షావుకారు (ఇరుగు పొరుగుల కథ) 1950 లో విడుదలైన తెలుగు సినిమా.

షావుకారు
(1950 తెలుగు సినిమా)

అప్పటి సినిమా పోస్టరు [1]
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం నాగిరెడ్డి,
చక్రపాణి
రచన చక్రపాణి
కథ చక్రపాణి
తారాగణం షావుకారు జానకి,
నందమూరి తారక రామారావు,
గోవిందరాజులు సుబ్బారావు,
ఎస్.వి.రంగారావు,
శాంతకుమారి,
పద్మనాభం,
వల్లభజోస్యుల శివరాం,
వంగర,
కనకం,
శ్రీవాత్సవ,
మాధవపెద్ది సత్యం,
మోపర్రు దాసు
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
కృష్ణవేణి జిక్కి,
ఎమ్.ఎస్.రామారావు,
పిఠాపురం నాగేశ్వరరావు,
బాలసరస్వతీరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం మార్కస్ బార్ట్‌లే
కళ మాధవపెద్ది గోఖలే
కూర్పు నాగిరెడ్డి
నిర్మాణ సంస్థ విజయా వారి చిత్రం
విడుదల తేదీ 7 ఏప్రిల్ 1950
నిడివి 177 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సంక్షిప్త చిత్రకథ మార్చు

