వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 44వ వారం

తూర్పు కనుమలు

తూర్పు కనుమలు భారత ద్వీపకల్పపు తూర్పు సముద్ర తీరం వెంట ఉండే విచ్ఛిన్నంగా విస్తరించిన కొండల వరుస. ఉత్తర ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాన తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల గుండా కూడా పోతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులు - గోదావరి, మహానది, కృష్ణ, కావేరి - తూర్పు కనుమలను ఒరుసుకుంటూ, ఖండిస్తూ ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తాయి. తెలంగాణాలో 965 మీ ఎత్తు కలిగిన దోలి గుట్ట ఎత్తైన శిఖరం. తమిళనాడులో ఒడైక్కన్ బెట్ట ఎత్తైన శిఖరం. ఒడిషాలో 1672 మీ ఎత్తు కలిగిన దియోమాలి ఎత్తైన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లో 1680 ఎత్తు కలిగిన ఆర్మకొండ అత్యంత ఎత్తైన ప్రాంతం. కర్ణాటక లో తూర్పు కనుమల్లో భాగమైన బిఆర్ పర్వతశ్రేణులు అక్కడక్కడా 1800 మీ పైగా ఎత్తు కలిగి ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ఎత్తైన కట్టాహి బెట్ట 1822 మీ ఎత్తు కలిగి ఉంది. ఈ పర్వతశ్రేణిలో తమిళనాడులో తలమలై పర్వశ్రేణులు ఎత్తైనవి. ఆంధ్రప్రదేశ్ లోని అరకు కొండలు ఎత్తులో మూడవ స్థానంలో ఉన్నాయి.

ఈ పర్వత శ్రేణులు బంగాళాఖాతపు తీరరేఖకు సమాంతరంగా నడుస్తాయి. తూర్పు కనుమలకు పశ్చిమాన, పశ్చిమ కనుమల వరకూ విస్తరించి ఉన్న ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటారు. కోరమాండల్ తీరప్రాంతంతో సహా తీర మైదానాలు తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికీ మధ్య విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు పడమటి కనుమలంత ఎత్తు లేవు.
(ఇంకా…)