పసుమర్తి కృష్ణమూర్తి

పసుమర్తి కృష్ణమూర్తి (1925 నవంబరు 12 - 2004 ఆగష్టు 8) ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనుల పండుగగా అనిపించే నాట్యాలను తెర మీద ఆవిష్కరించాడు పసుమర్తి కృష్ణమూర్తి. ఏ గందరగోళం లేకుండా, మనోహరంగా రూపొందించాడు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలోని నృత్యాల రూపశిల్పి కృష్ణమూర్తి.

పసుమర్తి కృష్ణమూర్తి
జననంనవంబరు 12, 1925
కూచిపూడి, కృష్ణా జిల్లా,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం
మరణంఆగష్టు 8, 2004
చెన్నై, తమిళనాడు
నివాస ప్రాంతంమద్రాసు
ఇతర పేర్లుపసుమర్తి
వృత్తినృత్యదర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1947 నుండి 1990ల వరకు
మతంహిందూమతం
పిల్లలుఆరుగురు సంతానం
తండ్రిపసుమర్తి రామయ్య
తల్లిఆదిలక్ష్మి

తొలి జీవితం మార్చు

ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. చదువులో వెనుకబడితే, దాన్ని మళ్లీ పట్టుకుని ఇంటి దగ్గరే తెలుగు, సంస్కృతం నేర్చుకున్నారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేర్చుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా అభ్యసుంచకపోయినా, నాట్యంతో పాటే అదీ అలవడింది. కూచిపూడి నాట్య నీష్ణాతులు 'పద్మశ్రీ' స్వీకర్త - చింతా కృష్ణమూర్తి పసుమర్తికి మేనమామ. ఆయన శిష్యరికంలో మరింత శిక్షణపొంది, ఒక్కడే స్త్రీ పాత్ర ధరించి అష్టపది, జావళి, తరంగాలతో ప్రదర్శనలు ఇచ్చేవారు కృష్ణమూర్తి. అలా నాలుగైదేళ్లు గడిచాక, వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి ముగ్గురూ కలిసి నృత్యనాటికలు తయారుచేసి, జానపద నృత్యాలు కూడా కలిపి ప్రదర్శనలు ఇస్తే గొప్ప ప్రజాదరణ కలిగింది. కర్ణాటకాంధ్రలోని ముఖ్యపట్టణాలలో పెక్కు ప్రదర్శనలు ఇచ్చారు. ఒక నాలుగేళ్ల కాలంలో, వేదాంతంవారు, వెంపటివారు సినిమారంగానికి వెళ్లిపోతే, పసుమర్తివారే బృందాల్ని తయారుచేసి, జనరంజకంగా ప్రదర్శనలు ఇవ్వసాగరు.

చలనచిత్రరంగ ప్రవేశం మార్చు

ఒకసారి బెజవాడలో జరిగిన ప్రదర్శనలో స్త్రీ పాత్రలో ఉన్న కృష్ణమూర్తి నాట్యం చూసి, అబ్బురపడిన రంగస్థలనటుడు సూరిబాబు రాజరాజేశ్వరివారు నిర్మించబోయే భక్త తులసీదాసు (1946) చిత్రంలోని నాట్యదృశ్యానికి రూపం కల్పించమని అడిగారు. కృష్ణమూర్తి సంతోషించారు. ఆ చిత్రం సేలంలో నిర్మించారు. ఆ చిత్రంలో పిల్లలు వేసే నృత్యనాటిక ఉంది. ఆ చిత్ర సంగీతదర్శకుడు భీమవరపు నరసింహారావు అప్పటికే ఆ పాటను రికార్డు చేశారు. ఆ పాట విని, తాళగతిని, భావాన్నీ గ్రహించి కృష్ణమూర్తి నాట్యం రూపొందించారు. సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉండడం, మాయలేడి రావటం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం - అందులోని ఇతివృత్తం. దానికి తగ్గట్టుగా కూచిపూడి శైలిలో ఆంగికాభినయాలను కూర్చి, సినిమా టెక్నిక్‌ని తెలుసుకుంటూ, చిత్రీకరణకు సహాయపడ్డారు. అప్పుడు కృష్ణమూర్తి వయస్సు ఇరవై సంవత్సరాలు. భక్త తులసీదాసు చిత్రానికి డైరెక్టరు లంక సత్యం, తర్వాత లంక సత్యమే డైరెక్టు చేసిన చంపకవల్లి అనే తమిళ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చింది ఆయనకి. అందులోనూ ఒక నృత్యనాటిక, ఇంద్రసభలో రంభ, ఊర్వశుల నాట్యాలూ ఉన్నాయి. కృష్ణమూర్తికి మంచిపేరు వచ్చినా వెనువెంటనే అవకాశాలు రాలేదు. ఆయన మద్రాసులోనే మకాం పెట్టి, ఓ పక్క సినిమా ప్రయత్నాలు చేస్తూ, ఓ పక్క డ్యాన్సు ట్యూషన్లు చెబుతూ కాలక్షేపం చేశారు.

