడు. కానీ 1934 ప్రారంభంలో మరింత అద్భుతమైన బ్యాటింగ్ చేసిన తర్వాత అతని ఆరోగ్యం దెబ్బతింది. ఆడింది పది గేమ్‌లే అయినప్పటికీ 91.33 బ్యాటింగ్ సగటు నమోదు చేశాడు. అతను 1934 జూన్‌లో ఇంగ్లాండ్ తరపున ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తన మూడవ, చివరి టెస్టులో 12, 10 పరుగులు చేశాడు. పటౌడీ 1935, 1936లో అస్సలు ఆడలేదు. 1937, 1938లో మొత్తం ఐదు సార్లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ, ఈ గేమ్‌లలో అతను చాలా బాగా బ్యాటింగ్ చేశాడు, బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్న వోర్సెస్టర్‌షైర్, అతను మరింత తరచుగా ఆడలేనందుకు విచారం వ్యక్తం చేస్తూండేది.

1932లో లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అతను భారత జట్టుకు కెప్టెన్‌ అవుతాడని అనుకున్నారు. కానీ అతని పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అతను వాస్తవానికి 1936లో ఇంగ్లండ్‌లో జరిగిన భారత పర్యటనకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ ఆరోగ్య కారణాలతో చివరి క్షణంలో వైదొలిగాడు. అతను 1946 లో ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా ఉన్నప్పుడు భారతదేశం తరపున ఆడాడు. పర్యటనలో 46.71 సగటు ఉన్నప్పటికీ, అతను 5 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 55 పరుగులు మాత్రమే చేశాడు. అతని కెప్టెన్సీపై కూడా విమర్శలు వచ్చాయి. అతను 1946/47లో ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అయ్యాడు. అతను 1952 కౌంటీ క్రికెట్ సీజన్ కోసం వోర్సెస్టర్‌షైర్‌కు తిరిగి రావాలని అనుకున్నాడు గానీ దానికంటే ముందే భారతదేశంలో మరణించాడు.

ఇఫ్తికర్ అలీ ఖాన్ చక్కటి హాకీ, బిలియర్డ్స్ ఆటగాడు కూడా. అతను మంచి వక్త. 2007లో, భారతదేశం తొలి టెస్టు ఆడిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, భారతదేశం, ఇంగ్లండ్‌ల మధ్య టెస్ట్ సిరీస్‌లో పాల్గొనడానికి మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ పటౌడీ పేరు మీద ట్రోఫీని ఏర్పాటు చేసింది.

మరణం, వారసత్వం మార్చు

వారి కొడుకుతో పాటు ఇఫ్తికార్, సాజిదాలకు ముగ్గురు కుమార్తెలున్నారు. 1952 జనవరి 5 న [7] అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పదకొండవ పుట్టినరోజు నాడు ఢిల్లీలో పోలో ఆడుతున్నప్పుడు ఇఫ్తికార్ గుండెపోటుతో మరణించాడు. అతని కుమారుడు అతని తర్వాత పటౌడీకి 9వ నవాబుగా నియమితుడయ్యాడు. ఆ తరువాత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. ఇఫ్తికర్ బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్‌లకు తాత కూడా.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Royalty on the cricket field". International Cricket Council. Retrieved 18 May 2018.
  2. "Herschelle the bully". ESPN Cricinfo. 16 March 2006. Retrieved 21 March 2018.
  3. Ramusack, Barbara N. (2004). The Indian princes and their states. Cambridge University Press. p. 273. ISBN 978-0-521-26727-4. The crucial document was the Instrument of Accession by which rulers ceded to the legislatures of India or Pakistan control over defence, external affairs, and communications. In return for these concessions, the princes were to be guaranteed a privy purse in perpetuity and certain financial and symbolic privileges such as exemption from customs duties, the use of their titles, the right to fly their state flags on their cars, and to have police protection. ... By December 1947 Patel began to pressure the princes into signing Merger Agreements that integrated their states into adjacent British Indian provinces, soon to be called states or new units of erstwhile princely states, most notably Rajasthan, Patiala and East Punjab States Union, and Matsya Union (Alwar, Bharatpur, Dholpur and Karaulli).
  4. The Hindu, Sunday, 3 Aug 2003 - Royal vignettes: Pataudi: The Afghan connection
  5. Babar, Um-E-Aymen (Spring 2022). "Choose Your Side". The Nightwatchman. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  6. Williamson, Martin (25 October 2007) Rubbing almost everyone up the wrong way. Cricinfo
  7. "Making Britain: Iftikhar Ali Khan". Open University.