వడ్డీ వ్యాపారం చేసుకునే చెంగయ్య (గోవిందరాజుల సుబ్బారావు), రామయ్య (శ్రీవాత్సవ) ఇరుగుపొరుగు కుటుంబాలవారు. చెంగయ్య కొడుకు సత్యం (యన్.టి.రామారావు). చెంగయ్య దగ్గర పనిచేసే రౌడీ సున్నం రంగడు (యస్.వి.రంగారావు) బాకీలు వసూలుచేసి పెడుతుంటాడు. రామయ్య కొడుకు నారాయణ. కూతురు సుబ్బులు (జానకి). కోడలు శాంతమ్మ. ఈ రెండు కుటుంబాల మధ్యా ఆప్యాయతలు వెల్లివిరిసేవి. సుబ్బుల్ని తన కోడలుగా చేసుకోవాలని చెంగయ్య కోరిక. చెంగయ్య తండ్రి హయాములో ఒక ధర్మ సత్రం కట్టించారు. అందులో బీదాబిక్కీ జనంవుంటుంటారు. బంగారయ్య అనే వ్యాపారి తన పెద్దకొడుకు వరాలు (రేలంగి) సత్రంలో ఒక పక్క కొట్టు పెట్టుకుంటాడని, సత్రంలో వుండే వాళ్ళూ ఉండవచ్చని, అవసరమైతే అద్దె కూడా ఇస్తామని చెబుతాడు. రంగడు, పంతులు మాటల మీద చెంగయ్య మౌనంగా అంగీకరిస్తాడు. ఐతే కొట్టు పెట్టిన తొలిరోజే బంగారయ్య కొడుకులు అక్కడ ఉన్న జనాలను వెళ్లగొడతారు. గుడ్డి తాత సామాను కూడా రగిరాటు వెయ్యడం చూసిన గ్రామస్థులు కొట్టులో సామాను బయట పారవేస్తారు. బంగారయ్య కొడుకులతో చెంగయ్య దగ్గరకు వచ్చి గ్రామస్థులు చెంగయ్యను అవమానించారని చెబుతాడు. పోలీసు పంచాయతీలో చంగయ్యకు ధర్మసత్రం పట్ల ఉన్న హక్కుగురించి పంతులు (వంగర), రామయ్య సాక్షమిస్తారు. రామయ్య చెంగయ్యకు సత్రాన్ని అద్దెకు ఇచ్చే హక్కు లెదని చెప్పడంతో చెంగయ్య కోపగిస్తాడు. రెండు ఇళ్ళకు మధ్య ఉన్న తలుపు మూసేపిస్తాడు. సత్యం తండ్రిని విడిచి పట్నం వెళ్ళి పోతాడు. రంగడి మాటలతో చెంగయ్య కోపం పెరుగుతుంది. తనకు రావలసిన బాకీ కోసం రామయ్య పైవత్తిడి తెచ్చాడు. నారాయణ కొంచెం దుడుకు మనిషి. నారాయణ భార్య నగలు అమ్మి తీర్చబోతే అంతకు ముందు రామయ్య కొంత బాకీ తీర్చగా దానికి నోటుమీద చెల్లువేయలేదు. ఆ విషయాన్ని దాచిపెట్టి పూర్తిగా చెల్లించమంటాడు చెంగయ్య. రాత్రివేళ రంగడు నారాయణ పంటను తగులబెట్టబోతే నారాయణ కొడతాడు. చెంగయ్య దగ్గరకు వచ్చి నారాయణ చెంగయ్యను దూషిస్తుంటె ఉప్పు తిన్న వాడిగా అడ్డుకున్నానని అందుకు నారాయణ తనను కొట్టాడని చెబుతాడు. చెంగయ్య తప్పుడు కేసు పెట్టిస్తాడు. చెంగయ్య దగ్గరకు వచ్చి తన అన్నను క్షమించమంటుంది. చెంగయ్య అంతా తనచేతులనుండి దాటిపోయిందని చెబుతాడు. నారాయణ జైలుపాలౌతాడు. పట్నంలో కొడుకును చూడడానికి వెళ్ళిన చెంగయ్య, తన కొడుకు సత్యం జైల్లో వుండడాన్ని తెలుసుకుంటాడు. నిజానికి సత్యంకూడా చేయని నేరానికి స్నేహితుని కుట్రవల్ల జైలు పాలవుతాడు. అప్పీలు కోసం దరఖాస్తు పై సంతకం పెట్టమంటే సత్యం తిరస్కరిస్తాడు.తనప్రమేయంతో కొన్ని, తన ఉదాసీనతతో కొన్ని, తనకు తెలియకుండా జరిగిన సంఘటనలు కొన్ని ఈ స్థితి కల్పించాయని చెంగయ్యకు అర్ధమౌతూ ఉంది. రంగడు తనపెరు చెప్పి అప్పులు తిసుకుంటున్నట్టు తెలుస్తుంది. వాడిని తన బాకీలు వసూలు చేయవద్దని చెబుతాడు. రంగడు తామిద్దరు కలిసి చాలా పనులు చేసామని అవి గుర్తుంచుకోమని చెబుతాడు. ఐతే ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెంగయ్య చెబుతాడు. స్వతహాగానే అంతర్ముఖుడు, ముభావి ఐన చెంగయ్య మరింత ఒంటరి ఐపోయాడు. గత దీపావళి నుండి ఈ దీపావళి వరకు జరిగి మార్పులు తెలుస్తున్నాయి. ఈలోగా చెంగయ్యకు ఎదురు తిరిగిన రంగడు చెంగయ్య ఇంటిని దోచుకోవాలని పథకం వేస్తాడు. పథకం గురించి కూపీ లాగిన రామి (కనకం) సుబ్బులుకు చెబుతుంది. చెంగయ్య మావ మీద కోపంతో సుబ్బులు ఈ విషయం రహస్యంగాఉంచుతుంది. మనసు నెమ్మళించక వదినకు ఈ విషయం చెబుతుంది. శాంతమ్మ బుర్రకథ దగ్గరకు వెళ్ళిన మావగారికి ఈ సంగతి చెప్పడానికి వెళుతుంది. ఈ లోగా సుబ్బులు ఉండబట్టలేక గోడదూకి చెంగయ్యను నిద్రలేపుతుంది. అనుకోకుండా వచ్చిన సుబ్బుల్ని చూసి ప్రమాదాన్ని పట్టించుకోకుండా సంతోషపడి పోతాడు. సుబ్బులు రంగడి సంగతి చెప్పి బయటకు వెళ్ళిపోదామని బతిమాలుతుంది. సుబ్బులు ఎంతచెప్పినా చెంగయ్య బయటకు రాడు. రంగడు, దొంగలతోవచ్చి స్తంభానికి కట్టి హింసించినా ఇనపపెట్టె తాళాల ఆచూకీ చెప్పాడు. సుబ్బుల్ని కూడా హింసించడం మొదలు పెట్టగానే తాళాలు ఎక్కడౌన్నది చెప్పేస్తాడు. పెట్టె తాళం తెరిచేసమయానికి రామయ్య గ్రామస్స్తులతొ వచ్చి రంగడిని, అతని బృందాన్ని బంధిస్తారు. రామయ్య కుటుంబానికి ఎంతో అన్యాయం చేసినా వారు తనను రక్షించినందుకు చెంగయ్య పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. సత్యం, నారాయణ జైలునుంచి తిరిగి వస్తారు. సత్యంతో సుబ్బులుకు పెళ్ళి జరుగుతుంది.

