బి.వి. రంగారావు (సెప్టెంబర్ 24, 1920- 1996) ప్రముఖ రంగస్థల నటుడు, కళాప్రవీణ బిరుదాంకితుడు.[1]

బి.వి. రంగారావు
జననంసెప్టెంబర్ 24, 1920
మరణం1996
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

జననం - విద్యాభ్యాసం మార్చు

రంగారావు 1920, సెప్టెంబర్ 24 న నరసింహారావు, సీతారావమ్మ దంపతులకు కృష్ణాజిల్లా, విజయవాడ సమీపంలోని తెన్నేరు లో జన్మించాడు. 12 సంవత్సరాల వయసులో తల్లి మరణించడంతో మేనమామైన తెన్నేటి చలపతిరావు దగ్గర ఉండి ఎస్.ఎస్.సి. పూర్తిచేసి విజయవాడ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగిగా చేరాడు.

రంగస్థల ప్రస్థానం మార్చు

వెంట్రప్రగడ నారాయణరావు ప్రోత్సాహంతో మారుతీ సీతారామయ్య (హార్మోనిస్టు) దగ్గర శిక్షణ పొందాడు. అనంతరం పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం మొదలైన నాటకాలలో అర్జునుడి పాత్రతో నాటకరంగంలోకి ప్రవేశించాడు. పులిపాటి వెంకటేశ్వర్లు తరువాత అర్జున పాత్రలో విశేష గుర్తింపు పొందాడు. బందా కనకలింగేశ్వరరావు ప్రోద్భలంతో ఏలూరు ప్రభాత్ నాటక సమాజంలో చేరి ఆయన పక్కన అర్జునుడు, భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం) పాత్రలలో నటించాడు.

బందా విజయవాడలోని ఆలిండియా రేడియోలో చేరడంతో, బి.వి.రంగారావు వృత్తి నటుడిగా వెలుగొందాడు. ప్రముఖ రంగస్థల నటులైన అబ్బూరి రామకృష్ణారావు, అద్దంకి శ్రీరామమూర్తి, మాధవపెద్ది వెంకటరామయ్య మొదలైన వారితో కలిసి నటించాడు. అనంతరం పీసపాటి నరసింహమూర్తి పక్కన అర్జునుడి పాత్రలో రేడియో నాటకాలలో నటించాడు. ఈయన వివిధ నాటకాలలో విభిన్న పాత్రలలో నటించినా అర్జునుడి పాత్రలోనే ఎక్కువపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 1975, సెప్టెంబర్ 30న రంగారావు ఉద్యోగ విరమణ సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించాడు. అప్పుడు విజయవాడ పట్టణ పౌరులు, కళాకారులు రంగారావును ఘనంగా సన్మానించారు. కళారంగ వికాసం కోసం కృషి చేసిన బి.వి. రంగారావును ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కళాప్రవీణ బిరుదునిచ్చి సత్కరించింది.

నటించిన పాత్రలు:

  1. అర్జునుడు (పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం)
  2. భృగుమహర్షి (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం)
  3. హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్ర
  4. శివాజీ (శివాజీ) - నెల్లూరు లో గవర్నరు చేతుల మీదుగా రజత పాత్ర బహుమతిగా వచ్చింది

మరణం మార్చు

రంగారావు 1996లో మరణించాడు.

ఇతర వివరాలు మార్చు

ఇప్పటికీ రంగారావు గాత్రాన్ని ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుంచి వినవచ్చు.

మూలాలు మార్చు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.480.