కొమురం భీమ్

గిరిజనోద్యమ నాయకుడు
(కొమరం భీమ్ నుండి దారిమార్పు చెందింది)

కొమురం భీమ్, (1901 అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.[1] ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.[2] పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను అడవిని జీవనోపాధిగా చేసుకొని,అన్ని రకాల నిజాం అధికారాలను (అనగా న్యాయస్థానాలు, చట్టాలు) తోసిపుచ్చాడు. అతను నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్ (భూమి. అడవి.నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడు.

కొమురం భీమ్
జల్-జంగిల్-జమీన్ .
జననంకొమురం భీము
అక్టోబర్ 22, 1901
సంకేపల్లి, ఆసిఫాబాద్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
మరణంఅక్టోబరు 27 , 1940
జోడేఘాట్ ఆడవులు
ఇతర పేర్లుకొమురం భీమ్, గోండు బెబ్బులి.
ప్రసిద్ధిప్రత్యేకమైన ఆదివాసి రాజ్యం కోసం, స్వపరిపాలన కోసం,ఆదివాసీ హక్కులకోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప ఆదివాసి నాయకుడు.
తండ్రిచిన్నూ
తల్లిసోంబారు

బాల్యం మార్చు

కొమురం భీమ్ గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్, సోంబాయి దంపతులకు 1901 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.

ఉద్యమ జీవితం మార్చు

 
2010 అక్టోబరు 23 తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కొమురం భీము రేఖాచిత్రం

భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమురం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సామాజిక న్యాయుంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడు...

భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కెరమెరి ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు.

ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్ కు కుడిభజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు.[3] వెడ్మ రాము[4] కూడా భీమ్ కు సహచరుడిగా ఉన్నాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. నిజాం సైన్యంమీద, అటవీ సిబ్బంది పైనా కొమరం కొదమసింహం లా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940, అక్టోబర్ 27 న, అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుంచీ ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్ధంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీ.

నేటి పోరాటాలకు స్ఫూర్తి మార్చు

 
ఆదిలాబాద్ జిల్లా కుంతాల జలపాతం వద్ద కొమురం భీము విగ్రహం
 
కొమురం భీం శిలావిగ్రహం

ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక కొమురం భీమ్. స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క భీం. పోరాట పంథానే చివరకు సరైన మార్గమని, తన జాతి ప్రజలను విముక్తి చేస్తుందని అక్షరాల నమ్మిన ఆదివాసీ పోరాట యోధుడు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డభ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నది. ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భంలో భీం వర్ధంతిని ఆదివాసీ సమాజాలు జరుపుకుంటున్నాయి. స్వయంపాలన కోసం తెలంగాణ ప్రజలు అలుపు ఎరగకుండా ఉద్యమిస్తున్న సందర్భం నేడున్నది. స్వయంపాలన కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ సమాజాలను క్రూరంగా అణచివేస్తున్న ప్రభుత్వాలు కండ్లముందు కనబడుతున్నాయి. దేశంలో తమ హక్కుల సాధన కోసం ఆదివాసీ సమాజాలు ఉద్యమించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్‌లు, తిరుగుబాటు చేశారు. జల్, జంగల్, జమీన్ కోసం సాయుధ పోరాటాలు చేశారు. తమపై సాగుతున్న అన్నిరకాల దోపిడీ, పీడనలను ఎదిరించారు. చరివూతలో అనేకసార్లు ఓటమి చెందినా తమ జీవితమే యుద్ధమైన చోట తమ అస్తిత్వం కోసం అలుపెరుగని పోరాటాలు నేటికీ చేస్తున్నారు.

ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 చట్టాన్ని అమలుపర్చడంలేదు. అన్యాక్షికాంతమవుతున్న అడవులను, భూములను పట్టించుకోదు. గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె,కోయ తెగలే కాకుండా నాయక్‌పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ఆదిలాబాద్‌లో నివసిస్తున్నాయి. ఇప్పుడు వీరి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1975కు పూర్వం వలస బంజారాల జనాభా కేవలం పది వేలనని హైమన్‌డార్ఫ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వీరి జనాభా పదింతలపైన ఉంది. వలస వచ్చిన వాళ్ళు ప్రజాప్రతినిధులవడంతో వీరికష్టాలు రెట్టింపయ్యాయి. ఆదిమ సమాజం వీరి వల్ల రక్షణలను కోల్పోతున్నది. ఇలాంటి పరిస్థితిలో ఆదివాసీల మనుగడ కష్టమేనని ఆదివాసీ నాయకులు మదనపడుతున్నారు. ఆదివాసీల రక్షణ ప్రభుత్వానిదే అయినప్పుడు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావడంలేదు. ఏటా విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతున్నా, ఆదివాసులకు కనీస వైద్య సౌకర్యాలు అందడంలేదు. ప్రతిఏటా రెండు వందల నుంచి మూడు వందల మలేరియా మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారలేమితో మరణిస్తున్న పిల్లల సంగతి లెక్కేలేదు. భీం పోరాటం చేసిన ప్రాంతంలో (జోడేఘాట్) నేటికి తాగడానికి నీళ్ళులేవు. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీ సమాజాల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయి. భీం పోరాటం జరిగి డెభ్బైఏళ్లు అవుతున్నా, ఆపోరాట స్ఫూర్తినేటికీ ఉంది. అది మరోఇంద్ర పోరాట రూపంగా పెల్లుబకవచ్చు. ప్రభుత్వాలు మరో ఉప్పెన రాక మునుపే మేల్కొనాలి.

అస్తిత్వ ఉద్యమాలు కొనసాగుతున్న నేటి తరుణంలో, 1940లోనే ఆత్మగౌరవం, స్వపరిపాలన పునాదులుగా కొమురం భీం సాయుధ తిరుగుబాటు చేశాడు. అతని ముందు చూపు వివిధ ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తున్నది. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నది.

కొమురం భీము విగ్రహం మార్చు

2009 డిసెంబరు 17 న హైదరాబాదులో కొమురం భీము విగ్రహం నెలకొల్పుటకు ప్రభుత్వం ప్రకటించింది.[5]

ఇవి కూడా చూడండి మార్చు

  1. కొమరంభీమ్ (సినిమా): కొమురం భీము జీవితగాధ ఆధారంగా రూపొంది రెండు నంది పురస్కరాలను గెలుచుకున్న చిత్రం.
  2. కొమురం సూరు: జోడేఘాట్‌ వీరుడు
  3. వెడ్మ రాము

మూలాలు మార్చు

  1. "Tributes paid to Telangana martyrs". The Hindu. Chennai, India. 2005-09-18. Archived from the original on 2006-10-28. Retrieved 2014-02-04.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-29. Retrieved 2014-02-04.
  3. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (5 November 2016). "జోడేఘాట్‌ వీరుడు కుమ్రం సూరు". www.andhrajyothy.com. గుమ్మడి లక్ష్మీనారాయణ. Archived from the original on 8 November 2016. Retrieved 22 October 2019.
  4. నమస్తే తెలంగాణ, ఎడిటోరియల్ (26 October 2016). "కుమ్రం భీము మెచ్చిన రాము". www.ntnews.com. డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ. Archived from the original on 7 November 2019. Retrieved 7 November 2019.
  5. "Komaram Bheem statue to be installed in city". Chennai, India: The Hindu. 2009-12-18. Archived from the original on 2009-12-21. Retrieved 2010-01-03.

బయటి లింకులు మార్చు

కొమురం భీము 70వ వర్ధంతి వారోత్సవాలలో భాగంగా గుమ్మడి లక్ష్మీనారాయణ 23 అక్టోబరు 2010 తేదీన సాక్షి పత్రికలో వ్యాసిన వ్యాసం