గుణసుందరి కథ సంగతులు మార్చు

అప్పట్లో లంక సత్యం దగ్గర ప్రముఖ దర్శకుడు డి.యోగానంద్ సహాయకుడిగా ఉండేవారు. ఆయన కృష్ణమూర్తిని ఓగిరాల రామచంద్రరావుకి పరిచయం చెయ్యడం, ఆయన కె.వి.రెడ్డికి పరిచయం చేయడం జరిగాయి. ఓగిరాల వాహిని వారి గుణసుందరి కథ (1949)కి సంగీతదర్శకుడు. కె.వి.రెడ్డి పసుమర్తి నాట్య లక్షణాలు, శక్తి సామర్థ్యాలు తెలుసుకుని, 'గుణసుందరి కథ'కి నాట్యదర్శకుడిగా నియమించారు. అదే గొప్ప ప్రవేశం, పరిచయం. గుణసుందరి కథలో రకరకాల నాట్యాలున్నాయి. వాటిని కృష్ణమూర్తి అతినైపుణ్యంతో నిర్వహించారు. వయసు మీరినట్టు కనిపించిన శాంతకుమారి, కె.మాలతికి, సున్నితమైన మూవ్‌మెంట్స్ కూర్చి కలకలా ఆ కోకిలేమో పాటని రక్తి కట్టించారు. చిటి తాళం వేస్తానంటే అని శివరావు చేసిన నాట్యం ఇంకోరకం. ఈ వనిలో కోయిలనై అని, జూనియర్ లక్ష్మీరాజ్యం చేసిన అభినయం ఇంకోరకం. ఎరుకల నాట్యంలో కృష్ణమూర్తే స్వయంగా పాల్గొని, నాట్యం చేశారు. ఇక్కడో విశేషం. ఆ పాత్రని గౌరీపతిశాస్త్రి నిర్వహించారు. కాని, నాట్యంలో కృష్ణమూర్తి నటించారు. తేడా తెలియనివ్వకుండా చిత్రీకరించినా, పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంకో విశేషం కూడా ఉంది. ఇందులో రేలంగి, గోబేరు సుబ్బారావు కలిసి, అదియే ఎదురై వచ్చేదాకా పాట పాడుతారు. రేలంగికి రేలంగే పాడగా, సుబ్బారావుకి పసుమర్తి పాడారు.

మిగతా సినిమా జీవితం మార్చు

గుణసుందరి కథ జానపద చిత్రాల ధోరణిని మార్చింది. కథ, కథాగమనం, వినోదం, సంగీతాలతో పాటు టెక్నికల్‌గా కూడా నూతనత్వం చూపించింది. చిత్రం ఘనవిజయం సాధించడంతో, అందరికి ఖ్యాతి లభించినట్టు - కృష్ణమూర్తికి కూడా లభించింది. పరిశ్రమకి ఒక మంచి నాట్యదర్శకుడు లభించాడు. పి.పుల్లయ్య తీసిన తిరుగుబాటు (1950) చిత్రానికి కృష్ణమూర్తి పనిచేసిన తరువాత, విజయా సంస్థ ఆరంభం కావడంతో, అక్కడ చేరి ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968) వరకూ నాట్యదర్శకుడిగా పనిచేశారు - కొన్ని ఇతర చిత్రాలకు చేస్తూనే.

