ములుకనూర్ ప్రజా గ్రంథాలయం

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం అనేది హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని ములుకనూర్ గ్రామంలో ఉంది. భీమదేవరపల్లి ప్రాంతానికి చెందిన పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనార్థం వివిధ ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పరీక్షార్థులకు ఉపయోగపడే ఒక ప్రజా గ్రంథాలయం ఉండాలని సంకల్పించి, గ్రామానికి చెందిన స్పందన ఛారిటబుల్ ట్రస్ట్, ములుకనూర్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కలిసి ఈ గ్రంథాలయం ఏర్పాటుచేశారు.[1]

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం
దేశముభారతదేశం
తరహాశాఖా గ్రంథాలయం
స్థాపితము2018 జూలై 30
ప్రదేశముములుకనూర్, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లా
గ్రంధ సంగ్రహం / సేకరణ
సేకరించిన అంశాలుపుస్తకాలు, పరిశోధన గ్రంథాలు, దిన-వార-మాసిక-పక్ష-వార్షిక పత్రికలు, చేవ్రాతలు
చట్టపరమైన జమఔను
ప్రాప్యత, వినియోగం
వినియోగించుటకు అర్హతలుఎవరైనా రావచ్చును

ప్రారంభం మార్చు

2018 జూలై 30న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, శాసన మండలి సభ్యులు సుధాకర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రాపాలి తదితరులు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రాడ్యూయేట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముల్కనూర్ గ్రంథాలయంకు కడియం శ్రీహరి 15 లక్షల రూపాయలను ప్రకటించగా, కెప్టెన్ లక్ష్మీరాంతరావు 10 లక్షల రూపాయలు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్‌కుమార్ డిజిటల్ లైబ్రరీగా మార్చుతామని ప్రకటించారు.[2]

ముల్కనూరు సాహితీ పీఠం మార్చు

ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సలహాదారు వేముల శ్రీనివాస్ తన మిత్రులతో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా కథా సాహిత్యం గురించి చర్చించినప్పుడు కథా రచయితలకు ప్రోత్సాహం పెద్దగా లేదని, తెలుగు కథను, కథా రచయితలను గుర్తించే ప్రయత్నం చెయ్యాలని, కొత్త రచయితలను గుర్తించాలని అనుకున్నారు. అందుకోసమై నమస్తే తెలంగాణ దినపత్రిక సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డిని సంప్రదించగా ఆయన తాము కూడా ఇలాంటి ఆలోచనే చేస్తున్నట్టు చెప్పారు. తెలుగు కథకు కొత్త వెలుగులు తీసుకురావాలని నిశ్చితాభిప్రాయానికి వచ్చిన నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా కథల పోటీని నిర్వహించి ప్రథమ బహుమతిగా యాభై వేల రూపాయలు ఇవ్వాలని నిశ్చయించినారు. అలా 2019లో మొదలైన కథల పోటీలు ఏటేటా విస్తృతమై 2021 నుంచి ముల్కనూరు సాహితీ పీఠం - నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.

ఇప్పటి వరకు నిర్వహించిన పోటీలు మార్చు

ఈ గ్రంథాలయం ఆధ్వర్యంలో 2019 నుంచి ప్రతి సంవత్సరం కథల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో గెలిచిన కథలు నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బతుకమ్మలో ప్రచురితమౌతున్నాయి. అంతేకాకుండా బహుమతి కథలతో ప్రతి సంవత్పరం ఒక కథాసంకలనాన్ని కూడా ప్రచురిస్తున్నారు.[3]

  1. 2019: ఈ పోటీలో 22 కథలు బహుమతులకు ఎంపికైనాయి
  2. 2020: ఈ పోటీలో 50 కథలు బహుమతులకు ఎంపికైనాయి
  3. 2021: ఈ పోటీలో 64 కథలు బహుమతులకు ఎంపికైనాయి[4]
  4. 2022: ఈ పోటీలో 70 కథలు బహుమతులకు ఎంపికైనాయి[5]

మూలాలు మార్చు

  1. "ములుకనూర్ ప్రజా గ్రంథాలయం". Retrieved 2023-08-03.
  2. "ఎడ్యుకేషన్ హబ్‌గా తెలంగాణ". andhrabhoomi.net. Archived from the original on 2023-08-04. Retrieved 2023-08-04.
  3. "కథ - 2019, 2020". Retrieved 2023-08-03.
  4. telugu, NT News (2022-03-01). "ముల్కనూర్ ప్రజా గ్రంథాలయ కథల పోటీ విజేతలు వీరే". www.ntnews.com. Archived from the original on 2022-03-01. Retrieved 2023-08-04.
  5. telugu, NT News (2023-03-30). "కథల పోటీ 2022 విజేతల జాబితా". www.ntnews.com. Archived from the original on 2023-03-28. Retrieved 2023-08-04.