చిత్రవిశేషాలు మార్చు

 
మరొక పోస్టరు
చెంగయ్య పాత్ర చిత్రణ.
  • చిత్ర మకుటం షావుకారు. ఆ పాత్ర చిత్రకథలో ప్రతి నాయకుడు వంటిది. మరొ వైపు నుండి చూస్తే చిత్రకథానాయకుడూ ఆయనే.
  • చక్రపాణి రూపొందించిన ఈ పాత్ర సాధారణ చిత్రాలలోని విలన్ పాత్రలకు ఎంతో భిన్నమైనది.మనుషులకు, పెద్దకుటుంబాలలో వ్యక్తులకు సహజమైన భావోద్వేగాలు ఈ పాత్రలో కనిపిస్తాయి.
  • చిత్రకథను గమనిస్తే షావుకారు వడ్డీ వ్యాపారం చేసినా మిగతావారిని పీడించే పాత్రగా కనపడదు.ధనంపట్ల ప్రీతి ఉంది అదేసమయంలో మిగతామనుషులపట్ల నమ్మకంకూడాఉంది. (సుబ్బులు చిల్లర ఇచ్చినపుడు, అందులో తక్కువైన నాణెంకోసం వెదుకుతాడే కాని సుబ్బుల్ని అనుమానించడు.)
  • ప్రారంభంలో రంగడు దొంగసొమ్ము తెచ్చినపుడు కొంత అయిష్టత ప్రదర్శిస్తాడు.
  • బంగారయ్య సత్రానికి అద్దె ఇస్తానన్నపుడు మౌనంగానే ఉంటాడు.
  • రామయ్య తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినప్పుడు మిత్రద్రోహంగా దానిని భావించాడు.
  • బాకీ రద్దువిషయంలో నారాయణ దుడుకుతనం ప్రదర్శించకపోతే వెయ్యి రూపాయల జమ ఒప్పుకుని ఉండెవాడేమో కూడా
  • తనకు తెలియకుండా అప్పుచేసిన రంగడిని వదుల్చుకోవడం హటాత్తుగా జరిగిందికాదు.
  • చెంగయ్యలో పశ్ఛాత్తాపంకూడా ఒక్కసారిగా జతరిగింది కాదు. పాత్రలోని అంతరంగకల్లోలం చిత్రపొడుగూతా అవగతమౌతూనే ఉంది.అర్ధ రాత్రి సుబ్బుల్ని గుమ్మంలో చూసిన చెంగయ్య స్పందన తెలియజెస్తుంది. తను చేస్తున్నది మంచో చెడో తెలుసుకోలేని అవివేకి కాదు చెంగయ్య పాత్ర. నిజాన్ని ఒప్పుకోవడంలో అడ్డువచ్చే అభిజాత్యం అతనిలో ఎక్కువ. 'నీచెంగయ్య మావ ఎవరినమాటా వినడే' అంటాడు సుబ్బులుతో.

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

చిత్రీకరణ మార్చు

షావుకారు చిత్రం వాహినీ స్టూడియోలో చిత్రీకరించారు, అప్పుడే స్టూడియో నిర్మాణం పూర్తిఅవుతూండడంతో వాహినీ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రంగా షావుకారు నిలిచింది.[1]

పాటలు మార్చు

  1. ఇంతేనన్నా నిజమింతేనన్నా గుట్టురెరిగిన గురురాయలు - మాధవపెద్ది సత్యం
  2. ఏమనెనే చిన్నారి ఏమనెనే వన్నెల సిగపువ్వా కనుసన్నలలో - ఘంటసాల
  3. తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు - రావు బాలసరస్వతీ దేవి, ఘంటసాల
  4. తెలుపవేలనే చిలుకా పలుకవేలనే బదులు పలుకవేలనే - రావు బాలసరస్వతీ దేవి
  5. దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి మాయింట- రావు బాలసరస్వతీ దేవి
  6. దీపావళి దీపావళి ఇంటింట ఆనంద - రావు బాలసరస్వతీ దేవి, శాంతకుమారి బృందం
  7. పలుకరాదటే చిలుకా సముఖములో రాయభారమెందులకే - ఘంటసాల
  8. భాగవత పఠనం - ఎం. ఎస్. రామారావు
  9. బలే దొరలకు దొరకని సొగసు అనువుగ దొరుకును రంగయ్య - టి. కనకం
  10. మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా - మాధవపెద్ది సత్యం
  11. వలపుల వలరాజా తామసమిక చాలురా విరిశరములకిక - జిక్కి, పిఠాపురం
  12. విరహవ్యధ మరచుకథ తెలుపవే ఓ జాబిలి - పిఠాపురం, జిక్కి
  13. శ్రీలుచెలంగే భారతభూమిన (హరికథ) - ఘంటసాల (మోపర్రు దాసు వ్యాఖ్యాంతో)

మూలాలు మార్చు

  1. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
"https://te.wikipedia.org/w/index.php?title=షావుకారు&oldid=3679647" నుండి వెలికితీశారు