ప్రసిద్ధి చెందిన నాట్య రూపకాలు మార్చు

సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించే నాట్య రూపకాలు చరిత్రలో నిలిచిపోయే రీతిలో ఉంటాయి. అలాచూస్తే మల్లీశ్వరిలో ఉషాపరిణయం యక్షగానం, మాయాబజార్లో మోహినీ భస్మాసుర ముఖాభినయం, పెళ్ళి చేసి చూడు (1952)లో ఊర్వశి, అర్జునుడు స్వప్నదృశ్యం లాంటివి కొన్ని. (రహస్యంలో గిరిజా కల్యాణం ఇంకొక ఉదాహరణ.) మల్లీశ్వరిలో ఉషాపరిణయం సంగీత, సాహిత్య, నాట్యమయమై కళాశోభితంగా కనిపిస్తుంది. ఈ నాట్యరూపకం రూపొందే ముందు, రచయిత కృష్ణశాస్త్రి, సంగీత దర్శకుడు రాజేశ్వరరావు, నాట్యదర్శకుడు కృష్ణమూర్తి నెల రోజులకు పైగా చర్చలు చేసిన తర్వాత, కృష్ణమూర్తి డాన్స్ కంపోజింగ్‌కి, రిహార్సల్స్‌కి ఇంకో నెలరోజులు పట్టింది. అంతటి కృషితో సాధించినది గనకే, ఆ రూపకానికి అంతటి పేరు. మాయాబజార్లోని మోహిని భస్మాసుర - కథకళి శైలిలో రూపొందించారు. సాహిత్యం లేకుండా వాద్య గోష్ఠితోనే సాగి, అధ్బుతంగా అలరించింది ఆ నాట్యం. పాతాళ భైరవిలోని మాయామహల్లో జరిగే నాట్యప్రదర్శనలు, మాయాబజార్‌లోని పెళ్ళి కుమారా రావయ్యా ఆహ్వాన గీతం, నాట్యాలూ మహా అధ్భుతం. ఈ నాట్యాలు పసుమర్తివారి శ్రమకి గీటురాళ్లు.

హాస్య నాట్య రూపకాలు మార్చు

కృష్ణమూర్తి లో ఉన్న ఇంకో ప్రజ్ఞ - హాస్య నటులైతే ఆ ధోరణిలో కంపోజ్ చేయడం. పాతాళ భైరవిలో రేలంగి పాడిన వినవే బాలా; శ్రీ కృష్ణార్జున యుద్ధంలో అంచెలంచెల దానికి ఉదాహరణలు. ఈ పాటలో అల్లు రామలింగయ్య కదలికలు కడుపుబ్బ నవ్విస్తాయి. మాయాబజార్‌లో సుందరి నీవంటి దివ్య స్వరూపమూ పాట కూడా అటువంటిదే.

ఇతర విశేషాలు మార్చు

ఆయన పనిచేసిన దాదాపు 200 చిత్రాల్లో దక్షిణ భాషా చిత్రాలున్నాయి; సాంఘికాలు, చరిత్రకాలు, పురాణాలూ అన్నీ ఉన్నాయి. ఆయన చివరి చిత్రం భైరవద్వీపం (1994), ఆ చిత్రంలో శ్రీతుంబర నారద పాటలో కనిపించే నాట్యవిన్యాసాలు కృష్ణమూర్తి సృష్టించారు.

ముఖ్య చిత్రాలు మార్చు

మూలాలు మార్చు

లింకులు మార్చు