కాటూరి వేంకటేశ్వరరావు
కాటూరి వెంకటేశ్వరరావు ఒక తెలుగు కవి, రచయిత, నాటకకర్త, అనువాదకుడు. జన్మస్థలం కాటూరు (వుయ్యూరు) . ఇతను బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతను,, పింగళి లక్ష్మీకాంతం కలిసి పింగళి కాటూరి కవులు అనే జంటకవులుగా ప్రసిద్దులయ్యారు. ఇద్దరూ కలిసి శతావధానాలు చేశారు. కావ్యాలు వ్రాశారు.
జీవిత విశేషాలు సవరించు
ఇతడు 1895, అక్టోబరు 15వ తేదీన కృష్ణాజిల్లా, వుయ్యూరు మండలం, కాటూరు గ్రామంలో జన్మించాడు.[1] ఇతని తల్లిదండ్రుల పేర్లు రామమ్మ, వెంకటకృష్ణయ్య. ఇతడు కాటూరు, గుడివాడలలో ప్రాథమిక విద్యను ముగించుకుని, బందరు హిందూ హైస్కూలులో స్కూలు ఫైనలు పూర్తిచేసుకుని ఇంటర్మీడియట్, బి.ఎ. బందరులోనే చదివాడు. మహాత్మా గాంధీ ప్రభావంతో సహాయనిరాకరణ ఉద్యమంలోను, ఉప్పు సత్యాగ్రహంలోను చురుకుగా పాల్గొన్నాడు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలుశిక్షను అనుభవించాడు.
ఇతడు 1933-39 సంవత్సరాల మధ్య ఆంధ్రోపన్యాసకుడిగా, 1939-43ల మధ్య వైస్ ప్రిన్సిపాల్గా, ప్రిన్సిపాల్గా పనిచేశాడు. 1945-53ల మధ్య కృష్ణా పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు.
రచనలు సవరించు
- సౌందరనందము (పింగళి లక్ష్మీకాంతంతో కలిసి)
- పౌలస్త్య హృదయము (పింగళి లక్ష్మీకాంతంతో కలిసి)
- తొలకరి (పింగళి లక్ష్మీకాంతంతో కలిసి)
- శ్రీనివాస కళ్యాణము
- తెలుగు మల్లెమాల
- మువ్వగోపాల పదములు (క్షేత్రయ్య కృతులు) - రవి కుమార్తో కలిసి
- స్వప్న వాసవదత్తము - భాసుని కృతికి తెలుగు సేత
- మువ్వ గోపాల - శ్రవ్య నాటికలు
- ప్రతిజ్ఞా యౌగంధరాయణము (భాసుని నాటకము)
- గాంధీజీ స్వీయ చరిత్ర - అనువాదం
- మన వారసత్వము (కబీర్)
- చిరంజీవి ఇందిరకు (నెహ్రూ లేఖలు)
- గాంధీ మహాత్ముడు (రోమారోలా రచన)
- సత్య శోధన (గాంధీ ఆత్మకథ)
- తెలుగు కావ్యమాల
- శ్రీ విశ్వేశ్వర శతకము (వేమూరి వెంకటరాయశర్మతో కలిసి)
- పన్నీటిజల్లు (ఖండకావ్యముల సంపుటి)
- జగద్గురు బోధలు (కంచి పీఠాధిపతి బోధనలు)
- సాహిత్య దర్శనము
మరణము సవరించు
ఇతడు 1962, డిసెంబరు 25న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు.
బయటి లింకులు సవరించు
- మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన.
మూలాలు సవరించు
- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 208–213.